Kasi Majili Kathalu Episode 56 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఒక బెస్తవాడు తనకు వలలో దొరికిన కంకణాన్ని ధనంజయుడనే రాజుకు సమర్పించాడు. అందుకు ప్రతిగా అతడి కొడుకైన పుష్పహాసుణ్ని యువరాజుతో సమానంగా చదివించాడు మహారాజు. కానీ, తనకంటే విద్యలలో అధికుడైన పుష్పహాసుణ్ని చూసి.. యువరాజు అసూయ చెందాడు. అంతకుముందు దొరికిన కంకణం లాంటిదే మరొకటి దొరకడంతో.. దానిని రాజుగారికి సమర్పించాలని కోటకు వెళ్లాడు పుష్పహాసుడు. అక్కడ యువరాణి లలితను చూసి ప్రేమలో పడ్డాడు. అడ్డువచ్చిన యువరాజును కొట్టాడనే అభియోగంపై పుష్పహాసుణ్ని బంధించాలని మహారాజు ఆజ్ఞాపించారు.
పుష్పహాసుడి తండ్రి అయిన గుహుణ్ని తెచ్చి రాజుముందు నిలబెట్టారు భటులు. “ప్రభూ! వాడు నా కన్నకొడుకు కాదు. చేపల వలలో దొరికాడు. అప్పటికి వాడికి నాలుగైదేళ్లు ఉంటాయి. కోరినవన్నీ ఇచ్చి అల్లారుముద్దుగా పెంచుకున్నాను. విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు కదా.. అని సంతోషించాను. కానీ, యువరాజునే కొట్టాడని తెలిసేసరికి కోపం ఆపుకోలేక నాలుగు దెబ్బలు వేశాను. దాంతో అలిగి ఎటో పారి పోయాడు” అని జవాబు చెప్పాడు గుహుడు.
తన చెల్లెలి చేతి కంకణాలు దొరికిన బెస్తవాడికే, ఆ పిల్లవాడు కూడా దొరికాడని తెలియడంతో.. ధనంజయుడు ఆలోచనలో పడ్డాడు. తన భర్త, ఐదేళ్ల పిల్లవాడితో కలిసి ఒకనాటి రాత్రి అంతఃపుర సౌధ ఉపరిభాగంలో నిద్రిస్తుండగా తన చెల్లెలైన గంధర్వదత్త… మంచంతో సహా కనిపించకుండా పోయిన సంఘటన గుర్తుకు వచ్చి చాలాసేపు దుఃఖంలో మునిగిపోయాడు.
* * *
మరునాటి తెల్లవారుజామున రాకుమారి లలిత కలవరపాటుతో నిద్రలేచింది.
“ఏమైంది సఖీ!” అని అడిగిన వసంతతిలకతో..
“నా మదనుడు కలలోకి వచ్చాడు. ‘సఖీ! నేను చాలాదూరం వెళ్లిపోతున్నాను. నిన్ను మళ్లీ కలుసుకోలేక పోతున్నందుకు బాధగా ఉంది. కానీ, నీ వాలుచూపులు, నీ కరస్పర్శను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. ఎప్పటికీ నా మనసులో గుర్తుంచుకుంటాను. నీ మాటలే తలుచుకుంటూ నా ప్రాణాలు నిలబెట్టుకుంటాను’ అని చెప్పాడు. ఆ కలకు అర్థమేమిటో తెలియడం లేదు. అతనికేదైనా అపాయం సంభవించి ఉంటుందేమోనని భయంగా ఉంది” అని చెప్పింది.
వసంతతిలక ఆమెను ఓదార్చుతూ..
“ఆ పుష్పహాసుని పల్లె నాకు తెలుసు. నేను వెళ్లి తెలుసుకుని వస్తాను” అంటూ బయల్దేరింది.
ఆమె తిరిగి వచ్చేవరకు లలిత క్షణమొక యుగంగా.. అసహనంగా గడిపింది. సాయంత్రం వేళకు వసంతతిలక రానేవచ్చింది.
“సఖీ! నువ్వు చెప్పింది నిజమే. ఆ పుష్పహాసుడు దేశాంతరం వెళ్లిపోయాడట” అని చెప్పింది.
ఆ మాట వింటూనే లలితకు గుండె నీరైపోయింది.
“ఇంక నేను బతకడం దేనికి?” అని ఏమేమో చెప్పడం మొదలుపెట్టింది.
