Kasi Majili Kathalu Episode 51 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిసిద్ధుడు అనే యతి కాశీయాత్ర చేయాలనుకున్నాడు. యాత్రలకు ఒంటరిగా వెళ్లకూడదనే నియమాన్ని అనుసరించి, తోడుగా రమ్మని గోపాలుణ్ని కోరాడు. అయితే తనకు కథలంటే ఇష్టమని, దారిమధ్యలో కనిపించిన విశేషాలన్నీ చెబితే తప్ప.. తాను రానని మెలిక పెట్టాడు గోపాలుడు. మణిసిద్ధుని వద్ద ఒక మణి ఉంది. ఆ మణిసాయంతో వాళ్లిద్దరూ చెప్పుకొన్న కథలే కాశీమజిలీలు. వీటిని 1930వ దశకంలో మధిర సుబ్బన్నదీక్షిత కవి రచించారు.
ఉజ్జయినీ నగరం వెలాతెలా పోతున్నది. విక్రమార్క చక్రవర్తి రెండువేల సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించి, ఇంద్రుని అర్ధ సింహాసనాన్ని అధిష్ఠించడానికి వెళ్లిపోయాడు. అతని కొడుకైన కీర్తికేతునికి పట్టాభిషేకం జరిగింది. కీర్తికేతుడు రాజ్యానికి వస్తూనే మంత్రులను పిలిచి..
“కోశాగారంలో నిల్వలెంత ఉన్నాయి?” అని ఆరాతీశాడు.
“మహా అయితే ఓ పదిరోజుల ఖర్చులకు సరిపోతాయి మహారాజా!” అన్నారు వారు.
“ఇంత విశాలమైన రాజ్యంలో ఓ ఏడాదికి కూడా ఆదాయ నిల్వలు లేవా!? ఇదెక్కడి విడ్డూరం?!” అని విస్తుపోయాడు కీర్తికేతుడు.
“మహారాజా! తమ తండ్రిగారు జగద్విఖ్యాతులైన చక్రవర్తి అనే మాట నిజమే. రాజ్యం మాత్రం చాలా చిన్నదే! ఇదిగో ఈ పటం చూడండి. మనదేశం ఇంత మాత్రమే! విక్రమార్కుల వారెప్పుడూ దండయాత్రలు చేసి, ఇతర రాజ్యాలను ఆక్రమించలేదు. ఒకవేళ యుద్ధాలు సంభవించినా.. గెలిచిన రాజ్యాలను ఆయా రాజ్యాల వారసులకే తిరిగి ఇచ్చేసేవారు” అని వివరించారు మంత్రులు.
“పోనీలెండి ఈ కాస్తయినా మిగిల్చారు. ఇందులో వ్యవసాయ భూములపై పన్ను రాబడి ఉండాలి కదా!. ఇతర పన్నులు కూడా వేస్తారు కదా! అవన్నీ ఏమైపోయినట్లు?!” అడిగాడు కీర్తికేతుడు దేశపటాన్ని చూపిస్తూ.
అందుకు మంత్రులు..
“మహారాజా! దేవబ్రాహ్మణ మాన్యాలపై పన్నులు లేవు. అవి రెండూ తీసేయగా పన్నులు వసూలయ్యే భూమి అతి స్వల్పం. ఆ ఆదాయం కూడా దానధర్మాలకు, సత్రాల నిర్వహణకు బొటాబొటిగా సరిపోతుంది. ఇక పై ఖర్చులన్నీ మన దివాణం నుంచి వెళ్లాల్సినవే కదా!” అని వివరించారు.
“ఇలా అయితే ఈ రాజ్యాన్ని పాలించడానికి కావాల్సిన సంపదంతా ఎక్కడినుంచి వస్తుంది?”.
“విక్రమార్కుల వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆకాశం నుంచి ధనం కురిసేది. ఆ ధనాన్ని నిల్వపెట్టుకోవడం వారికెప్పుడూ అలవాటు లేదు మహారాజా!”.
కీర్తికేతుడు ఆ మాటలకు చిరాకు పడ్డాడు.
“ఆహా! చాలు చాలు. ఈ భరతఖండాన్ని ఏలిన చక్రవర్తులలో తనంతటివాడు తానని పేరుపడిన విక్రమార్కులవారు ఆఖరికి.. కొడుక్కు మిగిల్చింది ఇదన్నమాట. ఆయనకేమో కీర్తికావాలి.. మిగిలినవాళ్లు మట్టి తిని బతకాలి కాబోలు. ఆయనగారు ఎడాపెడా దానధర్మాలు చేసి యాచకులను పెంచాడు కానీ, యాచకులే లేకుండా చేయగలిగాడా?! సరిసరి.. ఇకనుంచి రాజ్యంలో కొత్త శాసనాలు అమలులోకి వస్తాయి” అని ప్రకటించాడు. ఆనాటినుంచి రాజ్యంలో దేవమాన్యాలు రద్దయ్యాయి. దీపారాధనలకు చమురు కొనడానికి కూడా ఆదాయాలు సరిపోక చాలా గుళ్లలో గబ్బిలాలు ఎగరసాగాయి. అగ్రహారాలపై కవిపండితుల హక్కుభుక్తాలు వెనక్కి వెళ్లిపోయాయి. సత్రాలు మూతపడ్డాయి. దానమిచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరూ పన్ను చెల్లింపుదారులే అయ్యారు. రాజ్యంలో జరుగుతున్న ఈ అవకతవకలన్నీ పట్టపురాణి చారుమతి చెవిన పడ్డాయి. ఒకనాడామె రాజును చేరవచ్చి..
“ప్రభూ! సిరులు పాదరసం లాంటివి. పట్టబోతే చెల్లాచెదురుగా ఎటుపోతాయో చెప్పలేం. యౌవనం ప్రవాహవేగం కలది. జీవితం క్షణభంగురం అని తెలుసుకుని, దానధర్మాలు చేయనివాడు స్వర్గద్వారాలను చేరుకోలేడు. పైగా ముదిమి వయసులో అనేక రోగాలపాలై నరకాన్ని అనుభవించి, మరణిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందులోనూ విక్రమార్కుని వంటి ధర్మాత్ముని కడుపున పుట్టి మీరింత పిసినిగొట్టుగా మారడం ఎందుకు?” అని హితబోధ చేసింది. కీర్తికేతుడు ఆమెవంక చిరాకుగా చూశాడు.
“ఆదాయం లేని రాజ్యాన్ని పాలించడం ఎంత కష్టమో నీకు తెలుసా?!” అని తీవ్రంగా ప్రశ్నించాడు.
“ధనానికి మీకు లోటేముంది ప్రభూ! మీ తండ్రిగారు మీతో చెప్పని రహస్యం ఒకటి ఉంది. మన పెరటిలో కల్పవృక్షం ఉంది. మీ కుమారుని తరం వరకు ఆ కల్పవృక్షం మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుందని దేవేంద్రుడు వరమిచ్చాడట” అని చెప్పిందామె. ఆమె మాటలతో కీర్తికేతుని కన్నులు విప్పారాయి.
“ఇకనైనా మీ తండ్రితాతలు ఆచరించిన సంప్రదాయాలను మీరూ కొనసాగించండి ప్రభూ!” అన్నది రాణి వేడుకోలుగా. కానీ, కీర్తికేతుడు ఆమె మాటలు తోసిపుచ్చాడు.
“కల్పవృక్షం ఉన్నది.. దేశంలో ముష్టివాళ్లను పెంచి పోషించడానికా?! దానితో చాలా పనులున్నాయి. సైన్యాన్ని అభివృద్ధి పరచాలి. దండయాత్రలు నిర్వహించి, దేశాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. మాట్లాడకుండా ఊరుకో” అన్నాడు. చారుమతి చేసేదేమీ లేక కన్నీరు నింపుకొన్నది.
* * *
కీర్తికేతునికి పదహారేళ్ల వయసున్న ఓ కుమారుడున్నాడు.. అతని పేరు విజయభాస్కరుడు. వయసులో చిన్నవాడైనా తాతకంటే దయామయుడు. అడిగినవారికి లేదనకుండా దానమివ్వడంలో ఆయనను కూడా మించిపోయాడు. తండ్రికి తెలియకుండా రోజూ ఖజానా నుంచి కొంత ధనం తీసుకుపోయి, దారిలో కనిపించే పేదసాదలకు పంచిపెడుతుండే వాడు. మొదట్లో ఆటగా మొదలైన ఆ అలవాటు ఆ కుర్రవాడికి క్రమంగా వ్యసనంగా మారిపోయింది. కోశాగారంలో పెద్దయెత్తున ధనం మాయమవ్వడం కీర్తికేతుని దృష్టికి వచ్చింది. అధికారులను పిలిచి విచారించగా.. దానికి కారణం తన కుమారుడే అని తెలిసింది.
“యువరాజు నుంచి ఎవరెవరు దానాలు తీసుకున్నారో వాళ్లందరినీ ఖైదు చేయండి” అని ఆజ్ఞాపించాడు. ‘చిత్తం ప్రభూ!’ అంటూ ఆ భటులు వెళ్లిన కొద్దిసేపటికే మరికొందరు వచ్చి.. అతనికో దుర్వార్త చెవిన వేశారు. “యువరాజుల వారు ఇందాకా కల్పవృక్షం వద్దకు వెళ్లారు మహారాజా! తాను బతికి ఉన్నంతకాలం ధర్మపరులైన వారిని సేవించి, స్వర్గానికి తిరిగివెళ్లమని వృక్షదేవతను ప్రార్థించారు. చూస్తుండగానే కల్పవృక్షం ఆకాశానికి ఎగిరిపోయింది. చిన్నవేరు ముక్కకూడా మిగలకుండా పెద్ద గొయ్యి మాత్రమే మిగిలింది” అని చెప్పారు.ఆ వార్త వింటూనే కీర్తికేతుడు కుప్పకూలిపోయాడు. తన ఆశలన్నీ ఆవిరి చేసిన కొడుకుపైన, అతణ్ని అలా తయారుచేసిన భార్యపైనా విపరీతమైన క్రోధం కలిగింది. ఆ ఆవేశంలో..
“తల్లీ కొడుకులిద్దరినీ దూరంగా అడవిలోకి తీసుకుపోయి వధించండి. వాళ్లిద్దరి నెత్తురంటిన కత్తి చూసేవరకూ నాకు శాంతిలేదు” అని భటులను ఆజ్ఞాపించాడు.రాజాజ్ఞను అతిక్రమించే అవకాశం లేదు కనుక, భటులు వాళ్లిద్దరినీ బంధించారు. దూరాన ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి, వధ్యశిలపైకి చేర్చారు. “మహారాణీ! మా ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాం. మమ్మల్ని మన్నించడమ్మా!” అని వేడుకున్నారు.
“నాయనా! దయచేసి నా కొడుకుకంటే ముందుగా నన్ను వధించండి” అని కోరుకుంది మహారాణి.. తల్లిమనసు కావడం మూలాన.“ఎందుకమ్మా! నేను మాత్రం నీ మరణాన్ని తట్టుకోగలనా? మనకు ఆయువుంటే ఈ కత్తి మనల్నేమీ చేయలేదు” అని ఊరడించబోయాడు విజయభాస్కరుడు. అతడి మాటలు నిజం చేస్తూ సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికో సింహం వచ్చింది. సైనికులపై పడి బీభత్సం సృష్టించసాగింది. విజయభాస్కరుడు కట్టుతాళ్లు తెంచుకునే లోపల సైనికులందరినీ చంపి ఎటో వెళ్లిపోయింది సింహం. ఇటువంటి సన్నివేశాలు చూసినప్పుడే ‘దైవఘటన’ అంటుంటారు పెద్దవాళ్లు. చంపడానికి వచ్చినవాళ్లంతా చంపబడ్డారు. చనిపోవాల్సిన వాళ్లిద్దరూ బతికారు. విజయభాస్కరుడు తన తల్లిని తీసుకుని, తమను నరకడానికి సైనికులు తెచ్చిన కత్తిని ధరించి.. ఆ అడవినుంచి బయలుదేరాడు. ఉజ్జయినికి పెడగా తల్లీకొడుకులిద్దరూ చాలాదూరం నడిచారు. ఎండ కన్నెరుగని సుకుమారి కావడంతో మహారాణికి ఎక్కువదూరం నడిచేసరికి కాళ్లు బొబ్బలెక్కాయి.
“నాయనా! ఇక నాకు నడిచే ఓపిక లేదు. నన్నిక్కడే వదిలేసి, చీకటి పడేలోపుగా నువ్వు ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి చేరుకో” అని ఎంతగానో చెప్పి చూసింది.
విజయభాస్కరుడు ససేమిరా అంగీకరించలేదు.
“ఆయువున్నంత వరకు అడవిలో ఉన్నా, నగరంలో ఉన్నా ఒకటే. ప్రాణభయంతో తల్లిని నట్టడవిలో విడిచిపెట్టి చరిత్రహీనుణ్ని కాలేను” అన్నాడు. తల్లికోసం కొన్ని పళ్లు, దుంపలు, మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఒక పొదరింటికి సమీపంలో కొంతచోటు శుభ్రంచేసి, తల్లిని నిద్రించమని తాను కాపలా కూర్చున్నాడు. చీకటి దట్టమైంది. సుమారుగా అర్ధరాత్రి కావస్తుండగా అక్కడ మనుషుల అలికిడి వినిపించింది. వాళ్లిద్దరూ ఉన్న పొదరింటికి అవతలి వైపున నలుగురు దొంగల గుంపు ఒకటి వచ్చింది. వాళ్లో పన్నెండేళ్ల బాలికను ఒక బుట్టలో పెట్టుకుని తీసుకువచ్చారు. కాగడాల వెలుతురులో ఆ పొదరింటి మాటున ఉన్న ఒక తలుపు తెరుచుకుని, వాళ్లంతా లోనికి వెళ్లడం విజయభాస్కరుడు గమనిస్తూనే ఉన్నాడు. దాదాపు ఒక ఘడియ తరువాత ఆ దొంగలు బయటికి వచ్చారు.
“ఒరేయ్! రేపు పౌర్ణమి. ఆ చిన్నదాన్ని రేపే అమ్మవారికి బలివ్వాలి. రేపు చీకటిపడే సమయానికి తిరిగి వద్దాం” అన్నాడు దొంగల నాయకుడు. “సరే దొరా!” అంటూ దొంగలందరూ ఎక్కడి వాళ్లక్కడికి వెళ్లిపోయారు. అంతా సద్దుమణిగిందని అనుకున్న తరువాత విజయభాస్కరుడు మెల్లిగా ఆ పొదరింటి తలుపు తెరిచాడు. అదో భూగృహం. లోపలికి మెట్లున్నాయి. చీకటిలో తడుముకుంటూ లోపలికి వెళ్లిన తరువాత అనేక గదులున్నాయి. మణులు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో అపార ధనరాశులు కనిపించాయి. ఓ పక్కగా ఇందాక తెచ్చిన అమ్మాయి కట్టిపడవేసి ఉంది. ఆ గదులకు మధ్యలో ఒక ఎత్తయిన వేదికమీద కాళికాదేవి దర్శనమిచ్చింది. రక్తం కారుతున్న నాలుక బయటికి చాపి, ఎర్రటి కన్నులు విప్పార్చి చూస్తూ భయం గొలిపేలా ఉన్నది దేవత. విజయభాస్కరుడు అమ్మవారి ముందుకు వెళ్లాడు.
“నువ్వు బిడ్డల్ని కన్న తల్లివా? ఎందుకు వేశావమ్మా ఈ వేషం?! నీ బిడ్డలు తప్పు చేస్తుంటే వద్దని వారించాల్సింది పోయి, మరింత ప్రోత్సహిస్తున్నావా? నీకింత రక్తదాహమేంటి?!” అని దేవతను ప్రశ్నించాడు. అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చి..
“నువ్వంటూ లేకపోతే తప్ప.. ఈ బలులు ఆగవు” అంటూ సర్రున కత్తి దూశాడు. అప్పుడు విగ్రహం నుంచి మాటలు వినిపించాయి.
“ఆగు కుమారా! దేవతాద్రోహానికి ఒడిగట్టకు. నువ్వు చెప్పినట్లే ఇకనుంచి నేను బలులు అంగీకరించను. కేవలం కందమూలాలు మాత్రమే ఆరగిస్తాను. నన్ను రక్షించు” అన్నది కాళికాదేవి.
ఆ మాటలతో విజయభాస్కరుడు కరవాలాన్ని పక్కన పెట్టాడు.
(వచ్చేవారం.. దయాపరుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