పరిగి, జూన్ 12 : ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని ఆమరణ దీక్ష చేపట్టిన మండలంలోని కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న మహేశ్రెడ్డి వాహనాన్ని పోలీసులు రంగాపూర్ స్టేజీ వద్ద అడ్డగించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
పరిగి సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ మోహన్కృష్ణలతోపాటు పలువురు పోలీసులు మహేశ్రెడ్డి వాహనాన్ని ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్టు చెప్పి చన్గోముల్ పోలీస్స్టేషన్కు తరలించారు. తాను కాళ్లాపూర్కు వెళ్తున్నట్టు మీకు ఎవరు చెప్పారు, నేను పరిగికి వెళ్తున్నానని మహేశ్రెడ్డి పేర్కొనగా మాకు సమాచారం ఉన్నది.. అక్కడ పరిస్థితులు బాగా లేవని, అందువల్లే ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్టు చెప్పి మాజీ ఎమ్మెల్యేను చన్గోముల్ ఠాణాకు తరలించారు.
తమ భూములను ఇచ్చేది లేదంటూ కాళ్లాపూర్ గ్రామ రైతులు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం రెండోరోజూ కూడా కొనసాగింది. సర్పంచ్ పులిందర్, ఉపసర్పంచ్ గాండ్ల రమేశ్, పరిగి భానుచందర్, సోమగారి రమేశ్, సోమగారి జంగయ్య, కరోళ్ల బాలయ్య దీక్షలో కూర్చోగా వారికి మద్దతుగా గ్రామస్తులూ దీక్షలో పాల్గొన్నారు. ఆమరణదీక్ష చేపట్టిన వారికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, దోమ మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, కౌన్సిలర్ రవికుమార్, మిట్టకోడూర్ సర్పంచ్ మాణిక్యం, నాయకుడు సేవ్యనాయక్ తమ సంఘీభావం తెలిపారు.
రైతుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని.. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా ఇండస్ట్రియల్ పార్కు కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా కాళ్లాపూర్ శివారులో ఏర్పాటు చేసేందుకు పోలీసులు రోడ్స్టాపర్లు తీసుకురాగా తమ గ్రామానికి ఎవరు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు స్టాపర్లను పొలాల్లో పాడేశారు. తమ గ్రామానికి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి వస్తుండగా అడ్డుకొని అరెస్టు చేయడం ఏమిటని వారు పోలీసులను ప్రశ్నించారు.