Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి కుమారుడు కీర్తికేతుడు పరమలోభి. అతడి కుమారుడు విజయభాస్కరుడు తాతలా దయాపరుడు. తండ్రి విధించిన మరణశిక్ష నుంచి తప్పించుకుని, తల్లితో కలిసి వెళ్తూ దారిమధ్యలో కలభాషిణి అనే రాచకన్యను రక్షించాడు. యశస్కరుడనే రాజు కొలువులో చేరాడు. చేయని నేరానికి ద్వీపాంతర వాస శిక్షకు గురయ్యాడు.
విజయభాస్కరుణ్ని బందీగా తీసుకెళ్తున్న ఓడ.. శోభావతికి సమీపంలోని ద్వీపం వైపుగా ప్రయాణిస్తున్నది. రెండురోజుల ప్రయాణం ముగిసేసరికి.. అకస్మాత్తుగా సముద్ర తుఫాను చెలరేగింది. ఓడ మునిగిపోతుందేమోననే భయంతో అందులో ఉన్నవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
ఆ సమయంలో.. దూరంగా సముద్రం మధ్యనుంచి ఒక ఇనుప స్తంభం గాల్లోకి లేచి నిలబడింది.
“ఆ స్తంభాన్ని చూశారా? అది నరబలి కోరుతున్నది. ఓడతోపాటు మనల్నందరినీ తనలోనికి లాగిపారేస్తుంది. అలా జరిగేలోపుగా దానికి మనలో ఎవరైనా స్వచ్ఛందంగా బలి కాగలిగితే.. మిగిలినవారందరూ ప్రాణాలతో బయటపడవచ్చు. ఎవరినీ బలవంతంగా ఒప్పించకూడదు. తోసేయకూడదు. ఈ విషయాన్ని ఓడలో ఉన్న అందరికీ చెప్పండి” అన్నాడు సరంగు.
“నేను ఎలాగూ శిక్షపడ్డవాణ్ని. ద్వీపంలో ఒంటరిగా చనిపోయే బదులు ఇప్పుడే మరణిస్తాను. నావల్ల మీరందరూ బతికితే అంతేచాలు” అని ముందుకొచ్చాడు విజయభాస్కరుడు. అంటూనే ఒక్క ఉదుటన ఎగిరి, సముద్రంలో దూకాడు. ఓడకంటే ముందుగా ఈదుకుంటూ ఆ ఇనుపస్తంభం వద్దకు చేరుకున్నాడు. అతడు పట్టుకోగానే ఆ స్తంభం.. ఎలాగైతే పైకి లేచిందో, అలాగే సముద్రంలోకి దిగబడి పోయింది. విజయభాస్కరుడు తన ప్రాణాలు పోయాయనే అనుకున్నాడు. కళ్లు తెరిచి చూసేసరికి.. ఎటుచూసినా రత్నమాణిక్యాలు, బంగారు తాపడాలతో అక్కడంతా దేదీప్యమానంగా ఉంది.
‘ఓహో! నేను చనిపోయి స్వర్గానికి వచ్చాను కాబోలు’ అనుకున్నాడు విజయభాస్కరుడు.
అంతలో పెద్దపెద్ద కోరలతో, వికృతమైన ముఖం, పెద్దగుహలాంటి నోటితో ఒక భయంకరమైన రాక్షసి తానున్న వైపే రాసాగింది.
‘అయితే ఇది స్వర్గం కాదు.. నరకం కాబోలు’ అనుకున్నాడు విజయభాస్కరుడు.
దాని కంటబడకుండా ఓ మూలగా దాక్కున్నాడు. ఆ రాక్షసి అక్కడంతా వెతికి కొన్ని వంటకాలను పెద్దపెద్ద పళ్లేల్లో నింపుకొని అక్కడినుంచి బయల్దేరింది. విజయభాస్కరుడు ఆ రాక్షసిని అనుసరించాడు. అక్కడినుంచి ఆ రాక్షసి వేరొక మందిరంలో ప్రవేశించింది. అక్కడ కొండంత ఎత్తులో ఈమెకంటే భయంకరమైన ఆకారంతో మరో రాక్షసి కూర్చుని ఉంది.
“ఏమే అయోముఖీ! ఇంతాలస్యం చేశావేం?! భోజనం సిద్ధం చేశావా?” అని అడిగింది.
“ఇదిగోనమ్మా!” అంటూ పళ్లేలు రెండూ ఆమె ముందు పెట్టింది అయోముఖి.
ఆ పెద్దరాక్షసి.. పళ్లేల కేసి ఒకసారి ఆకలిగా చూసి..
