Kasi Majili Kathalu Episode 66 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విద్యలకు సరస్వతి అయిన పద్మినిని.. విద్యాధికుడైన గురుదత్తుడు వివాహం చేసుకున్నాడు. అయితే దుర్గానగరం అధిపతి సురూపుడు అక్రమంగా పద్మినిని వాంఛించాడు. ఆమె కుటుంబాన్ని కష్టాలపాలు చేస్తానని బెదిరించాడు. దాంతో పద్మిని, ఆ రాజును వధించింది. పద్మిని, గురుదత్తుడు ఆ నగరం నుంచి పారిపోయారు.
తెల్లవారేసరికి కూతురు, అల్లుడు కనిపించక పోయేసరికి.. కుముదాంగదుడు నెత్తిన పిడుగుపడ్డట్లు నిశ్చేష్టుడయ్యాడు.
అటువైపు సురూపుడు కనిపించక రాచనగరులో అలజడి చెలరేగింది. రాజుకోసం భటులు నలుమూలలా గాలించారు. చివరికి కుముదాంగదుడి ఇంటి సమీపంలోని పెంటకుప్ప మీద సర్వాభరణ విభూషితుడైన సురూపుని శవం కనిపించింది. ‘పీడ విరగడైంది’.. అనుకున్నవారే కానీ, ‘అయ్యోపాపం!’.. అన్నవారు లేరు.
సురూపునికి వారసులు లేకపోవడం వల్ల అతని మరణవార్త వెంటనే చక్రవర్తి అయిన గజేంద్రవాహనునికి తెలియజేశారు. మంత్రులనే అధికారులుగా నియమిస్తూ ఆజ్ఞలు వెలువరించాడు చక్రవర్తి.
సురూపుణ్ని గురుదత్తుడు, పద్మినియే చంపి ఉంటారనే అనుమానంతో.. ‘వాళ్లెక్కడకు వెళ్లారు?’ అని.. కుముదాంగదుడిని వేధించసాగారు అధికారులు.
‘నాకేం తెలియదు బాబోయ్!’ అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా.. అతనికి గృహనిర్బంధ శిక్ష విధించారు.
పదిరోజుల తరువాత గదాధరుడు వచ్చాడు. కుముదాంగదుణ్ని ఓదార్చి, తనకోసం గురుదత్తుడు
వదిలివెళ్లిన ఉత్తరాన్ని చదువుకున్నాడు. అందులో ఇలా ఉంది.. ‘నలుడు, రాముడు, పాండవులు కూడా అనేక కష్టాలపాలు కాలేదా?! వాటిని పోగొట్టుకోవడానికి వారు ఏ మార్గంలో నడిచారో, మేమూ ఆ మార్గాన్నే ఆశ్రయిస్తున్నాం’.. ఆ ఉత్తరాన్ని చదివిన గదాధరుడు.. “దీని ప్రకారం మనవాళ్లిద్దరూ అడవిబాట పట్టినట్లు అర్థమవుతున్నది. నేను వారిని వెతికి వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి!” అని చెప్పి వెళ్లిపోయాడు.
* * *
దుర్గానగరానికి ఉత్తరాన దుర్గమారణ్యాలు ఉన్నాయి. వలయాకారంలోని పర్వతాలే పెట్టని కోటలుగా.. ఆ అడవిలో అనేక కోయపల్లెలు ఉన్నాయి. ఆ అడవుల గురించి పూర్తిగా తెలిసినవారికే కానీ ఇతరులకు, అక్కడ పల్లెలు ఉంటాయని తెలియనే తెలియదు.
గురుదత్తునికి, పద్మినికి అటువంటి ఒక కోయపల్లెలో ఆతిథ్యం దొరికింది. అక్కడే ఒక పాకవేసుకుని వాళ్లిద్దరూ జీవించసాగారు. ఆ కోయవారికి కలిగిన నైపుణ్యాలలో.. అడవిలో దొరికే ఆకులతో చాపలు, బుట్టతట్టలు అల్లడం కూడా ఒకటి.
పద్మిని, గురుదత్తుడు ఆ పనులు నేర్చుకున్నారు. వాటితోపాటు అడవిలో దొరికే నారలతో విచిత్రమైన తివాసీలను తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ వస్తువులను సమీప గ్రామాలలో అమ్ముకుని రావడం వల్ల కోయవారికి ఎంతో ధనం లభించేది. ఆ డబ్బును పద్మిని, గురుదత్తుడు ఆశించేవారు కాదు. వారి సేవలను మాత్రమే అంగీకరించేవారు.
వాళ్లకు ఆ అరణ్యమే ఉద్యానంలా, కొండలే క్రీడాస్థలాలుగా అనిపించసాగాయి. అలా కాలం గడుస్తుండగా.. కొంతకాలానికి పద్మిని గర్భిణి అయింది.
ఒకనాడు గురుదత్తుని ఒడిలో తలపెట్టుకుని.. “స్వామీ! నా వల్లనే కదా మీరిన్ని కష్టాలు పడాల్సి వచ్చింది” అని కన్నీరు కార్చసాగింది పద్మిని.
అప్పుడు గురుదత్తుడు ఆమె తల నిమురుతూ.. “నీ కష్టంతో పోలిస్తే నా కష్టం ఏ పాటిది? అయినా కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. హరిశ్చంద్రాదులు, ఇంద్రాది దేవతలు సహా కర్మసూత్రాన్ని దాటిన వారు ఎవరూ లేరు. దైవం ఎటు వంచితే అటు వంగి నడవాల్సిందే కానీ, ముక్కుసూటిగా పోవడానికి మనకేమీ స్వతంత్రం లేదు. మనకూ ఒకనాటికి మంచి రోజులు వస్తాయి” అని ఓదార్చాడు.
పద్మినికి క్రమంగా నెలలు నిండాయి. ఆమెకు రేపో మరునాడో ప్రసవం కావాల్సి ఉన్నది. అటువంటి సమయంలో గురుదత్తుడు ఒక వింతైన తివాసీ అల్లడానికి పూనుకున్నాడు. దానికోసం మృదువైన పిట్టరెక్కలు కావాల్సి వచ్చాయి. అందువల్ల వనచరులతో కలిసి గుట్టల మీదికి వెళ్లాడు గురుదత్తుడు. అక్కడ పిట్టరెక్కల కోసం వెతుకుతుండగా.. ఒక పాము గదాధరుణ్ని కరిచి పారిపోయింది. దాని విషశక్తి ఎంతటిదో కానీ, కాటువేసిన నిమిషంలోనే అతనికి తెలివి తప్పింది. అతని తోటివారు మందుచెక్కల కోసం గూడేనికి పరుగులు పెట్టారు.
వారిలో ఒకడు.. “అయ్యవారిని పురుగు కుట్టిందమ్మా! తెలివి తప్పింది” అంటూ పద్మినికి చెప్పేశాడు. అప్పుడు ఆమె గుండెలు బాదుకుంటూ వారి వెంట బయల్దేరింది.
ఒకచోట చిన్న మెట్ట ఎక్కుతుండగా ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. తోడుగా వచ్చినవారిలో ఒకడు పల్లె స్త్రీలను తీసుకురావడం కోసం వెళ్లగా, మిగిలినవారు గురుదత్తుని కోసం వెళ్లారు.
ఆ ఒంటరివేళలో ఆమెకు చక్కని కుమారుడు పుట్టాడు. కష్టమైన కానుపు కావడంతో ఆమెకు పూర్తిగా తెలివి తప్పింది. కొంతసేపటికి అక్కడికి వచ్చిన వాళ్లకు.. ఆమె ఒక్కతే కనిపించింది. పుట్టిన పిల్లవాడు లేడు. కిరాత స్త్రీలు పద్మినికి తగిన ఉపచారాలు చేసి, ఎత్తుకుని పల్లెకు మోసుకుపోయారు.
సాయంత్ర సమయానికి పద్మినికి స్పృహ వచ్చింది.
“నా కొడుకెక్కడ?” అని అడిగితే.. “నీకు కానుపు అయ్యింది కానీ, నీ కొడుకు ఏమయ్యాడో కనిపించలేదమ్మా!” అని సమాధానం చెప్పారు వాళ్లు.
పద్మిని పంటిబిగువున కన్నీరు కార్చింది.
“ఆయనకు ఎలా ఉంది?” అని అడిగింది.
“అయ్యవారు కూడా కనిపించలేదమ్మా” అని బిక్కుబిక్కుమంటూ చెప్పారు వాళ్లు.
“మేం వెళ్లేసరికి ఆయనక్కడ లేరు. అడవి ఏనుగు అడుగుల గుర్తులు కనిపించాయి. దానికోసం అడవంతా గాలించాం! ఎక్కడా అయ్యవారు లేరు కానీ, ఒక అడవి ఏనుగు చచ్చిపడి ఉంది” అని వివరించారు.
పద్మినికి గుండె బద్దలైపోయింది. పుట్టిన వెంటనే కన్నకొడుకుని, అదే రోజున కట్టుకున్న మొగుణ్నీ కోల్పోవడంతో.. ఆమెకు ఒక్కసారిగా లోకం చీకటైపోయింది. భర్త తిరిగి వస్తాడన్న ఆశతో ఆమె ప్రాణాలు నిలబెట్టుకుంది.
ఆమెపై అభిమానంతో పల్లెవాసులే ఆమెను పోషించసాగారు. కానీ, రోజులు గడిచేకొద్దీ పద్మిని వెర్రిదానిలా మారిపోయింది. ఆమె మంచిచీర ధరించి ఎరుగదు. ఎవరైనా ఇచ్చిన పండ్లు ఫలాలు తోచినప్పుడు తినడమే కానీ, స్వయంగా వండుకుని తిని ఎరుగదు.
నాలుగైదేళ్ల కాలం గడిచేసరికి ఆమెను పూర్తిగా నిరాశ ఆవరించింది. కోయగూడెం వదిలి, అరణ్యమార్గంలో తోచిన దిక్కుకు నడుస్తూ పోయింది. చాలా కష్టాలు పడుతూ, ఒంటరిగా అలా ఎంతకాలం నడిచిందో కానీ, చివరికి ఒక పట్టణం చేరుకుంది.
అక్కడో వీధిలో రత్నాంగి అనే భోగకాంత.. తన ఇంటిముందు నిలబడి నీళ్లు తెచ్చే పనికత్తె కోసం ఎదురు చూస్తున్నది.
పద్మిని పిచ్చివాటాన్ని కనిపెట్టి, దగ్గరికి పిలిచింది. మలినమైన దుస్తులలో కూడా స్పష్టంగా ఉట్టిపడుతున్న ఆమె తేజస్సును చూసి అచ్చెరువొందుతూ.. “అమ్మీ! ఎవరు నువ్వు?! నాకో ఉపకారం చేసి పెడతావా? తప్పుగా అనుకోకు సుమా! ఈ కడవతో ఆ చెరువునుంచి నీళ్లు తెచ్చిపెట్టగలవా?” అన్నది.
పద్మిని మారుమాట్లాడకుండా కడవ పుచ్చుకుని చెరువుకు వెళ్లింది. శుభ్రంగా స్నానం చేసి నీళ్లు తెచ్చింది. ఆ లోపుగా రత్నాంగి కొన్ని బిందెలు ఖాళీ చేసి ఉంచింది. వరుసగా పది కడవల నీళ్లు తెచ్చి పోసింది పద్మిని.
ఆమెకు కొంత ఆహారం తెచ్చిపెట్టింది రత్నాంగి.
“అమ్మీ! నువ్వు నా దగ్గర ఉండిపో. నీకు నీచపు పనులు చెప్పను. రోజూ నీళ్లు తెచ్చిపెడితే చాలు. అన్నం పెడతాను. చీరలిస్తాను” అన్నది.
పద్మిని మౌనంగా తలాడించింది. ఆనాటినుంచి ఆ ఇంటిలోనే ఉండిపోయింది. ఆ తరువాత ఏడెనిమిది సంవత్సరాలు కాలగతిలో కలిసిపోయాయి.
* * *
పద్మిని, గురుదత్తుడు నివసించిన కోయపల్లెకు నాలుగు క్రోసుల దూరంలో మరో కొండపల్లె ఉంది. ఆ పల్లెలో కోయలు, చెంచులు, బోయలు నివసిస్తుండేవారు. వాళ్లు కూడా చాపలు, తట్టబుట్టలు అల్లుతుండేవారు. కానీ, తాము అల్లిన వాటికంటే పద్మిని, గురుదత్తులు అల్లిన వింత చాపలకు, తివాసీలకు అధిక ధరలు పలుకుతుండటంతో.. వాటిని తెచ్చుకుని ఎదురుగా పెట్టుకుని, ఆ విద్య తామూ నేర్చుకోవాలని వాళ్లెంతగానో ప్రయత్నించారు. కానీ, ఎందుకో వారికి ఆ విద్య అబ్బలేదు.
చివరికి ఆ పల్లెలోని చిరుతపులి అనే బాలునికి ఆ విద్య ఒంటపట్టింది. పదమూడేళ్ల వయసు వచ్చేసరికి.. పాతవాటికంటే ఇంకా అందమైన తివాసీలు అల్లడం మొదలుపెట్టాడు వాడు. వాటికి చుట్టుపక్కల గ్రామాల్లో అధిక ధరలు పలికేవి.
కాలక్రమంలో వాడు ఆ విద్యలో రాటు తేలాడు. ఒకసారి వాడు.. పిట్టరెక్కలతోనూ, మేకబొచ్చుతోనూ, మృదువైన ఆకులతోనూ అందమైన కొన్ని తివాసీలు అల్లాడు.
తండ్రి వద్దకు వెళ్లి.. “వీటిని పల్లెల్లో కాకుండా, పట్నానికి తీసుకుపోతే ఇంకా మంచి డబ్బొస్తుందయ్యా! ఈసారి మనవాళ్లతోపాటు నేను కూడా వెళ్తాను. నన్ను పంపించవూ” అని చెప్పి ఒప్పించాడు.
కొంతమంది స్నేహితులతో కలిసి, ఉదయార్కుడు అనే మహారాజు పాలిస్తున్న ఆర్యమపురం అనే నగరానికి వెళ్లాడు చిరుతపులి. ఏ వస్తువుకు ఎంత వెల చెప్పాలో తెలియక, తక్కువ ధరలే చెప్పడంతో తెచ్చిన వస్తువులన్నీ వెంటవెంటనే అమ్ముడుపోయాయి.
ఒక పెద్ద తివాసీ మాత్రం మిగిలింది. వింత తివాసీలు అమ్మకానికి వచ్చాయని తెలుసుకున్న రత్నాంగి, పరిచారికతో కబురు చేసింది.
చిరుతపులి ఆమె ఇంటికి వెళ్లాడు. రత్నాంగి నవ్వుతూ ఎదురొచ్చి, లోనికి తీసుకుపోయింది. తన ఇంటిలోని వింతలన్నీ చూపెట్టింది.
వాడు బిత్తరపోయి చూస్తుండగా బుగ్గలమీద వేళ్లు విరిచి.. “అబ్బో! గట్టి మనసువాడివే! లేకపోతే నా వేళ్లు చప్పుడు కాకుండా ఉంటాయా?” అన్నది కళ్లు గిరగిరా తిప్పి, కిలకిలా నవ్వుతూ.
చిరుతపులికి ఒళ్లు ఝల్లుమంది. పులకలు పుట్టాయి. అయోమయంగానే తివాసీ పరిచాడు.
“బాలుడా! దీని వెల ఎంత చెప్పావ్?!” అని అడిగింది బుగ్గపై వేలు రాస్తూ.
“అందరికీ నూరుమాడలు చెప్పాను. నీకైతే..” అంటూ నీళ్లు నమిలాడు వాడు.
“నేను అంతకంటే ఎక్కువిస్తాను. నీకేం కావాలంటే అదే ఇచ్చేస్తాను” అన్నది రత్నాంగి తన కులవృత్తిని ప్రదర్శిస్తూ.
ఆ చేష్టలతో ఆ అమాయక బాలుడికి మతిపోయింది. చివరికి.. ‘నాకు నువ్వే కావాలి’ అని వాడిచేత అనిపించుకుని.. “చీకటి పడగానే వచ్చెయ్. నీకోసం సిద్ధంగా ఉంటాను!” అన్నది రత్నాంగి.
తివాసీని అక్కడే వదిలేసి, మొలక మీసాలను దువ్వుకుంటూ వెళ్లిపోయాడు వాడు.
చిరుతపులి వెళ్లిన క్షణం నుంచి రత్నాంగికి జ్వరం వచ్చినట్లు అనిపించసాగింది. సాయంత్రం కావస్తుండగా.. ‘అయ్యయ్యో! ఆ పిల్లాణ్ని రాత్రికి రమ్మన్నాను. వాడి కోరిక తీర్చకపోతే, ఆ తివాసీ పట్టుకుపోయినా పోతాడు. ఏమిటి చేయడం!?’ అని దీర్ఘంగా ఆలోచించింది.
చివరికి ఒక నిశ్చయానికి వచ్చి పద్మిని వద్దకు వెళ్లింది.
“అమ్మీ! ఈవేళ ఒక కోయపిల్లవాడు చక్కటి తివాసీ ఒకటి అమ్మకానికి తెచ్చాడు. ఎంత గొప్పగా ఉందనుకున్నావు.. రా చూద్దాం” అని తీసుకుపోయింది.
ఆ తివాసీ చూడగానే పద్మినికి గతమంతా కండ్ల ముందు కదలాడింది.
‘ఇటువంటి తివాసీని నేను, గురుదత్తుడు తప్ప మరెవ్వరూ అల్లలేరు. ఈ పిల్లవాడు ఎవరై ఉంటాడు?’ అని ఆలోచించ సాగింది.
పద్మిని బుగ్గలు పుణుకుతూ.. “ఒసే అమ్మీ! దీన్ని అమ్మడానికి వచ్చిన పిల్లాడు రాత్రికి పడకకు వస్తానని చెప్పి పోయాడు. వాణ్ని సంతోషపెట్టకపోతే ఇంత చక్కని తివాసీ చెయ్యిజారి పోతుంది. ఇంతకాలం నుంచి నిన్ను సాకుతున్నా, ఇలాంటి పనులకు నిన్నెప్పుడూ నియోగించలేదు. ఈ ఒక్కసారికీ నీకు తప్పదు. అదుగో ఆ చీర కట్టుకో! ఆ నగలు పెట్టుకో! నీకు అట్టే కష్టం ఉండదు. ఉత్త చంటిపిల్లాడు వాడు. మాటలతో పొద్దుపుచ్చినా సరిపోతుంది” అన్నది బతిమాలుతూ.
మరో సందర్భంలో అయితే పద్మిని ఏమని సమాధానం చెప్పేదో కానీ, ఆ వచ్చిన పిల్లవాడు ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘సరే!’ అన్నది. కానీ, ఆమె చెప్పినట్లుగా చీర, నగలు మాత్రం ధరించలేదు.
మాసిన చీరతోనే గదిలో ఓ మూల కూర్చుని నిరీక్షించసాగింది. అనుకున్న సమయానికి చిరుతపులి రానేవచ్చాడు.
అతణ్ని చూడగానే పద్మినికి పాలు చేపునకు వచ్చాయి.
(వచ్చేవారం.. రత్నాంగి తెచ్చిన తగాదా)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం
Kasi Majili Kathalu | పరకాయ ప్రవేశం
Kasi Majili Kathalu | కామగ్రీవుని విద్యలు
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు