Tamil Nadu : తమిళనాడులో ఉప ఎన్నికల సందడి నెలకొన్నది. ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సహా పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇటీవలి ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్ (Tricchi East), పెరంబూర్ (Perambur) స్థానాల నుంచి గెలిచిన విజయ్.. నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.
దీనికి తోడు టీఎంసీ ప్రభుత్వానికి విశ్వాస పరీక్షలో మద్దతిచ్చిన నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎస్ జయకుమార్ (పెరందురై), మరగతం కుమరవేల్ (మధురాంతకం), పీ సత్యభామ (ధారపురం), ఇసక్కీ సుబ్బయ్య (అంబసముద్రం) తమ పదవులకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. దాంతో మరో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు మొదలుపెట్టింది. జూన్ 22 నాటికి అన్ని సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించింది. పరిపాలన, లాజిస్టిక్స్ అంశాలను సమీక్షించిన తర్వాత రాబోయే వారాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.