Rahul Gandhi : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇటీవల అమెరికా సైన్యం (US Military) చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (Indian sailers) మరణించడంపై భారత ప్రభుత్వ స్పందన సరిగా లేదని లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం అమెరికాకు ఒక నమ్మకమైన సేవకుడిలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఘటనపై అమెరికా ఏమాత్రం పశ్చాత్తాపం చూపకపోగా.. వారి ఆదేశాలను పాటించని నౌకలను సహించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించడాన్ని ఆయన తప్పుబట్టారు.
‘అమెరికా దాడుల్లో మన ముగ్గురు నావికులు చనిపోయి కొద్ది రోజులే అయ్యింది. అయినా ఇంతవరకు వారి నుంచి కనీసం పశ్చాత్తాపం లేదు. క్షమాపణ లేదు. పైగా మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ‘అమెరికా సైన్యం ఆదేశాలను తక్షణమే పాటించాలి. ఎలాంటి ఉల్లంఘనలైనా సహించేది లేదు’ అన్న వారి మాటలు చూడండి. ఒక స్వతంత్ర దేశం ఇలాంటి భాషను ఎప్పటికీ సహించదు. కానీ మన బలహీన ప్రధాని మాత్రం నోరు మెదపడం లేదు. ఒక విధేయుడైన సేవకుడిలా వారి ఆదేశాలను వింటున్నారు, పాటిస్తున్నారు. ఈ బలహీన ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు. ఎందుకంటే దేశాన్ని అవమానించే వాళ్ల నియంత్రణలో ఆయన ఉన్నారు. అందుకే మన వాళ్లను చంపినా, మనల్ని అవమానించినా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఇది దేశ ప్రజలందరూ గమనించాలి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన చాలా బలహీనంగా ఉందని, ఆయన కేవలం ‘ఇది సమర్థనీయం కాదు’ అనడం సరికాదని అన్నారు. మరో నేత మనీశ్ తివారీ మాట్లాడుతూ.. అమెరికా మంత్రి వ్యాఖ్యలు బెదిరింపుగా ఉన్నాయని, నావికుల మృతికి వారే కారణమన్నట్లుగా ఉన్నాయని ఆరోపించారు.