కంఠేశ్వర్, ఆగస్టు 13: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేశాక రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని సీపీఐ జాతీయ నాయకురాలు పద్మ అన్నారు. సీపీఐ ప్రచార జాతలో భాగంగా గురువారం జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపురాశులను సందర్శించి రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, జగిత్యాల నుంచి ప్రతి ఏటా 9 లక్షల క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వస్తుందని తెలిపారు. పసుపు బోర్డు వచ్చాక కూడా గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. అర్హులైన రైతులకు పసుపు పంట సాగుకు అవసరమైన యంత్రాలు సబ్సిడీ ద్వారా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో అందకపోవడంతో మరింత భారం పడుతుందన్నారు.
పసుపు బోర్డు పూర్తిస్థాయిలో పని చేస్తే మద్దతు ధర, కొత్త వంగడాలు, అమ్ముకోవడంలో బాధలు తప్పుతాయని, ఉడకబెట్టడానికి నూతన టెక్నాలజీతో కొత్త మిషనరీలు వస్తే ఖర్చు తగ్గుతుందని వివరించారు. మార్కెట్లో దళారుల బెడద తగ్గుతుందన్నారు. జిల్లా ఎంపీ అర్వింద్ పసుపు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని పసుపు బోర్డుకు నిధులు మంజూరు చేయాలని లేనిపక్షంలో తన పదవికి రాజీనామాకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య, నాయకులు స్వరూపరాణి, గంగారాం, ఫిరోజ్అలీ, సురేశ్, రమేశ్, అంజయ్య, నగేశ్, సాయిలు, సభ్యులు పాల్గొన్నారు.