Kasi Majili Kathalu Episode 65 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : గురుదత్తుడు తన తండ్రికి లేకలేక పుట్టిన ఏకైక సంతానం. గదాధరుడనే స్నేహితునితో కలిసి, తనకు తగిన కన్యను అన్వేషిస్తూ దుర్గానగరం చేరుకున్నాడు. అక్కడ పద్మినిని వివాహం చేసుకుని ఇల్లరికం ఉండిపోయాడు. దుర్గానగరం పాలకుడైన సురూపుడు ఒకసారి పద్మినిని చూసి, వ్యామోహంలో పడ్డాడు.
“గోమినీ! ఆ పద్మినిని కనుక, నాకు అనుకూలవతిని చేసినట్లయితే.. లక్ష వరహాలు బహుమానం ఇస్తాను” అని చెప్పాడు సురూపుడు.. తన క్రీడాసౌధంలో సేదతీరుతూ. అందుకు గోమిని.. “రాజా! అది నాకు చిటికెలో పని. అయితే ఒకసారి మీరు ఆ ఇంటికి వెళ్లి, ఆమె కంటపడి రండి. ఆ తరువాతి కథ నేను నడిపిస్తాను” అన్నది.
ఆమె మాట ప్రకారమే ఒకనాడు కుముదాంగదుని కలిసినప్పుడు.. “మొన్న ఊరేగింపు సమయంలో నీ ఇల్లు చూశాను. మంచి అభిరుచితో చాలా చక్కగా కట్టించావు” అన్నాడు యథాలాపంగా సురూపుడు.
“నిజమా రాజా! ఒకసారి తమరు మా ఇంటికి దయచేయాలి” అన్నాడు మొగమాటానికి కుముదాంగదుడు. “అయితే పద.. చూద్దాం!” అంటూ అప్పటికప్పుడు బయల్దేరదీశాడు సురూపుడు. వాకిట్లోనే గురుదత్తుడు ఎదురయ్యాడు.
“ఇతను మా అల్లుడు” అని పరిచయం చేశాడు కుముదాంగదుడు. “కోటీశ్వరుడైనా.. విద్యలలో నిధి అయినా, నా బలవంతం కొద్దీ ఇల్లరికానికి ఒప్పుకొన్నాడు” అని చెప్పాడు.
“ఇతణ్ని కూడా రేపటినుంచి కొలువుకు తీసుకురా. నీతోపాటు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు” అని చెప్పాడు సురూపుడు పద్మిని కోసం వెతుకుతూ.
మహారాజు ఔదార్యానికి పొంగిపోయాడు కుముదాంగదుడు. “చిత్తం మహారాజా!” అన్నాడు వినయంగా. రాజుకు తన శక్తిమేరకు అతిథి మర్యాదలు సాగించాడు. ఎంతోసేపు వేచి ఉన్నా కానీ సురూపునికి, పద్మిని సాక్షాత్కారం లభించలేదు. నిరాశ చేసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తరువాత రెండురోజులకు గోమిని వెళ్లింది. పద్మినికి అనేక బహుమానాలు తీసుకువెళ్లింది. ఆమె బుగ్గలు పుణికి..
“అమ్మాయీ! నీ అదృష్టాన్ని మాబోటివారు కొనియాడలేరు. నీ రూపం ముల్లోకాలనూ మోహింప చేయగలదు. నీ బుద్ధి బృహస్పతికి వంకలు పెట్టగలదు. విద్యలకు సరస్వతివని, ధనంలో కుబేరునికి అప్పు పెట్టగలవని చెప్పుకొంటారు. ఇన్ని మంచి లక్షణాలు ఒక్కచోట ఉండటం గొప్ప సంగతి కదా! హూ.. మా మహారాణికి నీ గుణాలలో నూరోవంతు కూడా లేవు. ఆయన రసికుడు. మంచి రూపం కలవాడు. నీ ఖ్యాతిని విని చాలా మెచ్చుకున్నాడు. అందుకే నీకోసం ఈ కానుకలు పంపాడు” అని నైపుణ్యంగా మాట్లాడింది.
అందుకు పద్మిని తెలివిగా.. “గోమినీ! నీ దూతికా కృత్యాలు నాముందు ప్రదర్శించకు. నీ స్తోత్రపాఠాలకు నేనేమీ ఉబ్బిపోను. రాజు రసికుడు కావడం, స్త్రీ విద్యాలాలసుడు కావడం రాజ్యతంత్రానికి ముఖ్యం కావు. ధర్మబుద్ధి కలిగి.. ప్రజలను బిడ్డలుగా పాలించడం రాజుల కర్తవ్యం. చెడు వ్యసనాల్లో పడిపోయిన వాడి రాజ్యం వేసంగిలో మడుగులా క్షీణించిపోతుంది. అయినా నా గుణాలను అతను కీర్తించడానికి కారణం కనిపించడం లేదు. సంసార స్త్రీలతో అతనికేం పని? ఈ కానుకలు దేనికి? మరెప్పుడూ ఇలాంటివి మోసుకురావద్దు” అని చివాట్లేసింది.
గోమిని ఆ తరువాత కూడా చాలాసార్లు ఏదో ఒక నెపం పెట్టుకుని పద్మిని వద్దకు వెళ్తుండేది. మాటల మధ్యలో ఏదో ఒకరీతిగా రాజు ప్రస్తావన తెచ్చేది. పద్మిని చేత చివాట్లేయించుకుని, నీతులు చెప్పించుకుని అక్కణ్నుంచి బయటపడేది. రోజులు గడిచేకొద్దీ సురూపునికి విరహం హెచ్చుతున్నది. గోమిని తన ప్రయత్నాలలో సఫలం కాగలదనే నమ్మకం తగ్గింది. ఒకరోజున.. “గోమినీ! ఇలాంటి స్త్రీలు సామంతో దారికి రారు. రేపు వెళ్లి నా కడపటి సందేశం వినిపించు. ‘బుద్ధిగా రాజు చెప్పినట్లు వింటే తోటివారిలో గౌరవాన్ని పొంది, సామ్రాజ్య సౌఖ్యం కూడా అనుభవించగలవు. లేదంటే నిన్ను బలాత్కారంగానైనా పరాభవింపకుండా పోడు. నీ భర్తను, తల్లిదండ్రులను చెరలో పెట్టిస్తాడు. నీ సంపదనంతా లాక్కుంటాడు. ఆ తరువాత నీకు దిక్కేమిటో ఆలోచించుకో!’.. అని నిర్భయంగా చెప్పి రా” అని బోధించి పంపాడు.
ఆ మాటలను పద్మికి చెప్పింది గోమిని.
“ఆ పిచ్చిమారాజు నిన్ను వరించాడు. నీకోసం నిద్రాహారాలు మాని కృశించిపోయాడు. రాత్రింబవళ్లు పరితపిస్తున్నాడు” అని కూడా చెప్పింది.
ఆ మాటలకు పద్మిని ఉలిక్కిపడింది. కానీ, ఆ సంగతి ముఖంలో కనిపించనీయకుండా.. “గోమినీ! ఇన్నాళ్లూ రాజు మనసులో మాట ఇదీ అని స్పష్టంగా చెప్పలేదేం?! నువ్వు సందిగ్ధంగా చెబుతుంటే, నేనూ అలాగే సమాధానమిచ్చాను. ఇప్పుడు నువ్వు బాహాటంగా చెప్పావు కనుక అంగీకరిస్తున్నాను” అన్నది. గోమిని ముఖం చేటంత అయింది. “కానీ, ఎంతైనా మగనాలిని కదా! అసలే నా మగడు అనుమానం కలవాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఇన్నిసార్లు నువ్వు వస్తుంటేనే అనుమానిస్తున్నాడు. ఇంకా మహారాజును మాత్రం నేనెలా కలుసుకోగలను?! ఒక పనిచెయ్యి. నాలుగు రోజులాగి రా! మంచి ఉపాయం ఆలోచించి చెబుతాను” అని అప్పటికి గోమినిని పంపేసింది పద్మిని.
ఆమె యథాలాపంగా చెప్పినా కూడా ఆమాటే నిజమైంది. గోమినితో పద్మిని చెప్పిన మాటల్లో కొన్ని గురుదత్తుడు విన్నాడు. ఆ రోజున రాజు తమ ఇంటికి రావడం, తరువాత తన దూతికను పంపుతుండటం అతని మనసులో అనుమానానికి బీజం వేసింది. ఈనాటి పద్మిని మాటలు ఆ అనుమానాన్ని ధ్రువపరిచాయి. గురుదత్తుడు పాపం హతాశుడైపోయాడు.
‘అయ్యో! ఆ మహారాజు దీనికేదో మత్తు జల్లినట్లున్నాడు. పద్మినీజాతి యువతి మంత్రాలకు, ఔషధాలకు వశం కాదు. మహాపతివ్రత అవుతుందని కొక్కోకుడు చెప్పిన మాట యథార్థం కాదన్నమాట. దీని కపట ప్రేమను నిజమని నమ్మి, తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టాను. అయ్యయ్యో! రేపు దీని కథ వింటే గ్రామస్తులందరూ నవ్వరా! ఇప్పుడేం చేయాలి?! సలహా అడుగుదామంటే గదాధరుడు కూడా ఊళ్లో లేడు’.. అని మధన పడసాగాడు గురుదత్తుడు.
అనుకున్నట్లే నాలుగో రోజున గోమిని వచ్చింది. పద్మిని ఆమెతో ఏదో మాట్లాడింది. ఆమె సందేశాన్ని సురూపునితో చెబుతూ.. “రాజా! ఎల్లుండి అమావాస్యనాడు రాత్రి పెరటివైపునున్న పశువుల కొట్టంలోకి రమ్మంది. తలుపు తీసి ఉంచుతానంది. అక్కడొక మంచం వేసి ఉంచుతానంది. దీపం లేకపోయినా ఒక్కరాత్రికి ఎలాగో సర్దుకోమని చాలా బతిమాలింది” అని చెప్పింది గోమిని.
‘ఒక్కరాత్రికే కదా.. ఎలాగో ఒకలాగ సర్దుకుంటాను. ఒక్కసారి కలిస్తే ఆ తరువాత నా వెంటబడి వచ్చేట్లు చేయనా?! నా రూపము, నా రసికత, నా యవ్వనము ఒకసారి చవిచూసిన యువతులు ఎవరైనా విరాళి చెందకుండా ఆగగలరా?!’.. అనుకున్నాడు సురూపుడు, పదేపదే పద్మినినే మనసులో తలపోసుకుంటూ. మరోపక్క గురుదత్తుడేమో.. ‘ఆడజాతికి గుణం ఉండదని విరాగులు చెప్పే మాటే నిజం. నేను అనవసరంగా మోసపోయాను. ఇప్పుడు దీనిని విడిచిపెట్టి పోవడం కంటే ప్రతీకారం చేసి పోవడమే మేలు. అమావాస్యనాడు ఆ మంచం మీదనే ఇద్దరినీ కడతేరుస్తాను’.. అనుకుంటూ ఒక కత్తిని సంపాదించి దానిని బాగా నూరసాగాడు.
* * *
అమావాస్యనాడు తెల్లవారింది. సురూపుడు ఘడియలు లెక్కబెట్టసాగాడు. శాస్త్రం నిషేధించిన రోజైనా గడ్డం గీయించుకున్నాడు. మీసాలు దిద్దించాడు. పన్నీట జలకమాడాడు. అద్దం చూసుకుంటూ, కనుబొమ్మలు ఎగరేసుకుంటూ అలంకరణ చేసుకోసాగాడు.
సాయంత్రమైంది మొదలు అతణ్ని నిలువరించడం గోమినికి కష్టమైపోయింది.
“దేవా! రాత్రి పన్నెండు గంటలు కొట్టిన తరువాతి నిమిషంలో అక్కడ ఉండాలి. ఈలోపుగా పోయినా ఆమె తలుపు తీయదు. మనమిప్పుడే వెళ్తే వీధిలో నిలబడాలి. ఎవరైనా చూస్తే అవమానం ఎదురవుతుంది. కొద్దిసేపు తాళుకో” అని చెప్పింది.
రాత్రి పదిగంటలు కొట్టేసరికి సురూపుని శరీరం కంపించి పోసాగింది. “ఇంక నిలువలేను. పదపద” అంటూ తొందరపెడుతూ.. గోమినిని బయల్దేరదీశాడు.
మేలిముసుగులు వేసుకుని వాళ్లిద్దరూ మెల్లగా నడుస్తూ.. ఎవరైనా కనిపిస్తే చీకట్లో నక్కుతూ ఎలాగో కుముదాంగదుని పెరటి గుమ్మం వద్దకు చేరుకున్నారు.
తలుపు ఓరగా తీసి ఉండటం చూసి, సంతోషిస్తూ లోపలికి పోయి.. చీకటిలో తడుముకుంటూ మంచం ఉన్న తావును కనిపెట్టింది గోమిని. ఆ తరువాత రాజును తీసుకుపోయి మంచంపై కూర్చోబెట్టి.. “నేను వాకిట్లో ఉంటాను” అని చెప్పి వెళ్లింది.
గురుదత్తుడు ఆ రాత్రి పశువుల పాకలో తన భార్య చేస్తున్న ఏర్పాట్లన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆమె నిజంగా తప్పుడు పనికి పూనుకుందనే భావించాడు. కత్తిని మంచం పక్కన పెట్టుకుని కపటనిద్ర నటించసాగాడు.
పద్మిని మెల్లగా మంచం మీదినుంచి లేచింది. భర్త పాదాలకు నమస్కరించి, మంచంమీద అందుబాటులో ఒక కాగితం ఉంచింది. పక్క గదిలోకి వెళ్లి ఒక పదునైన బాకును సేకరించుకునే పనిలో పడింది.
ఆ సమయాన్ని కనిపెట్టి, ఆమె తన పాదాల వద్ద ఉంచిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాడు గురుదత్తుడు. అందులో ఇలా ఉంది..
‘మహాజనులారా! ఈ రాజు పరస్త్రీ లోలుడయ్యాడు. మంచిచెడ్డలు విచారించకుండా నన్ను మోహించాడు. నా తల్లిదండ్రులను, చుట్టాలను నిర్బంధించి, చెరసాలలో తోస్తానని తన దూతిక చేత కబురుచేశాడు. నావల్ల బంధువులు ఎదుర్కోబోయే పరాభవానికి, నాకెదురయ్యే మానహానికి వెరచి.. వేరే మార్గం లేక ఇలా సంహరించాను. ఇటువంటి పాపాత్ముడు రాజుగా ఉండటం కంటే ప్రజలకు మరో అపకారం లేదు. వారికి ఆ అపకారాన్ని తొలగించి.. నా తల్లిదండ్రులను, నా భర్తను ఆపదల సముద్రంలో ముంచి, ప్రాణాలు విడిచిపెడుతున్నాను. నేను చేసిన ఈ పనిని ముందుగా వారెరుగరు. కనుక వారిని ఎవరూ దండించవద్దు.
ప్రాణనాథా! నాడు దేవతా ఉత్సవంలో నన్ను చూసింది మొదలు ఈ దుర్మార్గుడు పంపే వార్తలకు మేర లేదు. మొదటే నేను ఆ విషయాన్ని మీతో చెప్పి ఉంటే ఎలా ఉండేదో.. కానీ, ధైర్యం చేసి చెప్పలేకపోయాను. తీరా చూస్తే ఇప్పుడు ప్రాణసంకటమైన స్థితి వచ్చిపడింది. ఇటువంటి స్థితిలో వేరొక గతిలేక వీణ్ని చంపి, నన్ను నేను చంపుకొంటున్నాను. నన్ను మీరు దుష్టురాలిగా తలచవద్దు. మరో జన్మంటూ ఉంటే మిమ్మల్ని సేవించుకుంటాను’..
.. ఇలా రాసి ఉన్న ఉత్తరాన్ని కళ్లు చెమరుస్తుండగా గురుదత్తుడు చదువుకున్నాడు. వెంటనే తెలివి తెచ్చుకుని, భార్యను అడ్డుకోవాలని కిందికి పరుగుతీశాడు.
అప్పటికే పద్మిని తన చేతిలోని బాకుతో సురూపుణ్ని పొడిచి చంపింది. వాడి చావుకేక గోమినికి వినిపించింది. లోనికి వచ్చి చూసి, తనను కూడా చంపుతారేమోననే భయంతో అక్కణ్నుంచి పారిపోయింది.
అటుపైన పద్మిని.. తనను తాను పొడుచుకోబోయింది. గురుదత్తుడు తటాలున వచ్చి, ఆమెను నిలువరించాడు. కౌగిట పట్టి, బాకు లాక్కుని విసిరేశాడు. ఎందుకింత సాహసం చేశావంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు. “వీణ్ని చంపి లోకానికి ఉపకారం చేశావు. దీనివల్ల నీకు పాపం అంటదు. శోకించకు” అని ఓదార్చాడు.
“నాథా! తెల్లవారేసరికి ఈ హత్య బయటపడక మానదు. రాజపురుషులు మనల్ని విడిచిపెట్టరు. నేను బలి అయితే ఎవరూ మిమ్మల్నేమీ చేయరు. ఎందుకు నన్ను రక్షించి, మీరు కష్టాల పాలుకావడం?! నన్ను మరణించడానికి అనుమతించి, మీరు వేరొకరిని పెళ్లాడి సుఖంగా ఉండండి” అన్నది పద్మిని రుద్ధమైన కంఠంతో.
“పిచ్చిదానా! నువ్వులేని సుఖం నాకెందుకు?! భయం విడిచిపెట్టు. మనిద్దరం ఈ దేశాన్ని విడిచిపెట్టి పోదాం” అని గురుదత్తుడు ఆమెకు కొన్ని ఉపాయాలు చెప్పాడు. చివరికి ఆమెను ఒప్పించాడు.
ఆ దంపతులిద్దరూ సాయంపట్టి తమ ఇంటికి దూరంగా వీధిలోని పెంటకుప్పమీద రాచపీనుగును పారేశారు. తూర్పు తెల్లవారకముందే దుర్గానగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
(వచ్చేవారం.. విడిపోయిన జంట)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం
Kasi Majili Kathalu | పరకాయ ప్రవేశం
Kasi Majili Kathalu | కామగ్రీవుని విద్యలు
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం