Kasi Majili Kathalu Episode 61( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : ‘ఇంద్రజాలం వంటి మాయావిద్యల ద్వారా సృష్టించిన సంపదలు ఎక్కువకాలం నిలబడవు’ అని నిరూపించే కథను మణిసిద్ధుడు గోపాలకుడితో చెబుతున్నాడు. వృద్ధుడైన కామగ్రీవుని నుంచి మాయోపాయం ద్వారా భద్రుడు, శరభుడు అనేవారు ఇంద్రజాల, పరకాయ ప్రవేశ విద్యలను గ్రహించారు.
రత్నాకరమనే నగరానికి వెళ్లిన భద్రునికి.. అక్కడ రాజుగారికి రోజూ పంచాంగం వినిపించే శంతనుడు అనే బ్రాహ్మణుని ఇంటిలో ఆతిథ్యం దొరికింది. శంతనుడి తల్లి భద్రుణ్ని ఆపేక్షగా ఆదరించింది. ఆ తల్లీకొడుకుల మాటల్లో భద్రునికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ఆ పట్టణాన్ని ఏలే కృతవర్మకు మూడురోజుల కిందట పెద్దజబ్బు చేసింది. ప్రాణాలమీదికి వచ్చింది. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. కానీ, అంతలోనే తేరుకున్నాడు. అప్పటినుంచి కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు. అరవై ఏళ్ల ముదిమి వయసులో రాణి తన మందిరానికి రావడం లేదని అలక పూనాడు. మహారాజు వింత ప్రవర్తన చూసి, రాణి జడుసుకుంటున్నది.
అప్పటివరకూ ఎంతో ధార్మికంగా ఉండే మహారాజు కాస్తా శృంగారలోలుడు కావడం.. అందరికీ వింత గొలుపుతున్నది. రాజు మరణించిన వెంటనే ఎవరో పరకాయ ప్రవేశ విద్యానిపుణుడు ఆయన శరీరంలో ప్రవేశించి ఉంటాడని మంత్రులు భావిస్తున్నారు. శంతనుడు ప్రతిరోజూ పంచాంగం వినిపించడానికి వెళ్తుంటే.. “నా పంచాంగం నేనే చూసుకుంటాలే!” అంటున్నాడు.
“రాణి సహకరించడం లేదు కనుక, మరో కన్యను వెతికి పట్టుకో!” అని శంతనుణ్ని ఆజ్ఞాపించాడు మహారాజు.
ఆయనకు తగిన కన్యను వెతికి పట్టుకోకపోతే తన ఉద్యోగం ఊడిపోయేలా ఉందని శంతనుడు బాధపడసాగాడు. ఆ సంగతి విని, భద్రుడు అతణ్ని ఓదార్చాడు.
“మీ రాజు వ్యవహారం చూస్తుంటే మంత్రుల అనుమానం నిజమే అనిపిస్తున్నది. నా అంచనా సరైనదైతే.. ఇది నాతోపాటు చదువుకున్న శరభుడు చేసిన పనే! నేను చెప్పినట్లు చేస్తే మీ రాజు నీకు వశుడవుతాడు” అంటూ ఏం చేయాలో బోధించాడు.
మరునాడు శంతనుడు కోటకు వెళ్లి.. “మహారాజా! మన నగరానికి కొత్తగా ఒక యువతి వచ్చింది. ఉత్తరదిక్కున ఉద్యానవనంలో విడిది చేసింది. ఆమె సాధారణ మానవకాంత కాదు. అప్సరస కాబోలని అందరూ చెప్పుకొంటున్నారు. ఆమె స్వయంవరంలో పతిని వరించాలనే ఉద్దేశంతో ఉంది. మీకు ఆసక్తి ఉంటే వెళదాం” అన్నాడు.
కృతవర్మ ఎగసిపడ్డాడు. తొందరగా ఆ చిన్నదాన్ని చూపించమని శంతనుణ్ని తొందరపెట్టాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఊరికి దూరంగా ఉన్న ఉద్యాన వనానికి వెళ్లారు. భద్రుడు చేసిన ఇంద్రజాల మహిమ వల్ల ఏర్పడిన ఉద్యానమది. భారతంలో మయసభలా అడుగడుగునా అనేక వింతలున్నాయి దాంట్లో.
వాటిని చూసి కృతవర్మ తడబాటు పడుతుంటే.. “మహారాజా! నేనంటే కొత్తవాణ్ని. కానీ, మీరు మాత్రం ఈ తోటలోకి చాలాసార్లు వచ్చి ఉంటారు కదా!” అన్నాడు శంతనుడు.
అందుకు కృతవర్మ చిరాకుపడుతూ..
“ఊరికే నన్ను తిప్పి చంపకపోతే, ఆ చిన్నది ఎక్కడ ఉందో చూపించరాదా?!” అన్నాడు.
కొంతసేపు వాళ్లిద్దరూ పొదరిళ్లు వెతికి చూశారు. ఒకచోట ఒక సుకుమారి పూలు కోసుకుంటూ కనిపించింది. ఆమె సోయగాన్ని చూసినవెంటనే శంతనుడు, కృతవర్మ కూడా మోహం ఆపుకోలేక కళ్లు తిరిగి పడిపోయారు. మెలకువ వచ్చి చూసేసరికి అక్కడెవరూ లేరు.
శంతనుడే ముందుగా తేరుకుని రాజును చేయిపట్టుకుని పైకి లేపాడు.
“దేవా! చూశారా.. ఆ చిన్నదాని సౌందర్య మహిమ చేత మనం మూర్ఛపోయాం. దాని పరిచారికలు మనల్ని ఇవతలికి ఈడ్చి పారేశారు కాబోలు. ఈరోజుకు ఇంటికి పోదాం పదండి” అని తీసుకుపోయాడు.
కోటనుంచి తిన్నగా భద్రుడి వద్దకు వెళ్లి అతణ్ని మెచ్చుకుంటూ.. “మిత్రమా! నీ సామర్థ్యం అతీంద్రియమైనది. ఇంద్రజాలమని తెలిసినా.. నేను కూడా మూర్ఛపోయాను” అన్నాడు.
భద్రుడు నవ్వి, అతనికి మరునాడు చేయాల్సిన పనులు చెప్పి పంపాడు.
శంతునుణ్ని వెంటబెట్టుకుని, కృతవర్మ మళ్లీ ఆ వనానికి వెళ్లాడు. అక్కడో మేడ కనిపించింది.
“శంతనా! మనమేదో కొత్తచోటికి వచ్చినట్లున్నాం. నిన్న ఇక్కడ మేడ లేదు కదయ్యా!” అడిగాడు కృతవర్మ.
అందుకు శంతనుడు నవ్వుతూ.. “అయ్యో మహారాజా! ఇది మీ క్రీడాసౌధం కదా! ఇదివరకు ఎన్నోసార్లు మీరిందులో ఉన్నారు. మరిచిపోయారా ఏమిటి? నిన్న మనం ఆ మూలకు వెళ్లడం వల్ల ఈ మేడ కనిపించలేదు” అని చెప్పాడు.
కృతవర్మ తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు.. “ఆ.. ఇప్పుడు గుర్తొచ్చింది” అంటూ.. “ఇంతకూ ఆ సుందరి ఎక్కడుందో వెతకవయ్యా?!” అని తొందరపడసాగాడు.
శంతనుడు అతణ్ని ఆ మేడలోకి తీసుకుపోయాడు. అందులోని ఓ గదిలో ఆ చిన్నది హంసతూలికా తల్పంపై పడుకుని ఉంది. ఆమెను చూసి, మళ్లీ రాజు మూర్ఛబోతుండగా.. శంతనుడు వీపుతట్టి హెచ్చరించాడు. కృతవర్మ ఆశగా ఆమెనే చూస్తూ గుటకలు మింగుతూ ముందడుగు వేశాడు. అంతలో మంచంమీద నిద్రిస్తున్న యువతి మేల్కొని, వినయంతో ఒక పూలదండ తెచ్చి, రాజు మెడలో వేసింది.
‘ఆమె రంభ కాబోలు. ఈ పూదోట స్వర్గంలోని నందనవనం కాబోలు’.. అనుకుంటూ, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని సంశయిస్తూనే.. మాట్లాడకుండా, రెప్పవేయకుండా ఆమెనే చూడసాగాడు కృతవర్మ. ఆమె ఏవో శృంగార చేష్టలు ఒలకబోసే సరికి కృతవర్మ మళ్లీ మూర్ఛపోయాడు.
* * *
అక్కడితో ఇంద్రజాలం ముగిసిపోయింది. శంతనుడు వచ్చి, మహారాజును అంతఃపురానికి తీసుకుపోయాడు. ఆ విధంగా పదిరోజులపాటు రాజును రోజూ అక్కడికి తీసుకుపోయి, ఆ వింత చూపించి తీసుకురాసాగాడు. ఆ మాయా యువతి ఒకరోజు తాంబూలమిచ్చి, ఒకరోజు గంధంపూసి రాజును మత్తులో పడవేస్తుండేది. కానీ, రాజు ఒక్కనాడు కూడా మూర్ఛపోకుండా ఆగలేకపోయేవాడు. నాటకం అలాగే కొనసాగుతుండగా ఒకనాడు రాజు మంత్రులను పిలిచి.. “ఉత్తరదిక్కున ఉన్న తోటలో ఒక సుందరి ఉంది. ఆమెను నేను వరించాను. వెంటనే ఆమెను సగౌరవంగా కోటకు తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు.
అందుకు మంత్రులందరూ విస్తుపోతూ.. “మహారాజా! మన నగరానికి ఉత్తరదిక్కున ఉన్నది శ్మశానమే కానీ, తోటలేమీ లేవు కదా” అని విన్నవించుకున్నారు.
ఆ సమాధానం విన్న కృతవర్మ అదిరిపడ్డాడు. వారినందరినీ పంపివేసి, శంతనుడి కోసం కబురుపెట్టాడు.
మహారాజు తమ సంగతి కనిపెట్టేశాడని గుర్తించిన శంతనుడు.. “రాజా! మరిచిపోయారా? ఆ ఉద్యానవనం మీ తాతగారికి దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చాడు కదా! ఈ తోట మీ వంశస్తులకు తప్ప ఇతరులకు కనిపించదు కదా?!” అని యుక్తిగా చెప్పాడు.
అతని మాటలకు గజిబిజికి గురైన కృతవర్మ.. “ఓహో! మీ రాజ్యంలో ఇన్ని వింతలున్నాయా?” అన్నాడు పొరబాటుగా.
“అదేమిటి మహారాజా! ‘మీ రాజ్యం’ అంటున్నారు?! మీరు పరాయివారా?” అన్నాడు శంతనుడు. కృతవర్మ కొంత చికాకుపడ్డాడు.
“పద తోటకు పోదాం!” అని దారితీశాడు.
అక్కడ మళ్లీ భద్రుని ఇంద్రజాలం కొనసాగింది. ఆవేళ మాయాసుందరి కృతవర్మను గమ్మత్తుగా కౌగిలించుకుంది. దాంతో మళ్లీ అతనికి స్పృహ తప్పింది. యథాప్రకారం శంతనుడు అతణ్ని కోటకు తీసుకువచ్చాడు.
మరునాడే మిగిలిన మంత్రులందరినీ ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లుగా కృతవర్మ ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ మంత్రులందరూ మహారాణికి మొరపెట్టుకున్నారు.
“మన మహారాజు ఇలా కావడానికి కారణం శంతనుడే!” అని ఆరోపించారు.
శంతనుణ్ని అంతఃపురానికి తీసుకురమ్మని రాణి ఆజ్ఞాపించింది.
“అమ్మా! నేను రాజద్రోహం చేయడం లేదు. మన మంత్రులందరూ భావిస్తున్నట్లుగా మన రాజుగారు ఆనాడే మరణించగా, ఎవరో మాయావి వారి దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడని నాకు రూఢిగా తెలిసింది. దీనికి విరుగుడు చేయడానికి, ఇంద్రజాల విద్యలో ఘనుడైన నా మిత్రుడు భద్రుడి సలహాతో అతను చెప్పినట్లు నడుచుకుంటున్నాను” అని సమాధానం ఇచ్చాడు.
“అయితే ఆ భద్రుణ్ని ప్రవేశపెట్టండి” అన్నది రాణి.
భద్రుడు వచ్చాడు.
“రాజు శరీరంలోనుంచి మాయావి తొలగిపోయేలా చేయి!” అని మహారాణి అతణ్ని కోరింది.
భద్రుడు అంగీకరించాడు. అక్కడినుంచి తిరిగి వచ్చేస్తుంటే యువరాణి కాంతిసేన అతని కంటపడింది. చూపు తిప్పుకోలేకపోయాడు. మన్మథ బాణాలకు గురయ్యాడు. శంతనుడి సహాయంతో భద్రుడు అక్కడినుంచి అతికష్టం మీద బయటికి వెళ్లగలిగాడు.
ఆ తరువాత మహారాణి తన కూతురిని చేర పిలిచి.. “అమ్మా! నీకు వివాహం చేసి అల్లుణ్ని తెచ్చుకుని, అతనికి రాజ్యాన్ని అప్పగించాలని నేను, మీ నాన్నగారు ఎంతో ఆశించాం. కానీ, నీ వివాహం కాకముందే మీ నాన్నగారికి మృత్యువు వచ్చిపడింది. ఆయన దేహంలో ప్రవేశించినవాణ్ని తొలగించి.. నిన్నే రాణిని చేస్తామని మంత్రులు చెబుతున్నారు. చిన్నదానివి.. నువ్వు ఈ భారాన్ని భరించగలవా?!” అన్నది విచారంగా.
అప్పుడు కాంతిసేన తల్లికి ధైర్యం చెబుతూ.. “అమ్మా! నీకు బుద్ధిమతిక అనే స్త్రీ కథ చెబుతాను. ఆమె అనుకోని పరిస్థితుల్లో తన పిల్లలతో కలిసి ఒంటరిగా అడవి మార్గంలో ప్రయాణం చేస్తోందిట. ఒకచోట తెలియకుండా సింహం గుహ వద్ద విశ్రాంతి తీసుకోసాగింది. గుహలోని సింహానికి, ఆమె ధైర్యం చూసేసరికి ఆశ్చర్యం వేసింది. మెల్లిగా బయటికి వచ్చింది. సింహాన్ని చూసిన బుద్ధిమతిక బెదిరిపోకుండా.. ‘పిల్లలూ! మీరు సింహం మాంసం తప్ప తిననంటే ఎలా చచ్చేదిరా. దొరకనివ్వండి చూద్దాం’ అన్నది. ఆమె మాటలు విన్న సింహం బెంబేలుపడి, అక్కడినుంచి పారిపోయింది. గుహ విడిచిపెట్టి, వేరేచోట తలదాచుకున్న సింహాన్ని చూసిన నక్క ఒకటి ఫక్కుమంటూ నవ్వింది. ‘అడవికి రాజువైన నువ్వే ఇలా బెదిరితే ఎలాగయ్యా?! పదపద ఆ మనుషుల్ని చంపి మనిద్దరం పంచుకుందాం’ అని ప్రోత్సహించింది. సింహాన్ని వెంటపెట్టుకుని వస్తున్న నక్కను చూసిన బుద్ధిమతిక దూరంనుంచే.. ‘ఏమే దొంగనక్కా! నా పిల్లలకోసం రెండు సింహాలను తీసుకొస్తానని మాటిచ్చి, ఇప్పుడేమో ఒక్కదాన్నే తెచ్చావా?!’ అని కసిరింది. దెబ్బతో.. ‘ఈ పాడు నక్క నన్ను బలిచ్చేస్తోందిరోయ్’ అని అరుస్తూ సింహం అడవిలోకి పారిపోయిందట. అలా ఒంటరి స్త్రీ అయినప్పటికీ బుద్ధిమతిక తన పిల్లలను చక్కగా కాపాడుకుని, సాయంత్రానికి ఇల్లు చేరింది. కనుక మనం ఈ సమయంలో బెదిరిపోకూడదు. తెలివిగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా మన బుట్టలో వేసుకోవచ్చు” అని వివరించింది.
కాంతిసేన మాటలు విన్న మహారాణి.. “ఏం చేస్తావోనమ్మా! జాగ్రత్త తల్లీ!” అంటూ అక్కడినుంచి కదిలింది.
కాంతిసేన తన చెలికత్తె అయిన కేసరిణితో కలిసి తగిన పథకాలు రచించుకోసాగింది.
ఆ మరునాడే తన ఇంద్రజాల ప్రభావానికి చివరిరోజుగా నిర్దేశించుకున్నాడు భద్రుడు. ఎప్పటిలాగే కృతవర్మ వచ్చాడు. మాయా సుందరి అతనికి పూర్తిగా లోబడినట్లు నటించింది. అనేక శృంగారలీలలు ప్రదర్శించింది. కృతవర్మ ఆమె చేయి పట్టుకుని, తనను పెళ్లాడమని నిర్బంధించాడు. అప్పుడామె విచారంగా మొహం పెట్టి, దూరంగా ఉన్న ఒక శవాన్ని చూపిస్తూ.. “మనోహరా! నాకో నిక్షేపం దొరికింది. నన్ను పెళ్లాడిన వాడికి దానిని సమర్పించాలని అనుకుంటున్నాను. కానీ, ఆ నిక్షేపం ఎక్కడ ఉందో మాత్రం తెలియదు. దాని వివరాలన్నీ అదుగో ఆ కుర్రాడికి తెలుసు. కానీ వాడు హఠాత్తుగా మరణించాడు. నువ్వు వాణ్ని బతికించి, నాలుగు మాటలు మాట్లాడించగలిగితే.. ఆ కట్నమిచ్చి, నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటాను” అన్నది.
శరభుడు మరింకేమీ ఆలోచించలేదు. చప్పున కృతవర్మ దేహంలోంచి బయటికి వచ్చాడు. చచ్చిపడి ఉన్న యువకుని దేహంలో ప్రవేశించాడు. దాంతో వాడు బతికాడు. మాయాసుందరి అతణ్ని అవతలికి తీసుకుపోయింది. భద్రుడు ఒక కత్తి తీసుకుని, కృతవర్మ దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. “అయ్యయ్యో! రాజుగారిని ఎవరో చంపేశారు బాబోయ్” అని అరుస్తూ కోటవైపు పరుగెత్తాడు.
ఇంద్రజాలం ముగిసిపోయింది. మాయాసుందరి కరిగిపోయింది. యువకుని దేహంలో మిగిలిపోయిన శరభుడికి, అప్పటికి గానీ తాను చేసిన తప్పు తెలిసి రాలేదు.
(వచ్చేవారం.. మహేంద్రజాలం – టక్కుటమారం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | కామగ్రీవుని విద్యలు
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం