Kasi Majili Kathalu Episode 52 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి అనంతరం ఆయన కుమారుడు కీర్తికేతుడు రాజ్యానికి వచ్చాడు. తండ్రిలా కాకుండా దయాహీనుడై ప్రజలపై ఎన్నో పన్నులు విధించాడు. తన కొడుకైన విజయ భాస్కరుడు పేదలకు దానధర్మాలు చేయడం తట్టుకోలేక కొడుకుతోపాటు భార్యకు కూడా మరణశిక్ష విధించాడు కీర్తికేతుడు. అదృష్టవశాత్తూ మరణం నుంచి తప్పించుకున్న విజయభాస్కరుడు.. దొంగలు ఓ ఆడపిల్లను కాళికాదేవికి బలివ్వడానికి తీసుకురావడం చూశాడు. వెంటనే, ఆ విగ్రహాన్ని నరికేయడానికి కత్తి ఎత్తాడు.
“మాతా! నువ్వు మూడులోకాలకూ పూజ్యురాలవు. అటువంటి నిన్ను నేను రక్షించడమేమిటి? నువ్వే మమ్మల్ని చల్లగా చూడాలి. ఇకనుంచి బలులు స్వీకరించనని మాటిచ్చావు. నాకంతే చాలు” అంటూ అమ్మవారికి నమస్కరించాడు విజయభాస్కరుడు.
పక్కనే కట్టిపడేసి ఉన్న అమ్మాయిని తీసుకుని అక్కడినుంచి బయటికి వచ్చేశాడు. కొడుకు తీసుకువచ్చిన అమ్మాయితో అనునయంగా మాట్లాడి వివరాలు రాబట్టింది మహారాణి చారుమతీదేవి. ఆ అమ్మాయి పేరు కలభాషిణి. చంద్రగుప్త మహారాజు కూతురు. వాళ్లది చంద్రప్రస్థ నగరం అని తెలుసుకుని, ఆమెను తన తల్లిదండ్రులకు అప్పగించాలనే సంకల్పంతో.. తల్లీ కొడుకులిద్దరూ చంద్రప్రస్థానికి బయల్దేరారు. కొద్దిరోజుల ప్రయాణం తరువాత ఒకనాటి సాయంత్రం వేళకు నగరానికి కొద్దిదూరంలోని ఒక గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ ఒక నిరుపేద బ్రాహ్మణుని ఇంట్లో ఆ రాత్రికి వాళ్లు ముగ్గురూ బస చేశారు. భోజనాలయ్యాక మాటలమధ్యలో ఆ బ్రాహ్మణ దంపతుల దీనగాథ విని, విజయభాస్కరుడు నిలువునా కరిగిపోయాడు. కానీ, వాళ్లకు ఎలా సాయం చేయాలో తోచలేదు.
మరునాడు వీధి అరుగుమీద కూర్చుని ఉండగా విజయభాస్కరునికి ఒక దండోరా వినిపించింది.
“అందరూ వినండహో.. పదిరోజుల కిందట కోటలో దొంగలు పడ్డారు. సొమ్ముతోపాటు యువరాణి వారిని కూడా ఎత్తుకుపోయారు. యువరాణిని తెచ్చి అప్పగించిన వారికి అర్ధరాజ్యంతోపాటుగా, ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని రాజుగారు ప్రకటించారహో!”..
అది విన్న విజయభాస్కరుడు ఓ నిర్ణయానికి వచ్చి.. “చాటింపు విన్నారు కదా! ఆ అమ్మాయే యువరాణి కలభాషిణి. ఆమెను తీసుకువెళ్లి రాజుగారికి అప్పగించమని మీ అబ్బాయితో చెప్పండి. మీకు అర్ధరాజ్యం దక్కుతుంది. మీ దారిద్య్రం తొలగిపోతుంది” అన్నాడు విజయభాస్కరుడు.. ఆ ఇంటి యజమానితో.
అతడి మంచిమనసుకు తన కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక రెండు చేతులూ జోడించాడు బ్రాహ్మణుడు. తన కుమారుడైన నిగమశర్మను పిలిచి, సంగతి సందర్భాలు వివరించి చెప్పాడు. విజయభాస్కరుడు ఇచ్చిన కత్తిని చేతబట్టుకుని, యువరాణిని తీసుకుని కోటకు వెళ్లాడు నిగమశర్మ.
మహారాజుకు యువరాణిని అప్పగించాడు. ఆయన ఆనందం పట్టలేక నిగమశర్మను కౌగిలించుకుని..
“అయ్యా! మీరెవరు? మా అమ్మాయిని మీరెక్కడ చూశారు?! దొంగలేమయ్యారు?! వాళ్లు దోచుకున్న సొమ్ములు దొరికాయా?” అని ప్రశ్నించాడు.
“మహారాజా! మాది ఈ పట్టణమే! ఇటీవల నేను ఉత్తరదేశ యాత్రలు చేసి, అడవి మార్గం నుంచి తిరిగి వస్తున్నాను. ఓ పదిమంది దొంగలు ఈ అమ్మాయిని ఎత్తుకుని వెళుతుంటే నా కత్తితో ఎదిరించాను. దెబ్బకు వాళ్లు పారిపోయారు” అని సమాధానం ఇచ్చాడు నిగమశర్మ.
“బ్రాహ్మణుల్లా ఉన్నారు. మీకు సాము చేయడం తెలుసా? కదురు తిప్పగలరా?!” అడిగాడు మహారాజు.
“జంధ్యాలు వడుకుతాను కనుక, కదురు తిప్పగలను. సాము గరిడీలు తెలియవు” అని అమాయకంగా చెప్పాడు నిగమశర్మ.
అతడివంక జాలిగా చూసి.. “జంధ్యాలు వడికే కదురు కాదు స్వామీ! కత్తితో కదురు తిప్పగలరా!? ఏదీ ఆ కత్తి ఓసారిలా ఇవ్వండి” అని అడిగి తీసుకున్నాడు చంద్రగుప్తుడు.
దానిపై ‘విక్రమార్క చక్రవర్తి’ అన్న పేరు చూసిన తరువాత, ఏదో మోసం జరుగుతున్నదనే అనుమానం అతనిలో బలపడింది. ఆలోచనలో పడ్డాడు.
ఇంతలో నిగమశర్మ కొద్దిగా హడావుడి చేస్తూ.. “మీ కుమార్తెను తెచ్చి ఇచ్చినవారికి అర్ధరాజ్యం, ఆమెనిచ్చి వివాహం జరిపిస్తామన్నారు. తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించండి” అన్నాడు దర్పంగా.
మహారాజు అతడి తీరుకు చిరాకుపడ్డాడు.
“ప్రస్తుతానికి ఈ వెయ్యి వరహాలూ పట్టుకుపో! పెళ్లి సంగతి తరువాత చూద్దాం” అని అతణ్ని పంపించి వేశాడు. కుమార్తె వద్దకు వెళ్లి..
“నిన్ను కాపాడిన వాళ్లెవరమ్మా? ఇప్పుడు వచ్చిన అబ్బాయేనా?!” అని ఆరా తీశాడు.
“కాదు నాన్నగారూ!” అంటూ ఆమె జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించింది.
వెంటనే సైన్యాన్ని వెంటబెట్టుకుని నిగమశర్మ ఇంటికి వెళ్లాడు చంద్రగుప్తుడు. అక్కడ విజయభాస్కరుణ్ని చూస్తూనే.. ‘నా కూతురు చెప్పిన వీరుడు ఇతడే అయి ఉంటాడు’ అని ఊహించగలిగాడు. కానీ, నిగమశర్మ కుటుంబానికి సాయం చేయాలని తీర్మానించుకున్నందువల్ల, విజయభాస్కరుడు తన ఉనికిని దాచిపెట్టాడు.
తానో బాటసారిని మాత్రమేనని చెప్పాడు. చేసేది లేక చంద్రగుప్తుడు తిరిగి వెళ్లిపోయాడు. విజయభాస్కరుడు వెంటనే తల్లిని తీసుకుని అక్కడినుంచి నిష్క్రమించాడు.
కొన్నిరోజుల ప్రయాణం తరువాత చిత్రకూటమనే అగ్రహారానికి చేరుకున్నాడు. అక్కడ ధనవంతుల ఇళ్లన్నీ విడిచిపెట్టి ఒకానొక పేదగృహాన్ని ఎంపిక చేసుకున్నాడు. గుమ్మం ముందు నిలబడి ఇంట్లో వారిని పిలిచాడు.
యజమానురాలు బయటికి వచ్చింది.
“అమ్మా! మేము పరదేశీయులం. ఈమె మా తల్లి. చాలాదూరం నడిచి రావడం వల్ల అలిసిపోయింది. ఈ పూటకు మీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వగలరా?” అని అడిగాడు విజయభాస్కరుడు.
అందుకామె.. “ఎంతమాట.. రండినాయనా!” అని ఆహ్వానించింది.
చారుమతి లోపలికి వెళ్లింది. విజయభాస్కరుడు స్నానానికి బయల్దేరుతుండగా.. ఆ ఇల్లాలు తన ఆఖరు కొడుకైన గుణసాగరుడిని తోడు పంపించింది. స్నానం చేస్తున్నంతసేపూ గుణసాగరుడు చెప్పిన మాటల్లో విజయ భాస్కరునికి కొన్ని సంగతులు తెలిశాయి.
* * *
ఒకప్పుడు విక్రమార్క మహారాజు దేశాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక విప్రుని ఇంట్లో బసచేశాడు. ఆయన చేసిన ఉపచారాలకు సంతోషించి, ఈ అగ్రహారాన్ని రాసిచ్చాడు. క్రమంగా అగ్రహారం పెరిగి పెద్దదైంది. ఇక్కడివారంతా మహాపండితులు, ధనవంతులయ్యారు. ఒక్క గుణసాగరుని కుటుంబమే ఆర్థికంగా వెనుకబడింది. అతనికి ఏడుగురు అన్నలున్నారు. వారంతా కొద్దోగొప్పో చదువుకున్నారు. సంపాదన కోసం దేశాటన చేస్తున్నారు. ఇతనికి మాత్రం చదువు అబ్బలేదు.. ఇంతవరకూ విషయాలన్నీ చెప్పిన తరువాత.. “అన్నా! నన్నూ మీతోపాటు రానివ్వండి. ఏదో పని చేసుకుని బతుకుతాను” అని కోరాడు గుణసాగరుడు.
ఆ మాటలు విని విజయభాస్కరునికి చాలా జాలివేసింది. కానీ, తనకే ఏ దిక్కూ లేనప్పుడు మరొకరిని ఎలా పోషించగలడు?! అందుకనే మిన్నకుండిపోయాడు. భోజనాదికాలు పూర్తయిన చాలాసేపటికి ఆ ఇంటి యజమాని దేవభట్టు వచ్చాడు. ఆయన్ని చూస్తూనే..
“ఇంత ఆలస్యం చేశారేం?!” అని అడిగిది భార్య.
అందుకు దేవభట్టు.. “ఈవేళ ఒక విశేషం చూశాను. నేను రాజవీధిలో ఒక అంగడిలో కూర్చుని ఉండగా భటులు కొందరు ఒక బంగారు విగ్రహాన్ని బండిపై పెట్టి చాటింపు వేసుకుంటూ తీసుకువెళ్లారు. ఆ వింత పూర్తిగా చూసి వచ్చేసరికి ఆలస్యం అయింది” అని ఆగాడు దేవభట్టు.
“బంగారు విగ్రహాన్ని ఊరేగిస్తూ చాటింపు వేశారా.. ఏమని?!” ఆసక్తికొద్దీ అడిగింది ఇల్లాలు.
అందుకు దేవశర్మ.. “ఆ సంగతి చెప్పాలంటే నీకు మొదటినుంచి కథంతా వివరంగా చెప్పాలి” అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
* * *
అక్కడికి కొద్దిదూరంలో రత్నకూటమనే నగరం ఉంది. దానిని చంద్రావలోకుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు అనేకమంది భార్యలున్నారు. కానీ, వాళ్లలో ఏ ఒక్కరూ ఆయన మనసును గెలుచుకోలేదు. దాంతో చింతాక్రాంతుడై ఉన్న రాజు ఒకరోజు వేటకు వెళ్లారు. అడవి పందిని వేటాడుతూ దారితప్పి తన సైన్యం నుంచి దూరంగా విడిపోయాడు. ఆ కారడవిలో ఒక సుందర తటాకం ఒడ్డున వనకన్యలాంటి ఒక సుందరీమణిని చూశాడు. ఆమె దేవలోక అప్సరస అయిన మేనక కూతురు. పేరు ఇందీవరప్రభ. ఆమెను చూడగానే చంద్రావలోకుడు ప్రేమలో పడ్డాడు. కానీ, ఆమె అభ్యంతరం చెప్పింది. తన పెంపుడు తండ్రి అయిన దేవవ్రతుని అనుమతి లేనిదే పెళ్లాడలేనని చెప్పింది. అప్పుడు చంద్రావలోకుడు ఆ సిద్ధుణ్ని వెతుక్కుంటూ వెళ్లాడు. రాజులోని వినయగుణాన్ని చూసి, సిద్ధుడు మెచ్చుకున్నాడు.
“రాజా! క్షత్రియులకు ఆయుధం పట్టడం ధర్మమే! కానీ వాటితో మూగజీవాలను హింసించకూడదు. ఇకనుంచి వేటాడటాన్ని విడిచిపెట్టు” అన్నాడు సిద్ధుడు.
రాజు అందుకు అంగీకరించాడు. సిద్ధుడు ఏం కావాలో కోరుకోమనగా, ఇందీవర ప్రభను కోరుకున్నాడు రాజు. అలా వాళ్లిద్దరికీ పాణిగ్రహణం జరిగింది. కొత్తభార్యతో కలిసి రాజధానికి తిరిగివస్తూ చంద్రావలోకుడు అడవిమార్గంలోని ఓ మర్రిచెట్టుకింద తన తొలిరేయిని గడిపాడు. ఆ మర్రిచెట్టు జ్వాలాముఖుడనే బ్రహ్మరాక్షసుడిది. రాత్రంతా ఎక్కడెక్కడో సంచరించి, తెల్లవారబోతున్నదనగా తన నివాసానికి చేరుకున్న జ్వాలాముఖుడు.. ఆ జంటను చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు.
“ఎవడురా నువ్వు? నా చెట్టుకిందికి రావడానికి దేవతలు సైతం భయపడతారు. అటువంటి చోటికి నువ్వు రావడమే కాకుండా, స్త్రీతో రమించి నా ప్రదేశాన్ని అపవిత్రం చేశావు. ఇప్పుడే నిన్ను కబళిస్తాను” అని హుంకరిస్తూ ముందుకు రాబోయాడు.
చంద్రావలోకుడు గజగజ వణుకుతూ.. “మహాత్మా! నీ ఇంటికి అతిథులుగా వచ్చినవారిని నువ్వే భక్షించడం ధర్మం కాదు. నేను నీ శరణుజొచ్చుతున్నాను. నన్ను రక్షించు” అని వేడుకున్నాడు.
దాంతో బ్రహ్మరాక్షసుడి మనసు కరిగింది. “సరే.. నిన్ను విడిచిపెట్టేస్తాను. కానీ, ఒక పక్షం రోజులలోపు నాకో పదహారేళ్ల బ్రాహ్మణ కుమారుణ్ని బలిగా సమర్పించాలి. అతడి కాళ్లను తల్లి, చేతులను తండ్రి పట్టుకుని ఉండగా నువ్వు నీ కత్తితో తల నరికి నాకు రక్తతర్పణం చేయాలి. చెప్పిన గడువు లోపల ఈ షరతు పూర్తి చేయలేకపోయావో ఎక్కడ దాక్కున్నా నిన్ను పట్టి నీ రక్తం పీల్చి తీరుతాను” అని హెచ్చరించాడు.
చంద్రావలోకుడు బతుకుజీవుడా అనుకుంటూ రాజధానికి తిరిగి వచ్చాడు. జరిగింది మంత్రులకు చెప్పాడు.
“నా ప్రాణాలకోసం వేరొకరిని బలిపెట్టడమా?! అయినా కన్నకొడుకుని చంపుతుంటే దగ్గరుండి సహకరించే కఠినాత్ములు ఎక్కడైనా ఉంటారా?!” అన్నాడు చంద్రావలోకుడు విచారంగా.
అందుకు మంత్రులు బాగా ఆలోచించి అతనికో ఉపాయం చెప్పారు. దానిప్రకారం చంద్రావలోకుని ఎత్తుకు సరిపడే బంగారు విగ్రహాన్ని పోతపోయించారు. దాని చేతిలో ఒక దానపత్రాన్ని ఉంచారు.
‘బ్రహ్మరాక్షసునికి ఎవరైతే తమ కుమారుణ్ని బలివ్వడానికి సహకరిస్తారో, వారికి ఆ బంగారు విగ్రహం కానుకగా ఇవ్వబడుతుంది’ అని అందులో రాసి ఉంచారు.
* * *
అని కథంతా చెప్పిన తరువాత.. “ఈవేళ ఆ విగ్రహం మన ఊరు వచ్చింది. దాన్ని చూస్తే నాకో మంచి ఊహ తోచింది. మనింట్లో పనికిమాలిన వాడొకడున్నాడు కదా! వాణ్ని బలిచ్చి, బంగారు విగ్రహం పొందితే మన దరిద్రం అంతా వదిలిపోతుంది” అన్నాడు దేవభట్టు.
“ఎవరా పనికిమాలినవాడు?!” అని అడిగిందామె.
“ఇంకెవరూ.. గుణసాగరుడే!” అన్నాడు దేవభట్టు.
ఆ మాట వింటూనే అరుగుమీద విజయభాస్కరునితోపాటు కూర్చుని అంతసేపూ తల్లిదండ్రుల మాటలు వింటున్న గుణసాగరుని గుండెలు అదిరిపోయాయి.
(వచ్చేవారం.. గురి తప్పిన కత్తి)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు