Kasi Majili Kathalu Episode 58 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : పుష్పహాసుణ్ని ప్రేమించిన యువరాణి లలిత.. తన చెలికత్తె అయిన వసంతతిలకతో కలిసి రేవానగరానికి ప్రయాణమైంది. దారిమధ్యలో యువరాణి, చెలికత్తె విడిపోయారు. రేవానగరంలో పోలయ్యను చంపినందుకు విచారణను ఎదుర్కొంటున్న గంధర్వదత్తను రక్షించబోయి.. వసంతతిలక కూడా ద్వీపాంతరవాస శిక్షకు గురైంది.
ఒకరోజు గడిచింది. ఆవేళ ఉదయాన్నే పుష్పహాసుడు బందీ అయ్యాడు.
“దేవా! వీడు మళ్లీ ఆ రాతలు రాసివున్న గోడదగ్గరే తచ్చాడుతుండగా పట్టుకున్నాం” అని భటులు నివేదించారు.
“తీసుకుపోయి కారాగారంలో పడేయండి. మన దగ్గర ఖైదీలుగా ఉన్నవాళ్లతో పాటు వీణ్ని కూడా నౌక ఎక్కించేద్దాం” అన్నాడు చమూపతి.
వసంతను, రాచపడుచు ఉన్న గదికి పక్కగదిలోనే పుష్పహాసుణ్ని ఉంచారు. రెండు గదులకు మధ్య ఇనుప ఊచలు మాత్రమే ఉన్నాయి. గోడ లేదు.
వసంతతిలక అతణ్ని చూస్తూనే..
“ఎవరు నువ్వు? నిన్నెందుకు ఖైదు చేశారు?!” అని ప్రశ్నించింది.
“వాడెవడో పుష్పహాసుడట. వాడే నేననుకుని నన్ను బంధించారు. నేను కాదు మొర్రో అంటుంటే వినిపించుకోవడం లేదు” అని గగ్గోలు పెట్టాడతను.
అందుకు వసంత నవ్వి..
“నువ్వు పుష్పహాసుడివి కాదని నాకు తెలుసు. కానీ, ఎందుకీ వేషం వేశావు?!” అని అడిగింది.
అందుకు ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు. వసంత అతణ్ని ప్రశ్నించడం మానేసి, ఇవతలికి వచ్చింది. దిగాలుపడి కూర్చుని ఉన్న రాచ
పడుచును సమీపించి..
“అమ్మా! మీరు కులీన వంశానికి చెందినవారిలా ఉన్నారు. ఈ దాసీవృత్తి ఎందుకు చేస్తున్నారు. అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్పండి” అని అడిగింది.
అందుకామె గాద్గదికమైన కంఠంతో..
“అమ్మాయీ! ఇంతవరకు నా కథ ఎవరికీ చెప్పలేదు. కానీ, నీ ముఖం చూస్తుంటే చెప్పకుండా ఉండలేక
పోతున్నాను. నా పేరు గంధర్వదత్త. ధనంజయుడనే మహారాజుగారి సోదరిని” అన్నది.
వసంతతిలక పట్టలేని ఆనందంతో..
“మీరేనా గంధర్వదత్తగారు?! నా జన్మధన్యమైంది. నేను మీ మేనకోడలి పరిచారికను” అని తనను తాను పరిచయం చేసుకుంది.
పుష్పహాసుడనే అనుమానంతో పక్కగదిలో బంధింపబడిన వ్యక్తి.. వారిద్దరి మాటలనూ ఆలకిస్తున్నాడు.
గంధర్వదత్త తన కథ చెబుతున్నది.
“మా అన్న ధనంజయుడు! నన్ను వింధ్యకూట పాలకుడైన మణికులుడనే రాజుగారి అబ్బాయి వరుణ
దత్తుడికిచ్చి పెళ్లి చేశాడు. ఏడాది లోపలే మాకు పండంటి కొడుకు పుట్టాడు. వాడి ముద్దుముచ్చట్లు చూసుకుంటూ మేమిద్దరం నాలుగేళ్ల కాలాన్ని నాలుగు నిమిషాల్లా గడిపేశాం. అలా ఉండగా ఒక వసంతకాలం నాటి రాత్రి.. అంతఃపుర సౌధపు పైభాగంలో మంచం వేసుకుని.. పిల్లవాణ్ని మధ్యలో ఉంచుకుని నిద్రలోకి జారుకున్నాం. మా ఆనందానికి అదే చివరిరాత్రి అని అప్పటికి తెలియలేదు. తెల్లవారేసరికి నేను.. ఆర్యభట్టు అనే ఆయన పొలంలోని గడ్డిమేటుపై పడి ఉన్నాను. ఆయన నా ముఖంపై నీళ్లుచల్లి స్పృహ తెప్పించాడు. లేచి చూస్తే నా భర్త, పిల్లవాడు కనిపించలేదు. ఎందుకోకానీ ఆయనకు నా వివరాలు చెప్పబుద్ధి కాలేదు. చేసేదిలేక నన్ను తనతోపాటు తీసుకువెళ్లి, కూతురిలా చూసుకోసాగాడు. నాలుగునెలల కిందట ఆయనకు మృత్యుఘడియలు సమీపించాయి. అప్పుడాయన తన తమ్ముడైన సూర్యభట్టును పిలిపించి, తన ఆస్తిని రాసిచ్చి.. దాంతోపాటు నా బాధ్యతలు కూడా అప్పజెప్పాడు. ఆవిధంగా నేను ఈ నగరానికి వచ్చాను. ఆ తరువాత జరిగిన కథంతా నువ్వు ఎరిగినదే!” అని చెప్పడం పూర్తిచేసింది గంధర్వదత్త.
వసంతతిలకతోపాటుగా పక్కగదిలోనే పుష్పహాసుడిగా అనుమానించి బందీగా ఉన్న వ్యక్తికూడా ఆ కథ వింటూ కళ్లు ఒత్తుకున్నాడు.
“అమ్మాయీ! నువ్వు మా అన్నగారి పరిచారికను అని చెప్పావు కదా! మా అన్న ఎలా ఉన్నాడు? తనకు సుందరకుడనే కొడుకు, లలిత అనే కూతురు ఉండాలి.
లలితను నా కొడుక్కు చేసుకోవాలని అనుకునేవాళ్లం. లలితకు పెళ్లయిందా?” అని ప్రశ్నించింది గంధర్వదత్త.
“ఇంకా లేదమ్మా! పుష్పహాసుడనే పల్లెవాణ్ని ప్రేమించి, ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడెక్కడుందో” అన్నది వసంతతిలక.
“అయ్యయ్యో! చిన్నపిల్ల. ఎన్ని కష్టాలు పడుతోందో ఏమో!?” అని ఆదుర్దాపడింది గంధర్వదత్త.
“మరేమీ పరవాలేదమ్మా! ఆ పుష్పహాసుడు వీరాధి
వీరుడు. యువరాణిగారు తప్పకుండా అతణ్ని కలుసుకుంటారు” అని ఆమెను ఓదార్చింది వసంతతిలక.
ఆనాడు పెద్దగుడిలో గోడపైన ఏదో రాసిన తరువాత భటులు తరుముకొస్తుంటే గోడదూకిన వాడు నిజమైన పుష్పహాసుడు. అతడు దూకిన గోడకు ఆవలివైపున ఒక మల్లెపందిరి ఉంది. ఎత్తుపై నుంచి దూకినా పందిరిమీద పడటం వల్ల అతనికేమీ గాయాలు కాలేదు. కానీ, దబ్బుమంటూ చప్పుడయ్యేసరికి… ఆ పందిరి వద్ద పూలుకోసుకుంటున్న పదహారేళ్ల ఆడపిల్ల బెదిరిపోయింది.
పుష్పహాసుడు మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్లి..
“అమ్మాయీ! ఈ ఇల్లెవరిది? నీ పేరేమిటి? చూడబోతే మంచిదానిలా ఉన్నావు. నాకో ఉపకారం చేసిపెట్టగలవా?” అని అడిగాడు.
ఆ అమ్మాయి హొయలు కురిపిస్తూ..
“ఇది వజ్రదత్తుడనే వర్తకుని ఇల్లు. నేను వారి అమ్మాయిని. నా పేరు వజ్రమాల. మా తండ్రిగారు ద్వీపాంతరంలోని అమరావతీ నగరానికి వర్తకం నిమిత్తం వెళ్లారు. నేను, మా తల్లి కూడా అక్కడికి పోవాల్సి ఉన్నది. కానీ, ఇంతలో పోలయ్య అనే మా బంధువొకణ్ని ఎవడో చంపేశాడు. దాంతో మా ప్రయాణం ఆగిపోయింది” అని తన కథనంతా చెప్పుకొంటూ పోసాగిందామె.
అపుడు పుష్పహాసుడు..
“నారీమణీ! నన్ను అన్యాయంగా రాజభటులు తరుముతున్నారు. వారినుంచి తప్పించుకుని అమరావతికి పారిపోతున్నాను. కానీ, దారి తెలియకుండా ఉన్నాను. మీరు వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకుపోతే ధన్యుడినవుతాను” అని కోరాడు.
అందుకు వజ్రమాల చాలా సంతోషిస్తూ..
“నిన్ను నా గదిలో దాచిపెడతాను. రాత్రికి మా అమ్మ నిద్రపోయిన తరువాత వచ్చి కలుసుకుంటాను. మాతో పాటు నిన్ను తీసుకుపోయే ఏర్పాటు చేస్తాను” అన్నది.
పుష్పహాసుడు కూడా ఆమెపట్ల అనురాగం కలిగిన
వాడిలా అభినయిస్తూ, ఆమె చూపిన గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఆమె భోజనం తీసుకుని వచ్చింది.
“నా స్నేహితురాలు కూడా అమరావతి వస్తుందని చెప్పి, అతికష్టం మీద మా అమ్మని ఒప్పించాను. నువ్వు ఆడవేషం వేసుకుంటే మాతో రావచ్చు” అన్నది.
“ఎలాగో ఒకలాగ అమరావతి చేరుకుంటే చాలు” అన్నాడు పుష్పహాసుడు భోజనం పూర్తిచేస్తూ.
అలిసిపోయి ఉండటం వల్ల పుష్పహాసుడు ఆదమరిచి నిద్రపోయాడు. మరునాడు వాళ్లు ప్రయాణమయ్యారు. కులీనవంశానికి చెందిన స్త్రీలు కనుక, వాళ్లను ఎక్కువగా పరీక్ష చేయకుండానే ఓడ సరంగు విడిచిపెట్టేశాడు.
మరో పదిరోజుల్లో ఆ ఓడ అమరావతికి చేరాల్సి ఉన్నది. కానీ, అనుకోకుండా సముద్రతుఫాను చెలరేగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలో ఉన్న యవనద్వీపానికి ఓడను చేర్చి లంగరు వేశారు.
ఓడ తీరానికి చేరుతూనే యవనద్వీపంలో ఉన్న ప్రజలు ప్రయాణికులను యథేచ్ఛగా దోచుకుని, కట్టుబట్టలతో విడిచిపెట్టారు. దొంగలకు భయపడి ఓడలోని
వారంతా చెల్లాచెదురై పోయారు. వజ్రమాల, ఆమె తల్లి, పుష్పహాసుడు కలిసికట్టుగా సముద్రతీరంలో కొంతదూరం నడిచివెళ్లారు. అప్పుడు వారికి రెండుగుర్రాలు పూన్చిన రథంమీద వస్తూ యవనద్వీపపు సైన్యాధికారి తారసపడ్డాడు. వారి వాలకాన్ని గమనించి..
“అమ్మా! మీరెవరు? ఎక్కడినుంచి వస్తున్నారు?” అని ప్రశ్నించాడు.
“అయ్యా! మాది రేవానగరం. అమరావతికి వెళ్తుంటే దారిలో గాలివాన వచ్చి మా ఓడ ఇక్కడికి కొట్టుకొచ్చింది. దారి తెలియక తిరుగుతున్నాం” అని చెప్పింది వజ్రమాల తల్లి.
“అమ్మా! చాలా ప్రమాదకరమైన చోటికి వచ్చారు. ఈ ద్వీపంలో అందరూ దొంగలే. ఇక్కడ మగవాళ్ల కంటపడితే చాలా ప్రమాదం. ముందు రథం ఎక్కండి. మా ఇంటికి తీసుకువెళ్తాను” అని చెప్పి ఎక్కించుకున్నాడు.
ఇంటికి వెళ్లేదారిలో..
“మన హిందూ రాజ్యాలవారు ద్వీపాంతరవాస శిక్ష పడిన నేరగాళ్లను ఇక్కడికే పంపిస్తుంటారు. ఇది భూలోక నరకం. ఇక్కడ ఎక్కువకాలం ఉండటం క్షేమం కాదు. త్వరలో అమరావతికి వెళ్లే ఓడ వస్తుంది. అందులో వెళ్లిపోవచ్చు. అంతవరకు ఎవరికంటా పడకుండా
జాగ్రత్తగా మసలుకోండి” అని బోధించాడు.
సైన్యాధికారి భార్య వసంతసేన ఆ ముగ్గురినీ ఆదరించింది. స్త్రీవేషంలో ఉన్న పుష్పహాసుడు ఒక్కరోజులోనే వసంతసేనకు ఆత్మీయుడు కాగలిగాడు.
“అమ్మా! ఈ యవనద్వీపంలో మీరెలా ఉంటున్నారు? అసలు ఇక్కడికెలా వచ్చారు? ఎంతకాలమైంది?” అని ప్రశ్నించాడు.
అప్పుడు వసంతసేన తమ కథ ఇలా చెప్పింది.
“సుందరీ! అసలు మాది హిందూదేశమే. మా తండ్రిపేరు శూరసేనుడు. ఎవరో చక్రవర్తిగారి సామంతునిగా ఉండేవాడట. ఓసారి చక్రవర్తికి మా తండ్రిగారిపై ఏదో విషయంలో కోపం వచ్చి, రాజ్యాధికారం తీసివేశారట. ఆ అవమానం తట్టుకోలేక మా తండ్రి.. నలభై ఏళ్ల కిందట ఈ దేశానికి వచ్చాడు. ఈ సుల్తానును మెప్పించి, మంచి పదవి పొందాడు. ఆ తరువాత పదేళ్లకు నేను పుట్టాను. నాకు యవ్వనం వచ్చేసరికి మా తండ్రి నా పెళ్లి గురించి దిగులు పెట్టుకున్నాడు. చక్కటి హిందూ సంబంధమే కుదర్చాలని మనసులో ఉన్నా, సాధ్యమయ్యే అవకాశం లేక తనలో తానే మధనపడ సాగాడు.
అలావుండగా, ఒకరోజున సముద్రతీరానికి ఒక వీరపురుషుడు కొట్టుకుని వచ్చాడు. రెండురోజులు స్పృహలేకుండా ఉన్న ఆ వీరునికి మా తండ్రి తగిన ఉపచారాలు చేయించాడు. మెలకువ వచ్చిన తరువాత కూడా ఆ వీరుడు తానెవరో గుర్తుతెచ్చుకోలేక పోయాడు. వరుణ
దత్తుడని తన పేరు తప్ప అతనికేమీ గుర్తులేదు. అప్పుడు మా తండ్రిగారు, తనతోపాటు సుల్తాన్ గారి కొలువుకు తీసుకువెళ్లాడు. రాజకార్యాలలో శిక్షణ ఇచ్చాడు. నన్నిచ్చి పెళ్లి చేశాడు. మావారు ఈ రాజ్యంలో గొప్ప పలుకుబడి పొందారు. ఇదీ మా కథ”.. అని ముగించింది.
స్త్రీవేషంలో ఉన్న పుష్పహాసుడు ఆ కథంతా విన్నాడు. అక్కడ ఉన్నంతకాలం వసంతసేనను తల్లిలా సేవిస్తూ ఆమెకు చేదోడు వాదోడుగా మెలగసాగాడు.
ఉన్నట్లుండి ఒకరోజున..
“అమ్మా! రెండురోజుల్లో మేం వెళ్లిపోతాం. ఈలోగా మాకు ఈ నగరం చూడాలని ఆశగా ఉంది. ఒక్కసారి మమ్మల్ని బయటికి పంపగలవా?” అని అడిగాడు.
అందుకు వసంతసేన చాలా కంగారు పడింది.
“అమ్మో! చాలాప్రమాదం. మగవాళ్లెవరైనా మిమ్మల్ని చూస్తే మానభంగానికి పాల్పడగలరు. వద్దు” అన్నది.
పుష్పహాసుడు ఆమెను బతిమాలాడు.
“పరదాలు వేసుకుని వెళ్తాం. ఎవ్వరూ మమ్మల్ని చూడరు” అని ఎన్నోవిధాలుగా చెప్పాడు.
వసంతసేన సరేనని, వరుణదత్తుడు పనిమీద బయటికి వెళ్లిన సమయంలో ముగ్గురినీ పరదాలు కట్టిన బండి ఎక్కించి పంపించింది. బండి రాజవీధిలో నడుస్తుండగా పుష్పహాసుడు బురఖా తొలగించుకుని, పరదా తప్పించి బయటికి తొంగి చూశాడు. ఆ పట్టణం అందాలను చూస్తూ తనివితీరా ఆనందించి, తిరిగి వచ్చేశాడు.
సరిగ్గా పుష్పహాసుడు తెర తొలగించి చూసిన చోటనే.. సుల్తాన్ మందిరం ఉంది. ఆ సమయానికి సుల్తాన్ మేడపైన ఉన్నాడు. పూలరథంలాంటి బండిలో ఆడపిల్ల పోతుంటే చూసిన సుల్తాన్ తట్టుకోలేక పోయాడు.
“ఆమె ఎవరో తెలుసుకోండి!” అని భటులను ఆజ్ఞాపించాడు సుల్తాన్.
ఆమె వరుణదత్తుని ఇంటికి అతిథిగా వచ్చిందని భటులు తెలిపారు. అప్పుడు సుల్తాన్ వరుణదత్తుని పేరు మీద ఒక ఆజ్ఞాపత్రం పంపాడు.
‘మీ ఇంటికి వచ్చిన సుందరాంగిని ఈవేళ సాయంత్రమే తీసుకువచ్చి సుల్తాన్ గారితో నిఖా జరిపించాలి. లేదంటే మీరు రాజద్రోహం చేసిన వారవుతారు’ అని ఉంది ఆ పత్రంలో.
ఆ పత్రాన్ని చూసిన వరుణదత్తుడు విలవిలలాడాడు.
“వాళ్లను బయటికి పంపి పెద్ద సాహసం చేశావు. ఆశ్రయం కోరి వచ్చిన ఆడదాన్ని ఆ రాక్షసుడి చేతికి ఎలా అప్పగించను?” అని భార్యవద్ద వేదన పడ్డాడు.
ఆ విషయం పుష్పహాసునికి తెలిసింది.
“అయ్యా! మా మానప్రాణాలు రక్షించిన మీరు మాకు దైవంతో సమానం. మీ మర్యాదకు లోపం రావడం నాకిష్టం లేదు. మరేమీ పరవాలేదు. నిర్భయంగా నన్ను పంపించండి. నన్ను నేను రక్షించుకోగలను. మీ సుల్తాన్ గారిని పెళ్లాడి ఆయన ముచ్చట చప్పగా చల్లారుస్తాను” అని చెప్పాడు.
(వచ్చేవారం.. దేవదూత చేసిన సాయం)
సరిగ్గా పుష్పహాసుడు తెర తొలగించి చూసిన చోటనే.. సుల్తాన్ మందిరం ఉంది. ఆ సమయానికి సుల్తాన్ మేడపైన ఉన్నాడు. పూలరథంలాంటి బండిలో
ఆడపిల్ల పోతుంటే చూసిన సుల్తాన్ తట్టుకోలేక పోయాడు.
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం
Kasi Majili Kathalu | దయాపరుడు
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!