Kasi Majili Kathalu Episode 55 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిసిద్ధుడు అనే యతి తన దగ్గరున్న మణిప్రభావంతో లోకంలో జరిగే సంగతులన్నీ తెలుసుకోగలడు. ఆయన తనకు తోడుగా కాశీకి వస్తున్న గోపాలుడికి దారిమధ్యలో కనిపించిన వింతలన్నిటి వెనుక ఉండే కథలను వివరిస్తుంటాడు. ఈ కాశీమజిలీ కథలను పన్నెండు సంపుటాలుగా.. 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు. ప్రస్తుతం మీరు చదవబోయేది నాలుగో సంపుటంలోని కథ.
సింధువారము అనే నగరాన్ని ధనంజయుడనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సుందరకుడు అనే కుమారుడు, లలిత అనే కుమార్తె ఉన్నారు. ఆ మహారాజు ఒకనాడు నిండు పేరోలగంలో కూర్చుని ఉండగా.. గుహుడనే బెస్తవాడు, తన పదేళ్ల కొడుకును ఎత్తుకుని వచ్చాడు. రాజుకు నమస్కరించి, తన కొడుకు చేత కూడా దండం పెట్టించాడు.
ముద్దులు మూటగట్టే ఆ పిల్లవాడి రూపురేఖా విలాసాలను గమనించిన రాజు అమితాశ్చర్యానికి గురయ్యాడు. దగ్గరికి పిలిచి బుగ్గలు నిమిరి.. “బాలకా! నీ పేరేమిటిరా?!” అని అడిగాడు.
“పుష్పహాసుడు” అని చెప్పాడు పిల్లవాడు.
“నీ నవ్వుకు తగిన పేరే పెట్టాడురా మీ నాన్న” అని మెచ్చుకున్నాడు. తన పక్కనే పళ్లెంలో ఉన్న పళ్లను పిల్లవాడికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు బెస్తవాడు తన తలపాగాలోంచి ఒక రత్నకంకణాన్ని తీసి..
“దేవరా! ఒక చేప కడుపులో ఈ వస్తువు దొరికింది. ఇంత విలువైన వస్తువును మేమేం చేసుకుంటామండీ. అందుకని తమరికి ఇచ్చుకుందామని వచ్చాను” అన్నాడు.
రాజు ఆ రత్నకంకణాన్ని చేతిలోకి తీసుకుని చూడగానే..
“చెల్లెలా గంధర్వదత్తా! ఏమైపోయావు?! నీ కాపురం గంధర్వనగరంలా ఎంతలో మాయమైపోయింది?!” అని శోకించసాగాడు.
కొంతసేపటి తరువాత కొద్దిగా కోలుకుని, పక్కనే ఉన్న పురోహితుణ్ని చూసి..
“మిత్రమా! చూశావా.. ఇది మా గంధర్వదత్త కంకణం. ఆనాడు అంతఃపుర సౌధం పైభాగంలో నిద్రిస్తున్న నా చెల్లెలి కుటుంబం ఎలా మాయమైపోయిందో ఇప్పటివరకూ అంతుపట్టనే లేదు కదా! ఇప్పుడీ కంకణం చేప కడుపులో దొరికిందని చెపుతున్నారు. అంటే ఆమె గంగపాలైందనే కదా అర్థం?!” అని కొంతసేపు చిన్నపిల్లవాడిలా రోదించాడు.
చివరికి తన దుఃఖాన్ని తమాయించుకుని..
“నా చెల్లెలి కొడుకు బతికి ఉంటే ఈపాటికి ఈ కుర్రవాడంత అయి ఉండేవాడు” అన్నాడు బెస్తవాని కొడుకును చూపిస్తూ.
కళ్లు తుడుచుకుని..
“గుహుడా! నీకు దొరికిన వస్తువును నువ్వే దాచుకోకుండా మాకు ఇచ్చినందుకు సంతోషించాను. దీనికి బదులుగా నీకేం కావాలో కోరుకో” అన్నాడు. అప్పుడు బెస్తవాడు మరింత అణకువగా..
“దేవరా! ఈ పిల్లవాణ్ని నేను గారాబంగా పెంచుకుంటున్నాను. వీడేది కోరినా తెచ్చి ఇచ్చాను. కానీ, ఇప్పుడు అలవిమాలినవి కోరుతున్నాడు. తనకు గొప్పచదువులు చదువుకోవాలని ఉందట. చిన్నబడి గురువులు పనికిరారట. దేవరవారి పాఠశాలలో తానూ చదువుకుంటానని పట్టుబడుతున్నాడు” అని తన కోరికను చెప్పాడు.
