Kasi Majili Kathalu Episode 57 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : పుష్పహాసుడు అనే పల్లెవాడు విద్యాధికుడై, యువరాణితో ప్రేమలో పడ్డాడు. రాజద్రోహ నేరం మోపబడి, అమరావతి నగరానికి వలసపోతూ.. రేవానగరంలో తనను కలుసుకోమని యువరాణికి సందేశం పంపిస్తాడు. తన చెలికత్తె అయిన వసంతతిలకతో కలిసి ప్రయాణిస్తూ యువరాణి అనేక చిక్కులు పడింది.రేవానగరంలో స్త్రీలోలుడైన పోలయ్య పడుతున్న కష్టాలను గమనిస్తున్నది వసంతతిలక.
పోలయ్యకు తేలుకుట్టింది. ఆదరా బాదరాగా మందుకోసం అసిరిగాణ్ని ఇంటికి తరిమాడు. వాడు ఒంటరిగా తిరిగి రాకుండా.. పోలయ్య భార్యను కూడా వెంటపెట్టుకుని వచ్చాడు. ఆమె కన్నీరు పెట్టుకుంటూ మందువేసి కట్టుకట్టి..
“నీ చీకటి బాగోతాలు కట్టిపెట్టి ఇంటికి తగలడు!” అని తిట్టిపోస్తూ, పోలయ్యను వెంటబెట్టుకుని పోయింది.
వసంతతిలక ముసిముసిగా నవ్వుకుంటూ జరుగుతున్న తతంగమంతా తిలకించింది. అంతలో తెలియకుండానే తెల్లవారింది. ఆ అపరిచిత నగరంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక.. లలిత కానీ, పుష్పహాసుడు కానీ అక్కడికే రావచ్చేమో అనుకుంటూ.. గుళ్లోనే కాలక్షేపం చేయసాగింది.
దాదాపు మధ్యాహ్నం కావస్తుండగా ఆ గుళ్లోకి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆమె పరిస్థితిని గమనించి..
“అమ్మాయీ! ఎవరు నువ్వు? ఇలా ఒంటరిగా ఉన్నావేం?” అని ప్రశ్నించాడు.
“నా స్నేహితుల నుంచి దూరమయ్యాను. వారికోసం వేచి చూస్తున్నాను. నాకీ నగరంలో ఎవరూ తెలియదు స్వామీ!” అని బదులిచ్చింది వసంతతిలక.
“చూడబోతే నువ్వు భోజనం చేసినట్లు లేవు. నాతో మా ఇంటికి రా. కొద్దిగా ఎంగలి పడొచ్చు” అన్నాడు.
ఆ బ్రాహ్మణుడి పేరు ఆర్యభట్టు. వసంతతిలక అతడివెంట నడిచింది. పెరటిగుమ్మం నుంచి ఆమెను తన ఇంటిలోకి తీసుకువెళ్లి.. “కూర్చో! కాసేపట్లో నీకు భోజనం వస్తుంది” అని చెప్పి లోపలికి వెళ్లాడు ఆర్యభట్టు.
కొద్దిసేపటికి అన్నపు పళ్లెంతో వచ్చిన దాసిని చూసి వసంతతిలక ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి గుడిలోకి అప్పితోపాటు వచ్చి, అమ్మవారికి అర్ధరాత్రివేళ నైవేద్యాలు సమర్పించింది ఆవిడే! అణువణువునా రాచఠీవి ఒలికిపోతున్నది.
‘ఈవిడ దాసీ వృత్తి చేయడం ఏమిటో!?’ అనుకుంటూ తిలక భోజనం చేయసాగింది.
కొద్దిసేపటికి ఆర్యభట్టు భార్య రమాబాయి, పని మనిషి అప్పి కూడా పెరట్లోకి వచ్చారు. రమాబాయి జుట్టు విరబోసుకుని, తలకు పెద్ద కట్టు కట్టుకుంది.
“అప్పీ! నాకింకా తలనొప్పి తగ్గలేదే!” అన్నది.
ఆమె ఆ మాట అన్న మరుక్షణంలో అప్పి పూనకం వచ్చినదానిలా ఊగిపోసాగింది.
“నేను అమ్మవారిని మాట్లాడుతున్నానే!! నిన్నరాత్రి నాకు నైవేద్యాలు పెట్టావు కానీ, దానిలో పెరుగు పెట్టడం మరిచిపోయావు. ఈవేళ అది కూడా పెట్టి మళ్లీ నాకు నైవేద్యమిస్తేనే నీకు తలనొప్పి తగ్గించేది. లేదంటే ఈ నొప్పితోనే నిన్ను చంపేస్తాను” అన్నది అప్పి ఆ పూనకంలో.
రమాబాయి భయంభయంగా వణికిపోతూ అప్పికి నమస్కారం చేసింది.
“అమ్మవారూ! నువ్వు కోరుకుంటే నేనే వచ్చి నీ మొక్కు చెల్లిస్తాను. కానీ, ఆవిడే రావాలని పట్టుపడుతున్నావు కదమ్మా!! ఆవిడ ఒప్పుకొంటుందో లేదో” అన్నది.
అప్పటి వరకు వసంతతిలకకు భోజనం వడ్డిస్తున్న రాచపడుచు.. రమాబాయి వద్దకు వెళ్లి.. “అమ్మా! నన్ను మీ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. మీకు నేనామాత్రం సేవ చేయలేనా? నేను తప్పకుండా మళ్లీ వెళతాను” అన్నది అమాయకంగా.
మరుక్షణంలోనే అప్పికి పూనకం ఆగిపోయింది. రమాబాయి సంతోషిస్తూ.. “జాగ్రత్త తల్లీ!” అని రాచపడుచుతో చెప్పి లోపలికి వెళ్లిపోయింది.
జరుగుతున్న నాటకం అంతా వసంతతిలకకు పూర్తిగా అర్థమైంది.
‘ఆ పోలయ్య ఈ రాచపడుచు మీద కన్నేశాడు. డబ్బు ఎరచూపి రమాబాయిని, అప్పిని లోబరుచుకున్నాడు. వాళ్లచేత ఈమె రాత్రిపూట అమ్మవారి గుడికి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ, అసలు సంగతి రాచపడుచుకు తెలియదు. పాపం ఈ రాత్రికి ఏం జరుగుతుందో చూడాలి’ అని మనసులోనే తలపోస్తూ.. తిలక అక్కడినుంచి వెళ్లిపోయింది.
నిన్నటి గుడిలోనే ఆ రాత్రికి కూడా నిరీక్షించసాగింది. చీకటి పడి, గుడికి వచ్చే జనాలు పల్చబడిన తరువాత ముందుగా పోలయ్య వచ్చాడు. తన పనివాడు అసిరిగాడితో కలిసి ఓ పక్కగా నక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటికి దూరంగా ఎవరో ఇద్దరు నడుస్తూ రావడం కనిపించింది.
“అదుగో అప్పి ఆమెను తీసుకొచ్చేసింది. నువ్విక్కడే ఉండరా!” అని అసిరిగాణ్ణి అక్కడే ఉంచి.. తాను గుళ్లోకి వెళ్లి, అమ్మవారి విగ్రహం వెనకాల దాక్కున్నాడు పోలయ్య.
కొంతసేపటికి ఆ ఇద్దరూ గుళ్లోకి వచ్చారు. ఆరాటం పట్టలేక పోలయ్య విగ్రహం వెనకనుంచి వచ్చాడు. ఆ చీకట్లో సరిగా చూసుకోకుండానే లోపలికి వస్తున్న స్త్రీని గట్టిగా వాటేసుకున్నాడు. ఆమె “బాబోయ్!” అని గట్టిగా కేకపెట్టింది.
నిజానికి అప్పుడు వచ్చినవారు మొక్కుబడి కోసం వచ్చిన భార్యాభర్తలు. తన భార్యను ఎవరో అల్లరి పెట్టడం చూసి, సహించలేని ఆ భర్త పోలయ్యను కడుపులో ఒక్క గుద్దు గుద్దాడు.
పోలయ్య నోటివెంట ‘అమ్మా!’ అన్న కేక కూడా రాలేదు. ప్రాణాలు గుట్టుచప్పుడు కాకుండా గాల్లో కలిసిపోయాయి. అతడు చచ్చిపోతాడని ఊహించని ఆ భార్యాభర్తలిద్దరూ కొంతసేపటికి తేరుకుని, ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుని.. పోలయ్యను అమ్మవారి విగ్రహం వెనుక పడుకోబెట్టి, అక్కడినుంచి జారుకున్నారు. మరికొంతసేపటికి రాచపడుచును తీసుకుని అప్పి వచ్చింది. ఎప్పటిలాగే గుడి బయటే ఆగిపోయి, ఆమెను లోనికి పంపింది. పోలయ్యకోసం ఎదురు చూస్తున్నది. ఆ సమయంలో ఉరుములేని మెరుపులా పోలయ్య భార్య ఊడిపడింది.
“ఏమే టక్కులాడీ! నా కాపురం కూల్చడానికి ఎక్కడినుంచి దిగబడ్డావే?!” అంటూ రాచపడుచుతో తగువుకు దిగింది.
ఆ హఠాత్పరిణామానికి అమాయకురాలైన రాచపడుచు ఆశ్చర్యపోయింది. విగ్రహం వెనకాల తన భర్త నక్కి ఉన్నట్లు గుర్తించిన పోలయ్య భార్య.. “నువ్వూ ఇక్కడే తగలబడ్డావా? మీ సంగతి ఇలా కాదు. మీరిద్దరూ లోపలే చావండి” అంటూ గుడి తలుపులు మూసి, బయటినుంచి గొళ్లెం పెట్టి, అక్కడే కాపలా కూర్చుంది.
* * *
తెల్లవారింది. జనాలు పోగుపడ్డారు.
“అయ్యా! నా మొగుడు ఎవత్తినో తగులుకుని నాకు అన్యాయం చేస్తున్నాడు. మీరే న్యాయం చేయాలి” అని గ్రామప్రజలతో మొరపెట్టుకుంది పోలయ్య భార్య.
ఎవరో గొళ్లెం తీశారు. లోపలినుంచి రాచపడుచు తలవంచుకుని బయటికి వచ్చింది.
“ఆ సచ్చినోడు బయటికి రాడేం?” అన్నది పోలయ్య భార్య ముక్కు చీదుకుంటూ.
అంతలో..
“పోలయ్యగారు చచ్చిపోయారండోయ్” అని ఎవరో కేకవేశారు.
శవాన్ని బయటికి తీసుకువచ్చారు. నగర న్యాయాధికారి అయిన చమూపతి వద్దకు తీసుకుపోయారు. న్యాయవిచారణ జరుగుతుండగా అందరూ రాచపడుచు మీదే నేరం మోపారు. అప్పుడు వసంతతిలక ముందుకు వచ్చి, ఆమె అమాయకురాలనీ.. నేరమంతా పోలయ్యది, అప్పి, రమాబాయిలదేనని సాక్ష్యం చెప్పింది.
చమూపతి విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ, రమాబాయి డబ్బుతో న్యాయాన్ని కొనగలిగింది. ఫలితంగా రాచపడుచును, ఆమె పక్షాన సాక్ష్యం చెప్పిన వసంతతిలకను నేరస్థులుగా నిర్ణయించారు. వాళ్లిద్దరికీ ద్వీపాంతర వాస శిక్ష విధిస్తున్నానని చమూపతి తీర్పు చెప్పాడు.
అంతలో కొందరు రాజభటులు వచ్చి..
“అయ్యా! పుష్పహాసుడు అనేవాడు మన నగరంలో ప్రవేశించాడు” అని సమాచారం ఇచ్చారు.
“వాణ్ని బంధించి, ద్వీపాంతరవాసం పంపించమని ధనంజయ మహారాజుగారి ఆజ్ఞలున్నాయి. ఇంతకూ బంధించారా? ఎక్కడ వాడు?!” అని ప్రశ్నించాడు చమూపతి.
“అదే చిత్రం మహారాజా! మేము తరుముతుంటే పరుగెత్తి పెద్దగుడిలో దూరి, తలుపులేసుకున్నాడు. మేం తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లేసరికి.. దక్షిణపు ప్రాకారం దూకి పారిపోయాడు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉండటం వల్ల మేమెవరం సాహసించలేకపోయాం. వాడు దొరకలేదు” అని సమాధానమిచ్చారు వాళ్లు.
“ఏడిశారు చవట దద్దమ్మల్లారా! పదండి” అని చమూపతి దారితీశారు.
ఆ ఊళ్లో పెద్దగుడి అంటే వైష్ణవాలయం. ఆకాశమంత ఎత్తున్న ప్రాకారాలతో, విశాలమైన ప్రాంగణంలో ప్రాచీన కాలంలో నిర్మించిన కట్టడం అది. చమూపతి తన సైనికులతో కలిసి ఆలయంలో పరిశోధిస్తున్నాడు. ఆ సమయంలో ఆలయ అర్చకుడు బిక్కుబిక్కుమంటూ అక్కడికి వచ్చాడు.
“అయ్యా! వాడు గుళ్లో దూరి తలుపులు వేసుకున్న సమయంలో నేను లోపలే ఉన్నాను” అని చెప్పాడు.
“అవునా?..” అన్నాడు చమూపతి తల ఊపుతూ.
“నిజమేనండీ. అదుగో దూరంగా ఆ గోడమీద వాడేదో రాశాడు. ఇంతలో సైనికులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించడంతో గోడ దూకి పారిపోయాడు” అని చెప్పాడు అర్చకుడు.
“వాడేం రాశాడో చూపించు” అడిగాడు చమూపతి.
అర్చకుడు ఆ గోడ చూపించాడు. అందులో పద్యరూపంలో ఏదో సందేశం కనిపించింది. జుట్టుపీక్కున్నా అందులో ఉన్నదేంటో చమూపతికి అర్థం కాలేదు. మళ్లీ అర్చకుణ్ని పిలిచి.. “ఆ గోలేంటో చెప్పు” అని అడిగాడు.
“అయ్యా! ఇవి మొత్తం ఇద్దరు మనుషులు రాసినవండీ. చేతిరాతల్లో తేడా కనిపిస్తున్నది కాబట్టి ఆమాత్రమైనా చెప్పగలిగాను. నిజానికి వాటి అర్థమేమిటో నాక్కూడా తెలియదు. ఊరికే చదవమంటే చదువుతాను” అన్నాడు అర్చకుడు.
“సరే చదువు చూద్దాం” అన్నాడు చమూపతి.
అర్చకుడు చదవసాగాడు.. “పూలనవ్వుల్ని వెతుక్కుంటూ ఇంతదూరం కదిలి వచ్చాను హరికోవెలలో మధువును కోరే తుమ్మెదగా మారి చాలానే తిరిగి తిరిగి అలిసిపోయాను లలిత భావం మలిగిపోయె
వసంతం జాడ లేదాయె గాలి కదిలినా.. ఆకు మెదిలినా తానే వచ్చెనేమో అనే నిరీక్షణ ఎన్నడు ఫలించేనో..
అయ్యా! ఇక్కడివరకు ఒకరి చేతిరాతలో ఉందండీ. ఈ కింది పంక్తులు బహుశా ఇందాక వచ్చినవాడు రాసి ఉండవచ్చు. వాటిని చిత్తగించండి..” అంటూ మళ్లీ చదవసాగాడు.
“వసంతవేళ మించిపోయెను ఇక నిలిచే తాహతు లేదాయెను దేవనగరికి తరలిపోయే సుమసుగంధం లలిత నుదుటన తిలకమై వెలిగిపోయేను..
అయ్యా! ఈ మాటలకు మామూలుగా అయితే అర్థం పర్థం ఏమీ లేదండీ. ఇవి ఎవరో యువతీ యువకులు సంకేతభాషలో రాసుకున్నవి. వాళ్లకు మాత్రమే అర్థమవుతాయి” అన్నాడు అర్చకుడు.
ఆ మాటలు విన్న చమూపతి విసుగ్గా అక్కడినుంచి కదిలాడు.
(వచ్చేవారం.. యవనద్వీపంలో అందగత్తెలు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం
Kasi Majili Kathalu | దయాపరుడు
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!