“నరమాంసం ఏది?! ఈవేళ సముద్రంమీదికి లోహస్తంభాన్ని విడిచిపెట్టలేదా?” అని అడిగింది.
“విడిచిపెట్టానమ్మా! కానీ నరమాంసం రాలేదు. ఇదిగో ఇవే వచ్చాయి” అని సమాధానం ఇచ్చింది అయోముఖి.
పెద్దరాక్షసి గుండెలు బాదుకుంది.
“ఏదో చేటుకాలం దాపురించింది. ఈ జ్వాలాముఖి ఆయుర్దాయం తీరిపోయినట్లుంది. నిండా మూడువేల ఏళ్లు కూడా దాటకుండానే నేను చావాలి కాబోలు” అన్నది ఆందోళనగా.
“ఏమిటమ్మా! ఎందుకీ అర్థం లేని ఆందోళన. మీలాంటి అసహాయ శూరురాలిని ఎవరేం చేయగలరు?!” అన్నది అయోముఖి ధైర్యం చెప్పే ఉద్దేశంతో.
అతి ప్రయత్నంమీద ఆమెను ఊరుకోబెట్టి..
“ఎవడైనా లోహస్తంభానికి తగులుకుని వస్తేనే కదా.. ఈవేళ ఎవరూ రానేలేదమ్మా!” అన్నది అయోముఖి.
“నువ్వు సరిగా చూశావా?” ఆత్రుతగా అడిగింది జ్వాలాముఖి.
“చూశానమ్మా! ఎవరూ రాలేదు. ఇప్పటివరకు చేపలైనా, మనుషులైనా ప్రాణం పోయిన తరువాతనే కదా మన కూరల తట్టలో పడేది. ఇదంతా జరిగేది కాదు.. పెట్టేది కాదు. అసంభవమైన జాతకాన్ని రాసి, నిన్ను మయబ్రహ్మ చిరంజీవిని చేశాడు. మరేమీ భయపడకు. హాయిగా భోజనం చేయి” అన్నది అయోముఖి.
ఆ మాటలు విని కొంత ధైర్యం తెచ్చుకుని, భోజనానికి ఉపక్రమించింది జ్వాలాముఖి. తింటున్నంతసేపూ తానెంతమంది మానవులను ఎన్నెన్నిరకాలుగా విరుచుకు తిన్నదో కథలు కథలుగా చెప్పసాగింది. అదంతా వింటున్న విజయభాస్కరుడు.. ‘ఇంత హింసకు పాల్పడిన రాక్షసి కూడా తన ప్రాణాల మీదికి వస్తున్నదంటే ఎంత చిత్రంగా ఏడ్చింది?!’ అని మనసులో అనుకున్నాడు.
“ఇంతకూ మా హేమప్రభ ఏం చేస్తున్నదే?!” అడిగింది.. బ్రేవ్ మంటూ తేన్చి, మూతి తుడుచుకుంటూ జ్వాలాముఖి.
“చెలికత్తెతో కలిసి బొమ్మల పెళ్లి చేస్తున్నది. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు” చెప్పింది అయోముఖి.
సంతోషం కొద్దీ జ్వాలాముఖి మందహాసం చేసింది. ఆ చప్పుడు భరించలేక విజయభాస్కరుడు చెవులు మూసుకున్నాడు. కొద్దిసేపటికి అయోముఖి అక్కడినుంచి వెళ్లిపోయింది. జ్వాలాముఖి నిద్రకు ఉపక్రమించింది. విజయభాస్కరుడు మెల్లిగా ఆమె మంచం వద్దకు వెళ్లి, ఒరనుంచి సర్రున కత్తిని లాగాడు.
జ్వాలాముఖిని తట్టి లేపాడు. నిద్రమత్తులో కళ్లు సరిగ్గా తెరవకుండానే విజయభాస్కరుణ్ని గమనించి.. “ఎవడవురా నువ్వు?” అని హుంకరించింది రాక్షసి.
మరొక్క క్షణంకూడా ఆలస్యం చేయకుండా, దాని తలకాయను ఆనపకాయ తరిగినట్లు తరిగేశాడు భాస్కరుడు. కొండంత దేహం కలిగిన ఆ రాకాసి కించిత్తు శబ్దం చేయకుండా కన్ను మూసింది. ఆ తరువాత అయోముఖి వద్దకు వెళ్లి, ఆమె చేత కూడా పరలోకయాత్ర చేయించాడు.
లోకకంటకులైన రాక్షసులను చంపాననే తృప్తి కలిగింది కానీ, అక్కడినుంచి బయటికి ఎలా వెళ్లాలో తెలియలేదు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆ మందిరంలోనే తిరగసాగాడు. సముద్రం మధ్యలోని ఆ రహస్యమందిరానికి అనుబంధంగా అనేక భవంతులు, ఉద్యానవనాలు ఉన్నాయి.
ఒకచోట బొమ్మల పెళ్లిళ్లు చేస్తున్న హేమప్రభ కనిపించింది. అతిలోక సౌందర్యవతి అయిన ఆమెను చాలాసేపు కన్నార్పకుండా చూడసాగాడు విజయభాస్కరుడు. “అమ్మా గౌరీదేవీ! ఈవేళ నీ పెళ్లి చేసినందుకు మా చెలికి త్వరలోనే మంచి పెళ్లికొడుకు దొరికేలా చూడు” అన్నది హేమప్రభ సఖురాలు.
ఆ మాటలతో సిగ్గు ముంచుకువచ్చి, చిరుకోపంగా మారగా.. “పోవే పిచ్చిమాటలూ నువ్వూనూ!” అంటూ ఆమెను మెల్లగా తట్టింది హేమప్రభ.
ఉద్యానంలో విహరిస్తుండగా వారి చూపులు విజయభాస్కరునిపై పడ్డాయి. తొలిచూపులోనే అతణ్ని తన మనోహరునిగా ఎంచుకుంది హేమప్రభ. ఆమె చెలికత్తె చొరవ తీసుకుని రాయబారం నడిపింది.
విజయభాస్కరుడు స్వయంగా విక్రమార్కుని మనుమడని తెలుసుకుని ఎంతో సంతోషించింది.
“రాకుమారా! ఈమె విద్యాధర చక్రవర్తి విశ్వావసుని మనుమరాలు. దేవవ్రతుని కూతురు. ఈమె తల్లి రాక్షసి అయినా, ఈమెలో ఆ లక్షణాలు లేవు. నీకు తగినది” అన్నది చెలికత్తె.
హేమప్రభకు విజయభాస్కరునికి అప్పుడే గాంధర్వ వివాహం జరిగింది. దంపతులిద్దరూ ఆ రాత్రి అమరసుఖాలలో తేలారు. తెల్లవారుతూనే హేమప్రభ సఖురాలు గది తలుపులు దబదబా బాదింది.
“మీ అమ్మమ్మను, అయోముఖిని ఎవరో చంపేశారు” అని దుర్వార్త వినిపించింది.
హేమప్రభ దుఃఖిస్తూ అమ్మమ్మను చూడబోయింది. విజయభాస్కరుడు ఆమెను అనుసరించాడు.
“ఈమె లోకకంటకురాలు. చెప్పలేనంత హింసకు పాల్పడింది. అందుకని నేనే చంపాను” అని చెప్పాడు విజయభాస్కరుడు.
హేమప్రభ కళ్లు తుడుచుకుని..
“దీనికి ఇలాంటి చావు రావడం సమంజసమే! కానీ ఎంతైనా అమ్మమ్మ కదా అందువల్ల వద్దనుకున్నా దుఃఖం ఆగడంలేదు” అన్నది. ఆ తరువాత రాక్షస స్త్రీలిద్దరినీ ఖననం చేశారు.
చెలికత్తె తప్ప మరో నరమానవుడు లేని ఏకాంత లోకంలో కొత్తదంపతులు కొంతకాలం హాయిగా సుఖించారు. ఒకనాడు విజయభాస్కరుడు తన తల్లిని కలుసుకుని, త్వరలోనే తిరిగి వస్తానని.. వెళ్లడానికి మార్గం చూపమని కోరాడు.
“నిన్ను చూడకుండా ఒక్కక్షణమైనా నిలువలేను” అంటూ చాలాసార్లు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది హేమప్రభ.
చివరికి.. “ఒక్కవారం రోజులు సమయం ఇస్తున్నాను. ఆలోపుగా తిరిగి రావాలి. ఇదిగో ఈ కంకణాన్ని చేతికి ధరించి, ఎదురుగా ఉన్న తటాకంలో మునిగావంటే.. నువ్వు కోరుకున్న చోటికి వెళ్లగలవు. మళ్లీ ఏదైనా తటాకంలో మునిగినప్పుడు నన్ను స్మరిస్తే ఇక్కడికే వచ్చేస్తావు” అని చెప్పింది.
ఆమె ఇచ్చిన కంకణం సహాయంతో విజయభాస్కరుడు శోభావతి పట్టణానికి వెళ్లాడు. తన తల్లిని గురించి ఆరా తీస్తే.. “కుమారుడు మరణించాడన్న వార్త విని, తీర్థయాత్రలు చేస్తూ ఈ దేశాన్ని విడిచిపెట్టి పోయింది” అని చెప్పారు.
రాజైన యశస్కరుడు ఎలా ఉన్నాడని అడిగితే.. “అమాయకుడైన విజయభాస్కరుడి చావుకు కారణం అయ్యాడన్న బాధ.. ఆయనకు వైరాగ్యం కలిగించింది. రాజ్యాన్ని మంత్రులకు విడిచిపెట్టి ఆయన కూడా తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు” అంటూ చెప్పారెవరో.
విజయభాస్కరుడు తన తల్లిని వెతుక్కుంటూ అనేక క్షేత్రాలు సందర్శించసాగాడు. చివరికి ఒక శివరాత్రి రోజున శ్రీశైలానికి వెళ్లాడు. ఉపవాస, జాగరాలతో మల్లికార్జునుణ్ని సేవించాడు. మరునాడు తెల్లవారుజామున స్నానానికి వెళ్తుండగా.. కోటితీర్థమనే బావిలో ఎవరో పడ్డ చప్పుడు వినిపించింది.
వెంటనే విజయభాస్కరుడు కూడా బావిలో దూకాడు. అందులో పడ్డది ఎవరో కాదు.. చారుమతి. ‘మరణము అకాలమున రాదు మహిని ఎవ్వనికిన్’.. అంటూ తాను చెప్పిన మాటలనే ఆమె కలవరిస్తున్నది. ఆమెకు ఉపచారాలు చేసి పూర్తిగా స్పృహ వచ్చేలా చేశాడు విజయభాస్కరుడు. అంతలో అక్కడికి యశస్కరుడు వచ్చాడు.
“నీ ఎడబాటుకు గురైన తల్లిని నేను స్వయంగా రక్షిస్తున్నాను” అని చెప్పాడు. “నేను చేసిన తప్పునకు పరిహారంగా నా రాజ్యాన్ని నీకు అర్పిస్తున్నాను. స్వీకరించు” అన్నాడు.
అలాకాదని అతడికేదో సర్ది చెబుతుండగా.. ఓ అందమైన అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చింది.
వేషం చూస్తే జోగినిలా ఉంది కానీ, లక్షణాలను బట్టి చూస్తే రాచకన్య. చారుమతి చేయి పట్టుకుని.. “అత్తా! చెప్పకుండా ఎందుకు వచ్చావు? నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా?!” అన్నది.. తన ఆదుర్దాను మాటల్లో కనబరుస్తూ.
విజయభాస్కరుడు అయోమయంగా చూశాడు. చారుమతీదేవి నవ్వుతూ.. “ఆనాడు దొంగలబారినుంచి కాపాడావు కదా.. కలభాషిణి నువ్వే పతివి కావాలని పట్టుబట్టి కూర్చుందట. నువ్వు చనిపోయావని తెలిసి, తండ్రి వేరొక పెళ్లి చేయడానికి నిశ్చయిస్తే.. ఇంట్లోనుంచి పారిపోయి వచ్చింది. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నది” అన్నది.
విజయభాస్కరుడు బతికే ఉన్నాడనే సంగతి తెలిసి అందరూ ఆనందించారు. అందరూ కలిసి చంద్రప్రస్థ నగరానికి ప్రయాణమయ్యారు. అక్కడికి వెళ్లేసరికి రాజ్యకాంక్షతో కీర్తికేతుడు చంద్రప్రస్థంపై దండెత్తి వచ్చాడని, యుద్ధంలో ఓడిపోయి.. చంద్రగుప్తునికి బందీగా చిక్కాడని తెలియవచ్చింది.
విజయభాస్కరుడు మామగారిని కలుసుకుని, తండ్రిని విడిపించాడు. తప్పు తెలుసుకున్న కీర్తికేతుడు తిరిగి భార్యను, కొడుకును చేరదీశాడు. ఉజ్జయినికి వెళ్లేదారిలో ఆనాడు కలభాషిణిని ఎత్తుకుపోయిన దొంగల స్థావరాన్ని ముట్టడించి.. ఆ దొంగలందర్నీ బంధించాడు విజయభాస్కరుడు. వారు కూడబెట్టిన అపార ధనరాశులను తనతోపాటు తీసుకువెళ్లాడు.
మరికొంతకాలానికి విజయభాస్కరునికి పట్టాభిషేకం జరిగింది. కలభాషిణి, హేమప్రభలతో చాలాకాలం అతడు చిరంజీవిగా వర్ధిల్లాడు.
(వచ్చేవారం.. పుష్పహాసుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | దయాపరుడు
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య