వసంతతిలక ఆమెను వారించి.. “నన్ను పూర్తిగా చెప్పనీయి. నేనతడి గురించి వివరాలు సేకరిస్తూ ఆ పల్లెలో తిరుగుతుండగా ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి, ‘నువ్వు వసంతతిలకవేనా?’ అని ప్రశ్నించాడు. ‘నాపేరు నీకెలా తెలుసు?’ అని ఆశ్చర్యంగా అడిగితే.. ‘నీకు ఇమ్మని పుష్పహాసుడు నాకో జాబు ఇచ్చాడు’ అని నా చేతిలో పెట్టాడు”.. ఆమె మాటలు ఇంకా పూర్తికాకుండానే..
“ఏదీ జాబు?!”.. ఆరాటంగా అడిగింది లలిత.
ఆ లేఖను ఆమె చేతిలో ఉంచింది వసంతతిలక.
గబగబా చదువుకుంది లలిత.
“ఇందులో కూడా నా కలలో చెప్పిన విషయాలే పద్య రూపంలో ఉన్నాయి” అని నిట్టూర్చి జాబును పక్కన పడేసింది.
దానిని వసంతతిలక తన చేతిలోకి తీసుకుని.. “పూర్తిగా చదవకుండా కంగారు పడతావేం?! ఇక్కడ గీతల్లో బొమ్మల్లో కూడా కొన్ని విషయాలు రాశాడు కదా.. వీటిని బట్టి చూస్తే మన నగరానికి సమీప అరణ్యంలో ఉన్న మర్రిచెట్టు వద్ద ఐదు రోజులు ఉంటాడట. అక్కడినుంచి రేవానగరం వెళ్లి వారం రోజులు గడుపుతాడట. ఆ తరువాత అమరావతీ నగరానికి వెళతాడట. ఈ వివరాలన్నీ ఇతరులు గుర్తు పట్టకుండా ఎంత తెలివిగా రాశాడో చూశావా?!” అని చూపించింది. లలిత ఆసక్తిగా చూస్తుండగా.. “ఇవన్నీ రాశాడంటే తనతోపాటు మనల్ని కూడా రమ్మని అర్థం కదా! నువ్వేమంటావు?” అని అడిగింది.
“అనడానికి ఏముంది?! అతను లేనిచోట నేను బతకలేను” అన్నది లలిత.
మూడురోజుల తరువాత ఒకనాటి రాత్రి వాళ్లిద్దరూ ఒంటరిగా కోటదాటి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. లలిత గుర్రం తోలుతుండగా వసంతతిలక వెనుక కూర్చుంది. అప్పటివరకు గుర్రమెక్కిన అనుభవం లేకపోవడం వల్ల.. “సఖీ! కొంచెం మెల్లిగా పోనియ్యి. నాకు భయం వేస్తున్నది” అని చెప్పసాగింది.
కానీ, తమ సంగతి ఇంట్లోవాళ్లకి తెలిస్తే ప్రమాదమనే ఉద్దేశంతో లలిత వేగం తగ్గించలేదు. వసంతతిలకకు ధైర్యం చెబుతూ వీలైనంత వేగంగా గుర్రాన్ని నడిపించసాగింది. చీకటిలో వాళ్లిద్దరూ చాలాదూరం ప్రయాణించారు. వెనుక కూర్చున్న వసంతతిలకకు భయం ఎక్కువ కాసాగింది. పట్టుతప్పి ఆ నిర్జనారణ్యంలో ఒకలోయ వంటి ప్రాంతంలో పడిపోయింది. లలిత పాపం.. ఆమెకోసం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
చివరికి చేసేదిలేక లలిత తన ప్రయాణాన్ని కొనసాగించింది. లేఖలో పేర్కొన్న ప్రకారం మర్రిచెట్టు వద్దకు చేరుకుంది. కానీ, ఆమె వెళ్లే సమయానికి పుష్పహాసుడు ‘రేవానగరానికి పోతున్నాను’ అని చెట్టుపై రాసి, అక్కడినుంచి వెళ్లిపోయాడు.
రేవా నగరానికి వెళ్లే దారి తెలియక లలిత విచారంలో మునిగి పోయింది. ఆ మర్రిచెట్టు నీడనే విశ్రాంతి తీసుకోసాగింది.
ఆ సమయంలో అక్కడికి సమీప గ్రామంనుంచి సమిధలు సేకరించుకోవడానికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. ఒంటినిండా నగలతో, గుర్రంతో, ఒంటరిగా అడవిలో కనిపించిన లలితను చూసి, వనదేవతేమో అనుకున్నాడు.
“వనదేవతా! నాపేరు గోవిందుడు. మాది ఇక్కడికి దగ్గరలోనే చామ్రపురం. నాకింకా పెళ్లికాలేదు. తొందరగా పెళ్లయ్యేలా నాకేదైనా వరమివ్వగలవా?!” అని కోరాడు.
ఆ మాటలకు లలిత నవ్వుకుని.. “నేను దేవతను కాను. ఎక్కడా ఆశ్రయం దొరకనందువల్ల ఈ చెట్టుకింద ఉన్నాను” అని చెప్పింది.
గోవిందుడు నిరాశపడి.. “ఇంకా నువ్వు దేవతవేమో అనుకున్నాను. ఆడపిల్లవు ఒంటరిగా ఈ అడవిలో భయం వేయడం లేదా.. నీకెవరూ లేరా?! పోనీ మా ఇంటికి వస్తావా? మా అమ్మకు చెప్పి మంచి భోజనం పెట్టిస్తాను” అన్నాడు.
అన్నం తిని రెండురోజులు కావడంతో లలిత అంగీకరించి, అతని వెంట నడిచింది. గోవిందుని తల్లి ఆమెను ఆదరించింది. మూడు రోజులపాటు లలిత వాళ్లింటిలోనే ఉండిపోయింది. ఆసరికి గోవిందునికి ఆమెను పెళ్లాడాలనే బుద్ధి పుట్టింది. తల్లితో ఆ సంగతి చెప్పి లలితను ఒప్పించమని కోరాడు. ఆమె కూడా లలితతో తన కుమారుని గొప్పతనాన్ని గురించి అనేకమార్లు పొగిడి, తన కోడలివి కమ్మని కోరింది. లలిత అందుకు బదులేమీ చెప్పలేదు. నవ్వి ఊరుకుంది. అలా నవ్విందంటే ఆమెకిష్టమే అనుకుంది గోవిందుని తల్లి. ఆ మాటే అతనితో చెప్పింది.
దాంతో లలిత వద్దకు చేరి గోవిందుడు ఇచ్చకాలాడ సాగాడు.
అప్పుడు లలిత చాలా సానుభూతి చూపిస్తూ.. “నేను రావడం వల్ల నీకు చాలా ఖర్చు అవుతున్నట్లున్నది. ఇదిగో ఈ కంకణం తీసుకువెళ్లి అంగడిలో అమ్ముకుని, ఇంట్లోకి కావాల్సిన వెచ్చాలు తెచ్చుకో” అన్నది.
‘నాకు కాబోయే పెళ్లాం అప్పుడే ఇంటి బాధ్యత కూడా తీసేసుకుంది’ అని ఆనందపడిపోతూ, గోవిందుడు ఆ కంకణాన్ని బజారుకు తీసుకువెళ్లి అమ్మజూపాడు.
అంత విలువైన వస్తువును అతని దగ్గర చూడటంతో అనుమానం వేసిన బంగారపు వ్యాపారి రాజభటులకు అప్పగించాడు. భటులు అతణ్ని బంధించి, రాజధానికి తరలించారు. ధనంజయుడు ఆ ఫిర్యాదును వినడానికి పదిరోజుల సమయం పట్టింది.
ఆనాడు గోవిందునితోపాటు ఒక దొంగలముఠా కూడా ధనంజయుని తీర్పు కోసం వేచి ఉంది.
గోవిందుడు తీసుకువచ్చిన కంకణం తన కుమార్తెదే అని ధనంజయుడు గుర్తుపట్టాడు.
“ఇది నీకెక్కడిది?” అని ప్రశ్నిస్తే.. ‘నా భార్య కంకణమే!’ అని జవాబిచ్చిన గోవిందుణ్ని చూసి చిరాకు పడ్డాడు ధనంజయుడు.
“కొంతకాలం కిందట ఒక అమ్మాయి గుర్రంపై ఇతని ఇంటికి వచ్చిందట మహాప్రభూ! కానీ, ఈ గోవిందుడు బంధితుడైన రోజునే ఆ అమ్మాయి అక్కడినుంచి వెళ్లిపోయిందని తెలిసింది” అని భటులు చెప్పారు.
“వీడు అమాయకుడే. కానీ, నా కూతురుని ఇబ్బంది పెట్టినవాణ్ని తేలికగా విడిచిపెట్టను. వీడికి ద్వీపాంతరవాస శిక్ష విధిస్తున్నాను” అన్నాడు రాజు.
ఆ తరువాత దొంగలముఠా దోచుకొచ్చిన నగలను రాజుముందు ప్రదర్శించారు. అవి కూడా లలితవేకావడంతో ఆయన ఆశ్చర్యపోయాడు.
“ఈ నగలు మీకెలా వచ్చాయి?!” అని హుంకరించాడు.
“అడవిమార్గంలో వెళ్తుంటే గుర్రంమీద ఒక అమ్మాయి కనిపించింది మహారాజా! మేమందరం చుట్టుముట్టేసరికి.. ‘నగలు తీసుకుని నన్ను వదిలెయ్యండి’ అని బతిమాలింది. ముందు మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ, మాలో ఒకరిని వరించమని ఆమెను ఒత్తిడి చేశాం. దాంతో ఆమె ఒక శూలం తీసుకుని దూరంగా విసిరేసింది. ‘దానిని ఎవరైతే ముందుగా తీసుకొచ్చి ఇస్తారో వాళ్లనే పెళ్లాడతాను’ అని చెప్పింది. మేమందరం శూలంకోసం పరిగెత్తాం. ఆమె చిత్రంగా గుర్రంమీద పారిపోయింది. ఇంతలో మీ భటులు వచ్చి మమ్మల్ని బంధించారు” అని చెప్పాడు దొంగల నాయకుడు.
వాళ్లు చెప్పిందంతా విన్న తరువాత.. “వీళ్లను ఉప్పుపాతర వెయ్యండి” అని కఠినంగా ఆజ్ఞాపించి, ధనంజయుడు సింహాసనం మీద నుంచి లేచాడు.
* * *
ఆనాడు లలిత నడుపుతున్న గుర్రంమీద నుంచి జారిపడ్డ వసంతతిలక అనేక కష్టనష్టాలకు ఓర్చి రేవానగరానికి చేరుకుంది.
ఆనాటి రాత్రి ఒక శక్తి ఆలయంలో తలదాచుకుంది. మరునాటి నుంచి పుష్పహాసుని గురించి, లలితను గురించి వాకబు చేయాలనుకుంటూ… కొత్త ప్రదేశం కనుక నిద్రపోకుండా తెల్లవారడం కోసం వేచి
చూడసాగింది.
కొంచెం పొద్దుపోయిన తరువాత.. ఆ ఆలయానికి నల్లగా తుమ్మమొద్దులా, ఒంటినిండా తామరతో బాధపడుతున్న పోలయ్య అనే కామందు తన పాలేరుతో సహా వచ్చాడు.
“ఒరే అసిరిగా! అప్పి కనిపించిందా? చోటు సరిగ్గా చెప్పావా? ఆమెను తీసుకొస్తుందంటావా?” అని ప్రశ్నించాడు తన పాలేరును.
“చెప్పాను బాబూ! కాసేపట్లో వచ్చేస్తుంది” అని సమాధానమిచ్చాడు అసిరిగాడు.
“ఈ చీకట్లో ఏమీ కనబడి చావడం లేదు. తొందరగా వచ్చేస్తే బాగుండు” అనుకుంటూ అరుగుమీద కూలబడ్డాడు పోలయ్య.
అంతకుముందే అక్కడ ఉన్న తేలు పోలయ్యను కుట్టింది.
“చచ్చాన్రో బాబోయ్!” అని గట్టిగా అరవబోయి, సంబాళించుకున్నాడు పోలయ్య.
“ఏమైంది బాబూ!” అని అసిరిగాడు ఆదుర్దా పడుతుంటే.. “ఒరేయ్ నా మందుల పెట్టెలో తేలు మందుంది. తొందరగా వెళ్లి పట్రా” అన్నాడు పోలయ్య.
అసిరిగాడు ఇంటికి పరుగుపెట్టాడు. ఇంతలో అప్పి రానేవచ్చింది. ఆమెతో పాటు మరో స్త్రీ. చూడబోతే కులీనలా ఉన్నది. అమ్మవారికి వివిధ నైవేద్యాలు తీసుకువచ్చి, భక్తితో సమర్పిస్తున్నది.
ఈలోపుగా అప్పి మెల్లిగా పోలయ్య పక్కన చేరి.. “ఆమెను తీసుకువచ్చాను. గుళ్లో ఉంది. మంచితనంగా మీ ముచ్చట తీర్చుకోండి. ఏదీ నా బహుమానం” అన్నది చెయ్యి జాపి. ఆమె చేతిలో రెండుకాసులు ఉంచాడు పోలయ్య.
“నువ్వు తీసుకొచ్చావు కానీ, ఏమీ లాభం లేదు. నన్నిప్పుడే తేలు కుట్టింది. ఈ సమయంలో సరసం అంటే నావల్ల కాదు. నువ్వు దయచేసి ఆమెను మరోసారి తీసుకురా” అని కోరాడు.
“చూద్దాంలెండి” అంటూ సొమ్ము తీసుకుని వెళ్లిపోయింది అప్పి.
అక్కడ జరుగుతున్న తతంగమంతా దూరంనుంచి వసంతతిలక గమనిస్తూనే ఉంది. ఆమెకు రాత్రంతా శ్రమ తెలియకుండా గడిచిపోయింది.
(వచ్చేవారం.. రేవానగరంలో కలకలం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం
Kasi Majili Kathalu | దయాపరుడు
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!