“భళా! వీడి రూపానికి తగిన కోరిక కోరాడు. వీడు పెద్ద చదువులు చదివి తీరాల్సిందే! యువరాజుతో సమానంగా నీ కొడుక్కి కూడా చదువు చెప్పమని గురువులకు లేఖ రాసి ఇస్తాను. తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించు!” అని ” చెప్పాడు ధనంజయుడు.
గుహుని ఆనందానికి అంతులేకుండా పోయింది. మంచిముహూర్తంలో కొడుకును పాఠశాలలో చేర్చాడు. అతడు కూడా ఏకసంథాగ్రాహి కావడంతో ఎనిమిదేళ్ల కాలంలోనే.. తర్క వ్యాకరణాది శాస్ర్తాలలోనూ, యుద్ధ విద్యలలోనూ గొప్ప పాండిత్యం సాధించాడు. యవ్వనాన్ని వరించాడు. ఒకనాడు పుష్పహాసుడు గుర్రాన్ని అధిరోహించి రాజమార్గంలో విలాసంగా పోతుండగా ధనంజయుడు చూశాడు.
“ఎవరతను?” అని రాజోద్యోగులను అడిగాడు.
వాళ్లు చెప్పిన మాట విని..
“ఆ బెస్తవాడి కొడుకు ఇంతవాడయ్యాడా?! బాగుంది. ఇన్నాళ్లనుంచి గమనించలేదు. మన రాకుమారుడు కూడా ఇంత హుందాగా స్వారీ చేయగలడా?!” అని ప్రశ్నించాడు.
“మన యువరాజుగారు గుర్రం నడుపుతుండగా ఇంతవరకూ చూడనేలేదు మహారాజా!” అని జవాబు చెప్పారు ఉద్యోగులు.
“రేపు మధ్యాహ్నం రాకుమారుణ్ని, ఆ పుష్పహాసుణ్ని కొలువుకు తీసుకురండి. వాళ్ల విద్యాపాటవాలు ఏ పాటివో పరీక్షిద్దాం” అన్నాడు ధనంజయుడు.
రాజాజ్ఞ ప్రకారం మరునాడు కుమారవిద్యా ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి.
“కుమారా! ఇన్నాళ్లనుంచి రాజకార్యాల్లో మునిగిపోయి నీ విద్యాభ్యాసాన్ని పట్టించుకోలేక పోయాను. ఏయే విద్యలను చదివావు?! దేనిలో ఎక్కువ ప్రావీణ్యం సంపాదించావు?! శస్ర్తాస్త్ర విద్యలలో, అశ్వారోహణ వంటి వాటిలో చక్కగా పరిశ్రమ చేశావా?!” అని అడిగాడు ధనంజయుడు.
“తండ్రిగారూ! మీకు నేను అబద్ధం చెప్పలేను. ఈ ఉపాధ్యాయులు ఆ పల్లెవాడిపై ఎక్కువ పక్షపాతం కలవారయ్యారు. నాకంటే వాడికే ఎక్కువ విద్యలు బోధించారు” అని సమాధానం ఇచ్చాడు సుందరకుడు.
అతడి మాటలు విని ఉపాధ్యాయులు గుండెలు బాదుకున్నారు.
“యువరాజా! నీకంటే మాకు పుష్పహాసుడు ఎక్కువ ఎలా అవుతాడు?! నీకు బోధించడానికి మా శాయశక్తులా కృషి చేయలేదా!?” అన్నారు.
రాజు వారిని వారించి పుష్పహాసుని వైపు తిరిగి.. “ఏమయ్యా! నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. ఈ ఉపాధ్యాయులు నువ్వు కోరిన విద్యలన్నీ నేర్పారా?” అని ప్రశ్నించాడు.
అప్పుడు పుష్పహాసుడు లేచి నిలబడి.. “దేవరా! మీ అనుగ్రహం ఉండగా ఎవరికీ ఎలాంటి కొరతా ఏర్పడదు. నాకు గురువులు దయతో చదువులు చెప్పారు. మేము చదివాం” అని సమాధానం ఇచ్చాడు.
“సుందరకుడు కూడా నీతో సమానంగా చదివాడా?”.
“చదివారు ప్రభూ!”.
“గురువులు నీ పట్ల పక్షపాతం వహించారని సుందరకుడు చెబుతున్నాడు కదా!”.
“అటువంటిదేమీ లేదు మహారాజా! నేనాయన కంటే అధికుడను కాదు” అన్నాడు పుష్పహాసుడు.
అతనిలోని వినయ సంపదకు ధనంజయుడు సంతోషించాడు. ఆ తరువాత కొంతసేపు విద్యా ప్రసంగాలు జరిగాయి. అన్ని విద్యలలోనూ పుష్పహాసుడు అందెవేసిన చేయి అని, సుందరకుడు ఎందుకూ కొరగాడని సభలోని వారందరికీ స్పష్టంగా అర్థమైంది.
“ఇప్పుడు కొంతసేపు మీరిద్దరూ గుర్రపు స్వారీ చేయండి” అన్నాడు చివరికి ధనంజయుడు.
“అబ్బా! ఇవాళ కొంచెం మోకాలు నొప్పిగా ఉంది నాన్నగారూ! ఇప్పుడు వద్దు. మరోసారి చూద్దాం” అని తప్పించుకో చూశాడు సుందరకుడు.
అప్పటికే రాకుమారుని ప్రవర్తనతో కడుపుబ్బేలా లోలోపలే నవ్వుకుంటున్న సభాసదులలో కొందరు నవ్వాపుకోలేక పోయారు.
ఆ నవ్వులు వినగానే..
“ఏటిలో నీటికాకిలా మునుగుతూ తేలుతూ చేపలు పట్టుకునే బెస్తవాణ్ని పోనీలే కదాని చదివిస్తే.. ఇంత అహంకారమా?!” అన్నాడు సుందరకుడు.
“రాకుమారా! ఏ జాతిలో పుట్టాలన్నది మనలో చేతిలో లేనిది. దానిగురించి ఎన్నిసార్లు తర్కించినా లాభం లేదు. ఎక్కువ తక్కువలు లెక్కించాల్సింది ప్రజ్ఞను బట్టే కానీ.. పుట్టుకను బట్టి కాదు. చేవ కలిగిన వాడివైతే నాతో కత్తి కలుపు” అంటూ పుష్పహాసుడు ఒరనుంచి కత్తిని లాగాడు.
అప్పుడు ధనంజయుడు కలుగ చేసుకుని పుష్పహాసుణ్ని అక్కడినుంచి పంపించేశాడు.
ఆ తరువాత ఉపాధ్యాయుల వైపు తిరిగి..
“దేశికులారా! ఇంతకాలం నుంచి మీరు మా వాడికి నేర్పిన విద్య ఇదేనా?!” అని అడిగాడు.
అందుకు వారు..
“మహాప్రభూ! యువరాజుగారికి చదువుకోమంటే కోపం. ఊరుకుంటే పరాకు. మందలిస్తే అభిమానం. గ్రహణశక్తి తక్కువ. అశ్రద్ధ పెద్దది. డంబాలకు అంతులేదు. ఇలా ఉంటే చదువేం వస్తుంది చెప్పండి?” అన్నారు చేతులు జోడించి.
“చాలు చాలు! ఇక మీరంతా వెళ్లవచ్చు” అని వాళ్లందరినీ పంపివేశాడు ధనంజయుడు.
తన కుమారుణ్ని ఎలా బాగు చేసుకోవాలో తెలియక తలపట్టుకున్నాడు.
పుష్పహాసుడు సభనుంచి ఇంటికి వెళ్లిన తరువాత, జరిగిందంతా తండ్రితో వివరంగా చెప్పాడు.
విషయాలన్నీ చక్కగా గ్రహించి..
“నాయనా! నేటినుంచి నువ్వు పాఠశాలకు వెళ్లవద్దు” అని కట్టడి చేశాడు గుహుడు.
ఆనాటినుంచి తమ పల్లెలోనే ఉంటూ, సాటివారికి చేదోడువాదోడుగా మసలసాగాడు పుష్పహాసుడు. అలా కొంతకాలం గడిచింది.
* * *
ఒకనాడు గుహునికి ఇంకో చేప కడుపులో మరో కంకణం దొరికింది. దానిని పుష్పహాసునికిచ్చి.. “నాయనా! దీనికి జోడీ అయిన కంకణాన్ని రాజుగారికి సమర్పించినందు వల్లే వారు నీకు విద్యాభిక్ష పెట్టారు. దీనిని కూడా తీసుకువెళ్లి వారికి ఇచ్చి, నమస్కరించి రా” అని చెప్పాడు గుహుడు.
సరేనని నగరంలోకి వెళ్లాడు పుష్పహాసుడు. అతడు వెళ్లేసరికి ధనంజయుడు నగరిలో లేడు. వేటకు వెళ్లాడు. రాజుగారు లేని కారణంగా కోటంతా ఆ సమయంలో జనశూన్యంగా ఉంది. ఎవరో పరిచారిక కనిపిస్తే..
“నా పేరు పుష్పహాసుడు. రాజుగారిని కలుసుకోవాలి” అని చెప్పాడు.
అప్పుడామె..
“ఓహో! సాటిలేని మేటివీరుడని పెద్దపేరు మోసినవాడివి నువ్వేనా?! సంతోషం. నా పేరు వసంతతిలక. నేను యువరాణి లలితాదేవిగారి ఆంతరంగిక చెలికత్తెను. ప్రస్తుతం రాజుగారు వేటకు వెళ్లారు. ఆయనతో ఏమిటి విశేషమైన పని? చెబితే నేను మహారాణిగారికి గానీ, యువరాణి వారికి గానీ చెప్పగలను” అని చెప్పింది.
“ఒకప్పుడు మా తండ్రి ఇటువంటి కంకణాన్ని రాజుగారికి ఇచ్చారు. ఇప్పుడు దాని జత దొరికింది. దీనిని కూడా వారికి సమర్పించాలని”.. అని ఆ వస్తువును చూపెట్టాడు పుష్పహాసుడు.
“ఓహోహో! ఇది మా రాకుమారి ధరించే కంకణం. దీనిని ఆమెకే సమర్పించవచ్చు. పద నాతో పాటు అంతఃపురంలోకి” అన్నది దారితీస్తూ వసంతతిలక.
పుష్పహాసుడు మొహమాట పడ్డాడు.
“మగవాళ్లు లేని సమయంలో అంతఃపురంలోకి రావడం బాగోదు. నువ్వే పట్టుకెళ్లు. యువరాణివారితో ముట్టినట్లుగా ఒక మాట రాయించుకుని రా” అన్నాడు.
“జగదేకవీరుడివి. అంతలా జావగారి పోతావేం లోపలికి రా! మరేం పర్లేదు” అంటూ చొరవగా వసంతతిలక అతణ్ని అంతఃపురంలోనికి తోడ్కొని వెళ్లింది.
అక్కడ మెరుపుతీగలాంటి యువరాణి లలితను చూడగానే పుష్పహాసునికి మనసు అదుపు తప్పింది. యువరాణికేమో గుండె లయ తప్పింది. అతని గురించి ఆమెకు, ఆమె గురించి అతనికి వసంతతిలక ఏవేవో చాలా చెప్పింది. వాటిని ఆలకించే స్థితిలో లేరు వాళ్లిద్దరూ. నూరేళ్లపాటు కూర్చుని మాట్లాడుకున్నా తరిగిపోనంత సమాచారం వాళ్లిద్దరి కన్నులు ఒకరినుంచి మరొకరికి ప్రసారం చేశాయి. మరునిమిషం నుంచే ఆత్మీయత కలిగేలా చేశాయి. చివరిగా అతని చేతితోనే ఆ కంకణాన్ని లలితకు ఇప్పించింది వసంతతిలక. ఆ సమయంలో ఒకరి చేతి స్పర్శ మరొకరికి పులకింతలు కలిగించింది. మౌనంగా అంతఃపురంనుంచి వెనుతిరిగి వస్తుంటే దారిమధ్యలో పుష్పహాసుణ్ని అడ్డుకున్నాడు సుందరకుడు.
“ఏరా?! మగవాళ్లు లేని సమయంలో అంతఃపురంలో ప్రవేశించడానికి ఎంత ధైర్యం నీకు?” అంటూ కత్తి దూశాడు.
గోటితో పోయేదానికి కత్తిదాకా ఎందుకని, అతణ్ని ఎడం చేత్తో తోసివేసి.. ముందుకెళ్లి పోయాడు పుష్పహాసుడు. ఆ దెబ్బకు తూలిపడ్డ సుందరకుడు.. తగిలిన దెబ్బ చిన్నదే అయినా స్పృహ కోల్పోయినట్లు నాటకం ఆడసాగాడు. రాజవైద్యులు హుటాహుటిన వచ్చి అతనికి వైద్యం చేయసాగారు. పుష్పహాసుడు తండ్రి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అప్పుడతను..
“యువరాజుపై చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను వాళ్లింక బతకనివ్వరు. ఒకపని చెయ్. ఇప్పుడే రేవా నగరానికి పారిపో. అక్కడినుంచి యవనద్వీపం మీదుగా అమరావతికి ఓడలుంటాయి. అక్కడికి వెళ్లి కొన్నాళ్లు హాయిగా ఉండు. త్వరలోనే నేనొచ్చి నిన్ను కలుసుకుంటాను” అని చెప్పాడు.
ఆరోజే ధనంజయుడు వేటనుంచి తిరిగి వచ్చాడు. వచ్చీరావడంతోనే తన కొడుకును పుష్పహాసుడు కొట్టాడన్న విషయం తెలిసి..
“వెంటనే వాణ్ని బంధించి తీసుకురండి” అని భటులను ఆజ్ఞాపించాడు.
కానీ, అప్పటికే పుష్పహాసుడు ఆ పల్లెనుంచి వెళ్లిపోయాడు.
(వచ్చేవారం.. ఒంటరి ప్రయాణం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం
Kasi Majili Kathalu | దయాపరుడు
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు