నిజామాబాద్, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూడు రోజుల క్రితం రుణాల ఊబిలో కూరుకుపోయి నిజామాబాద్ నగరానికి చెందిన ఓ జంట తనువు చాలించింది. కన్న బిడ్డలను ఒంటరి చేసి కానరాని లోకాలకు పయనం అయ్యారు. ఇదీ కేవలం ఈ జంటకే పరిమితమైన సమస్య కాదు. నెలలో నాలుగైదు చోట్ల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. బిజినెస్లో వచ్చే నష్టాలు భర్తీ చేయలేక చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ… మధ్యతరగతి కుటుంబాలను వేధిస్తోంది. చూపునకు సగటు మిడిల్ క్లాస్ కుటుంబం పెద్దగా కనిపించినప్పటికీ రోజుల వ్యవధిలో రోడ్డున పడే దుస్థితి నెలకొంటోంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేసే వారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
పని ఉన్నన్ని రోజు లు ఫర్వాలేదనిస్తుంది. ఉన్నట్టుండి ఉద్యోగం ఊడితే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. సాఫీగా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే వాళ్లలో రోజురోజుకు పెరుగుతోన్న ఖర్చులు, సరిపోని జీతం వల్ల ఆర్థిక ఊబిలోకి కూరుకు పోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణలేమి ఒక కారణమైతే సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఆశలు కూడా రుణాలు చేసేందుకు ధైర్యాన్ని ఇస్తోంది. బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు ఎగబడి రుణాలిచ్చి తీరా ముక్కు పిండి వసూళ్లకు పాల్పడటం, బ్రోకర్లను ముందు పెట్టి పరువు తీయడం నిత్యకృత్యమవుతోన్న ఘటనలే. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాల సానుభూతికి నోచుకోక, సమాజంలో ఉన్నతంగా ఎదగలేక… ఆశలు, ఆశయాలను చంపుకుంటూ తమ కలలను విషాదాంతం చేసుకుంటున్నారు. కొంతమంది పగటి కలగానే మిగుల్చుకుంటున్నారు. అతి తక్కువ మంది మాత్రమే అనుకున్నది సాధిస్తున్నారు.
మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక జీవితకాల కల. ఉద్యోగం వచ్చిన కొన్నేళ్లకు స్థలం కొనుగోలు చేసి, బ్యాంకు రుణం తీసుకుని ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు. అయితే నిర్మాణం మధ్యలో సిమెంట్, ఇనుము, విద్యుత్ సామగ్రి, కూలీల ఖర్చులు పెరగడంతో అంచనా వ్యయం దాటిపోతోంది. ఇల్లు పూర్తి చేయడానికి మరో రుణం… దాన్ని తీర్చడానికి వ్యక్తిగత రుణం. అవసరాలకు క్రెడిక్ కార్డు… ఇలా ఒక అప్పు మరో అప్పు కు దారి తీస్తోంది. నెల జీతంలో పెద్ద భాగం ఈఎంఐలకే వెళ్లిపోతే మిగిలిన మొత్తంతో కుటుంబాన్ని నడపడం కష్టం అవుతోంది. ఆదాయం పెరగకపోయినా అప్పుల చెల్లింపులు మాత్రం ప్రతి నెల తప్పనిసరిగా కొనసాగాలి. ప్రైవేటు ఉద్యోగుల్లో సమస్య కేవలం జీతం తక్కువగా ఉండడమే కాదు.
జీతం పెరుగుదల వేగం కంటే కుటుంబ వ్యయాలు వేగంగా పెరగడం అసలు సమస్యగా మారుతోంది. పిల్లల స్కూల్ ఫీజులు, రవాణా, వైద్యం, మందులు, బీమా, కిరాణా, ఇంటి అద్దె, వాహన ఇంధనం వంటి ఖర్చులు నెలవారీ బడ్జెట్ను కుదించేస్తున్నా యి. అదనంగా ఉద్యోగం కోల్పోతే లేదా సంస్థలో జీతం ఆలస్యమైతే అప్పుల చెల్లింపులకు ఇతరులపై ఆధారపడాల్సిందే. ఫలితంగా కొన్ని కుటుంబాలు అత్యవసర అవసరాలకు కూడా కొత్త రుణాలపై ఆధారపడి ఆర్థిక ఇరకాటంలో పడి పోతున్నాయి. ఒక అప్పుకు సంబంధించిన ఈఎంఐ చెల్లించడానికి మరో వ్యక్తిగత రుణం తీసుకోవడం మొదలైతే అప్పుల చక్రం మెడకు చుట్టుకుంటోంది.
చివరకు నెల జీతంలో గణనీయమైన భాగం వడ్డీలు, ఈఎంఐలకే వెళ్తుంది. అప్పుడు మధ్యతరగతి జీవితంలో పొదుపు కనిపించదు. అత్యవసర పరిస్థితుల్లో మళ్లీ అప్పే ఆధారమై వాటిని తిరిగి చెల్లించలేని దుస్థితిలో ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాల రీతిలోనే వ్యాపారం చేసే వాళ్లలోనూ ఇదే గడ్డుకాలం ఎదురవుతోంది. బిజినెస్లో నష్టాలు పూడ్చుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న వారు లేకపోలేదు. ఇది కేవలం వ్యక్తిగత ఆర్థిక సమస్య కాదు. కుటుంబ ఆర్థిక భద్రతకు సంబంధించిన సమస్య.
ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబానికి నెల జీతం అంటే భరోసా. జీతం వచ్చిన రోజున ఇంటి అద్దె, పిల్లల చదువులు, కిరాణా, కరెంట్ బిల్లు, వైద్యం, భవిష్యత్తు అవసరాల నిమిత్తం పొదుపు… ఇలా కుటుంబ అవసరాలను సర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే నెల జీతం… జీతం వచ్చిన రోజే ఆవిరై పోతోంది. అప్పుల చెల్లింపుల్లో కరిగి పోతోంది. ధరల పెరుగుదల, పిల్లల విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు, ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు, ఇంటి అద్దెలు, వాహన నిర్వహణ ఖర్చులు ఒకవైపు… మరోవైపు ఉద్యోగ భద్రతపై అనిశ్చితి, పరిమిత జీతాలు, ఈఎంఐ భారం… ఇవన్నీ కలిసి ప్రైవేటు ఉద్యోగుల కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఈఎంఐ సంస్కృతి అనేది భవిష్యత్ జీతాన్ని ముందే ఖర్చు చేయడం అన్నట్లుగా మార్చేసింది.
కారు, బైక్, ఫోన్ నుంచి ఇంటి సామగ్రి వరకు ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఖరీదైన వస్తువులు కొనడం సులభమైంది. ఈ సౌలభ్యమే మనకు తెలియకుండానే భవిష్యత్ ఆదాయాన్ని ముందుగానే ఖర్చు చేసే పరిస్థితికి చేర్చింది. ప్రైవేటు రంగంలో మంచి జీతం వస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రతపై అనిశ్చితి అనేక కుటుంబాలను వెంటాడుతోంది. సంస్థలో ఉద్యోగం పోతే ఒక్కసారిగా కుటుంబ ఆదాయం నిలిచి పోవచ్చు. కానీ ఇంటి రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం, పిల్లల స్కూల్ ఫీజులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఒక వైపు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అదనపు పని గంటలు, మరోవైపు ఇంటి ఆర్థిక ఒత్తిడి ఫలితంగా కుటుంబ జీవితం, మానసిక ప్రశాంతత దెబ్బతింటున్నాయి.