Kasi Majili Kathalu Episode 67 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : దుర్గానగరానికి అధిపతి అయిన సురూపుణ్ని పద్మిని వధించింది. భర్తతో కలిసి అడవుల్లోకి పారిపోయింది. తివాసీలు అల్లే పనిచేస్తూ.. వాళ్లిద్దరూ జీవించసాగారు. అక్కడ వారికో కొడుకు పుట్టాడు. అనుకోకుండా ఆ జంట విడిపోయింది. వారి కొడుకు చెంచుల వద్ద పెరిగి, అందమైన తివాసీలు అల్లే విద్య నేర్చుకున్నాడు. దానిని అమ్మడానికి వచ్చి.. రత్నాంగి అనే వేశ్య వలలో పడ్డాడు.
రత్నాంగికి బదులుగా గదిలో వేరొక స్త్రీ ఉండటంతో తత్తరపాటుకు గురయ్యాడు చిరుతపులి. అక్కణ్నుంచి వెళ్లిపోవాలో.. అక్కడే ఉండాలో తేల్చుకోలేక పోయాడు. పద్మిని నెమ్మదిగా అతణ్ని సమీపించింది.
“నాయనా! మీది ఏ ఊరు? మీ తల్లిదండ్రులెవరు? నీ కులమేమిటి?” అని ప్రశ్నించింది.
“మేము చెంచువాళ్లం. మాది కోయపల్లె. నాకు అమ్మ లేదు. అయ్య మాత్రమే ఉన్నాడు. ఈ చాపలు అల్లడం కోసం ఈ ఊరొచ్చాను. నా పేరు చిరుతపులి” అని చెప్పాడతను.
“ఈ తివాసీ ఎవరు అల్లారు?”.
“నేనే అల్లాను!”.
“ఈ పని నీకెవరు నేర్పారు?”.
“నేనే.. నా బుద్ధిబలం చేత నేర్చుకున్నాను”.
“కోయపల్లె అంటే ఎక్కడుంది?! కొండపల్లెకు ఎంత దూరం?”.
“నాలుగు కోసుల దూరం ఉంటుంది. నీకు మా ఊరు తెలుసా?”.
“ఓసారి వచ్చానులే! అది సరే కానీ, నీకు ‘చిరుతపులి’ అనే పేరు ఎలా వచ్చింది?” అడిగింది పద్మిని.
అందుకు వాడు కొద్దిసేపు ఆలోచించి.. “ఈ విషయం మా అయ్య ఎవరికీ చెప్పవద్దన్నాడు. కానీ, నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్పబుద్ధేయడం లేదు. నేను పుట్టిన వెంటనే నన్నొక చిరుతపులి నోట కరుచుకుని పరుగెడుతున్నదట. మా అయ్య దాన్ని చాలా వైనంగా వింటికోలతో చంపి, నన్ను రక్షించాడు. అందుకే నాకా పేరు పెట్టాడు” అని చెప్పాడు.
ఆ మాటలు వింటూనే.. “అయ్యో భగవంతుడా!”.. అంటూ పద్మిని గోలుగోలున ఏడవసాగింది.
అది చూసిన చిరుతపులి బేలగా మారిపోయాడు.
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?! నీకేం కష్టమొచ్చింది?” అని చంటిపిల్లవాడిలా అడిగాడు.
ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ.. “ఏమీ లేదు నాయనా! నువ్వు చిన్నవాడివి. ముక్కుపచ్చలారని వాడివి. చదువుకుని, వృద్ధిలోకి రావాల్సిన వాడివి. ఇటువంటి వేశ్యల ఇళ్లకు రావచ్చునా?! బాబూ! వేశ్యా సంగమం వల్ల కీర్తి, ఆయువు, ద్రవ్యం క్షీణించిపోతాయి. రోగాలు పెరుగుతాయి. బుద్ధిమంతులైన వారు దురలవాట్లకు దూరంగా ఉండాలి. చూడయ్యా! వీళ్లకు దయాసత్యాలు లేవు. నువ్వు మళ్లీ మరో తివాసీ తెస్తే నిన్ను గౌరవిస్తారు. లేదంటే బయటికి వెళ్లగొట్టిస్తారు. యవ్వనారంభంలోనే ఇలాంటి అలవాట్లకు లోనైతే, మాన్పించడం అసాధ్యం. ఇంకెప్పుడూ ఇలాంటి ఇళ్లకు పోబోకు!” అని బోధించింది.
చిరుతపులి ఆమె కాళ్లమీద పడ్డాడు.
“అమ్మా! ఇప్పటివరకు నాకు ఇలా చెప్పేవాళ్లు లేకపోయారు. తప్పులేదని మా స్నేహితులు చెబితే నిజమే కాబోలనుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి పనిచేయను. ఇంతకీ ఈ బోగముది నీకేమవుతుంది? నువ్వసలు
ఇక్కడెందుకున్నావు?!” అని ప్రశ్నించాడు.
అందుకు పద్మిని నిర్వేదంగా నవ్వి.. “ఇది నాకేమీ చుట్టం కాదు. నేనొక పాపాత్మురాలిని. నా వృత్తాంతంతో నీకు పనిలేదు. కానీ, నీకు సంబంధించిన ఒక రహస్యం చెబుతాను విను. నువ్వు ఉత్తమ కులంలో పుట్టినవాడివి. నీ కన్నతల్లి చచ్చిపోయింది. నీకొక ఉత్తరం రాసిస్తాను. తూర్పు దేశంలో రామదుర్గమనే నగరానికి వెళ్లు. అక్కడ కుముదాంగదుడనే వైశ్యుడికి గానీ, ఆయన భార్యకు గానీ ఈ ఉత్తరం చూపించు. వారు నిన్ను సొంత మనవడిలా పోషిస్తారు. వారి ఆస్తినంతా నీకే ఇస్తారు. దానితో నువ్వు సుఖపడగలవు. ఇకనుంచి నువ్వు నీ పేరు ‘చిరుతపులి’ అని చెప్పుకోకు. ‘మృగదత్తుడు’ అని చెప్పు.. ఏం!” అని అడిగింది.
“నువ్వెలా చెబితే అలాగే నడుచుకుంటానమ్మా!” అన్నాడు వాడు చేతులు జోడించి.
పద్మిని కలం, కాగితం అందుకుని.. కుముదాంగదుని పేర ఉత్తరం రాసింది. దాన్ని మృగదత్తుని చేతిలో పెట్టి, శిరసు మూర్కొని ముద్దు పెట్టుకుంది. తెల్లవారే వరకు అనేక నీతివచనాలు చెప్పింది. చీకటి ఉండగానే అవతలికి పంపేసింది. అతడు వీధిమలుపు తిరిగే దాకా చూసి, తాను కూడా అప్పటికప్పుడే రత్నాంగి ఇల్లు విడిచి అరణ్యమార్గం పట్టింది.
* * *
మృగదత్తుడు ఊరిబయట గుడిసెలలో ఉన్న తనవారిని కలిశాడు.
“ఏరా చిరుతపులీ! రాత్రంతా ఎక్కడికి పోయావ్? మన తివాసీలు రాజుగారికి చాలా నచ్చాయట. పెద్ద తివాసీ తానే కొంటానని కబురు చేశారు. ఆ తివాసీని ఏం చేశావ్.. అమ్మేశావా?” అని అడిగారు వారు.
మృగదత్తుడు వారికేదో సమాధానం చెప్పేలోగానే కొందరు రాజభటులు వచ్చారు.
“ఆ తివాసీల పిల్లాడు వచ్చాడా?” అని అడిగారు.
“నేనే!” అంటూ ముందుకు రావడంతో.. మృగదత్తుణ్ని కోటకు తీసుకుపోయారు.
అప్పటికే అక్కడ రత్నాంగి ఉంది. మృగదత్తుణ్ని చూస్తూనే దుమ్మెత్తి పోయసాగింది. ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత మహారాజు ఉదయార్కుడు కొలువు తీర్చాడు. మృగదత్తుని తేరిపార చూసి నివ్వెరపోయాడు. ఇంద్రనీలంలా మెరిసిపోయే దేహకాంతితో.. విశాలమైన కన్నులు, ఛాతి, దీర్ఘబాహువులతో ఠీవి ఉట్టిపడుతున్న మృగదత్తుడు.. ఆటవికుడంటే నమ్మలేకపోయాడు.
“ఓరీ! నీ పేరేమి?” అని ప్రశ్నించాడు.
“మృగదత్తుడంటారు సామీ” అని సమాధానం ఇచ్చాడు వాడు.
“అబద్ధం మహారాజా! వీడిపేరు చిరుతపులి. నిన్న రాత్రి నా కూతురిని భోగినిగా అభిలషించి వచ్చాడు. రాత్రంతా మా ఇంట్లోనే ఉండి, తెల్లవారక మునుపే పదివేల రూపాయల నగలతోనూ, పట్టుచీరతోనూ దాన్ని లేవదీసుకుపోయాడు” అని ఆరోపించింది రత్నాంగి.
“ఓరీ! నీకు రెండు పేర్లున్నాయా?! నిన్న రాత్రి ఈమె కూతురిని చూశావా?!” అడిగాడు రాజు.
“నిన్నటివరకు నాపేరు చిరుతపులే సామీ! నిన్న వీళ్లింటికి వెళ్లిన మాట నిజం. కానీ, ఈమె కూతురెవరో నాకు తెలియదు. నిన్న మాసిన చీరతో ఒక దేవత నాకు సాక్షాత్కరించింది. ఆమె ఒంటిమీద నగలు లేవు. ఈమెకు చుట్టాన్ని కాదని ఆమె నాతో చెప్పింది” అని చెప్పాడు మృగదత్తుడు.
“ఓసీ! వాడి మాటలు విన్నావా?! ఆ చిన్నది
నీ కూతురేనా.. సత్యం చెప్పు!?”.
“కడుపున పుట్టింది కాదు. పెంచుకున్నాను”.
“ఎంత వయసునుంచి పెంచావ్?”.
“పదేళ్లకు పైనుంచే మహారాజా!”.
“ఇదివరకెప్పుడైనా ఈ పనికి ఆమెను నియోగించావా?”.
“లేదు. ఇన్నాళ్లూ ఆ అవసరం లేకపోయింది. నిన్న నాకు కాస్త ఒంట్లో నలతగా ఉండటం వల్ల ఆమెను బతిమాలి ఒప్పించాను”.
“అయితే ఆమె అటువంటిది కాకపోయినా పంపావన్నమాట. సరే.. నిన్నరాత్రి దానికి నగలు అలంకరించి పంపావా?!”.
“అయ్యో! పదివేల విలువ చేసే నగలు మహారాజా! పెట్టుకోమని చెప్పాను”.
“అంటే.. ఆమె పెట్టుకుందో లేదో చూడలేదన్నమాట. చూడు.. నీ మాటలు పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి. నీకు వేయి నిష్కములు శిక్ష విధించాను. ఇవ్వకపోతే రెండేళ్లు కారాగారంలో ఉండాలి. అంతేకాదు.. ఆ పిల్లాడి తివాసీ తీసుకొచ్చి వాడికిచ్చేయాలి” అని తీర్పు చెప్పాడు ఉదయార్కుడు.
రత్నాంగి గొల్లుమన్నది. రాజభటులు దానిని తోసుకుంటూ ఇంటికి నడిపించి.. జరిమానా సొమ్ముతోపాటు తివాసీని స్వాధీన పరుచుకున్నారు.
వాళ్లు వెళ్లిన తరువాత.. “ఈ రాజు తివాసీ మీద మోజు కొద్దీ నాకు అన్యాయం చేశాడు. అయినా ఈ భూమినంతా వీడొక్కడే పాలిస్తున్నాడా?! వీడు కాకపోతే పై అధికారులు లేరా?!” అని ముక్కుచీదుకుంటూ.. అప్పటికప్పుడు ఉదయార్కునిపై అధికారం కలిగిన గజేంద్రవాహనుడి వద్దకు పోయింది.
గజేంద్రవాహనుడు చక్రవర్తి. ఆయన అధికారం కింద యాభయ్యారు మంది సామంతరాజులు ఉన్నారు. రాజ్యంలో వచ్చే అన్ని వ్యాజ్యాలనూ స్వయంగా విచారించి, శిక్షలు విధించడం సాధ్యం కాదు. పైగా ఈ అభియోగం ఉదయార్కుడు పాలిస్తున్న ప్రాంతంలో వచ్చింది. కనుక అక్కడికి సమీపంలోని మరో సామంతరాజైన సుమేధునికి బాధ్యతలు అప్పగించాడు గజేంద్రవాహనుడు. దాంతో అక్కణ్నుంచి మళ్లీ సుమేధుడు పాలించే విద్యానగరానికి ప్రయాణమై వెళ్లింది రత్నాంగి. అక్కడ తనకు తెలిసిన పుష్పవేణి అనే మరో వారకాంత ఇంట్లో బస చేసింది.
రత్నాంగి మధ్యవయసులో ఉన్నదే అయినా.. అలంకారం చేసుకుంటే కుర్రపిల్లలా కనిపిస్తుంది. ఆటపాటల్లో నైపుణ్యం లేకపోయినా విటుల విత్తాలను అపహరించే విద్యలో అందెవేసినచేయి. తన విద్యను చూపెట్టి, సుమేధుణ్ని లొంగదీసుకోవచ్చేమో అని ఆలోచించింది.
“..కానీ సుమేధుడు తెలివిగలవాడు. ధర్మపరుడు. పరస్త్రీలను కన్నెత్తి చూడడు. బుద్ధికి బృహస్పతి అని తెలియడం వల్లనే చాలా తగాదాల్లో.. ఆయన ఇచ్చిన తీర్పులను గజేంద్రవాహనుడు యథాతథంగా ఆమోదిస్తాడు. ఎంత జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడు. నువ్వు అడ్డదారి తొక్కకుండానే నీకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది” అని చెప్పింది పుష్పవేణి.
“సరే అయితే! నేను నా పరిచారికను సాక్ష్యం తెచ్చుకున్నాను. రెండో సాక్షిగా నువ్వు రావాలి” అని బతిమాలింది రత్నాంగి.
రెండురోజులకు రత్నాంగి తెచ్చిన తగాదా విచారణకు వచ్చింది.
“ఉదయార్కుడు నీ అపరాధాలను నిరూపించి శిక్ష విధించాడు కదా! నువ్వు ఆ తప్పు చేయలేదని ఎలా చెప్పగలవు?” అని ప్రశ్నించాడు సుమేధుడు.
“దేవా! నేను వారకాంతను. నామీద వారికి కొంచెం కోపం ఉంది. ఓసారి నాకు వర్తమానం పంపిస్తే వెళ్లలేకపోయాను. మీరు ఎరగని ధర్మాలు ఏముంటాయి?! వస్తులోభం వల్లనే నేను కొన్న తివాసీని అన్యాయంగా తీసుకున్నారు. నేను నా కులవృత్తి ప్రకారం చేశాను. అది తప్పని శిక్షిస్తే ఏం చేయగలను?” అంటూ కన్నీరు కార్చసాగింది రత్నాంగి.
“నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్పాలి. అధిక ప్రసంగం చేయకూడదు. నీ కులవృత్తి తప్పని అతను అనలేదు. కానీ, నువ్వు యోగ్యురాలైన స్త్రీని ఇష్టం లేకపోయినా వ్యభిచారంలోకి దింపావట. గుణవంతుడైన బాలుడిపై అసత్య అభియోగం మోపావట” అని గద్దించాడు సుమేధుడు.
“దేవా! దాన్ని కూతురిలా పెంచాను. అయినా మేం ఇతర జాతులనుంచి బాలికలను తెచ్చి పెంచుకోవడం వాడుకలో ఉన్నదే కదా! అలాగే నేనూ ఒక కూతురిని పెంచుకుంటున్నాను. దానికి ఆ కుర్రవాడు తివాసీని
ఎరవేసి దాన్ని మా ఇల్లు దాటించాడు. అది సత్యమైన అభియోగమే!” అని మొరపెట్టుకుంది రత్నాంగి.
సుమేధుడు న్యాయవాదులతో ఆ అభియోగాన్ని గురించి కొంచెంసేపు చర్చించాడు.
“ఆ తివాసీతో పాటు, ఆ కోయపిల్లవాణ్ని కూడా పంపమని ఉదయార్కుడికి రాశాం కదా.. పంపారా?!” అని ప్రశ్నించాడు.
“ఆ పిల్లవాడు కొండలలోకి పోవడం చేత పిలిపించడం ఆలస్యమవుతున్నదని చెప్పారు దేవా! తివాసీని మాత్రం పంపారు” అని ఉద్యోగులు దాన్ని రాజు ముందు పరిచారు.
ఆ అల్లిక, ఆ రంగులు, ఆ మెరుగు, ఆ తళుకు చూసి సుమేధుడు వెరగుపడ్డాడు. ఆ తివాసీని చేతితో స్పృశించి, మళ్లీమళ్లీ చూస్తూ ఏదో ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఆయన కన్నులు చిప్పిల్లాయి. చాలాసేపటి తరువాత తేరుకుని రత్నాంగి వైపు తిరిగి.. “ఆ పిల్లవాడు ఈ రత్నాసనాన్ని తానే అల్లానని నీతో చెప్పాడా? ఈ పని తనకెవరు నేర్పారో చెప్పాడా?” అని ప్రశ్నించాడు.
“తానే అల్లానని చెప్పాడు దేవా! తనకెవరు నేర్పారో మాత్రం చెప్పలేదు. ఉదయార్కునితో చెప్పాడేమో తెలియదు” అని జవాబిచ్చింది రత్నాంగి.
సుమేధుడు ఆదుర్దాగా ఉదయార్కుని వద్దనుంచి వచ్చిన విచారణ పత్రాలన్నీ తిరగవేసి చూశాడు. వాటిలో మృగదత్తుడు తానా విద్యను స్వయంకృషితో నేర్చుకున్నానని చెప్పినట్లు ఉంది. దానిని చూసి సుమేధుడు నిట్టూర్పు విడిచి, తల పంకించి.. “ఆ పిల్లవాణ్ని వీలైనంత వేగంగా నా ముందు ప్రవేశపెట్టండి” అని ఆజ్ఞాపించి, కొలువు చాలించాడు.
(వచ్చేవారం.. తారుమారైన బందీలు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | విడిపోయిన జంట
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం
Kasi Majili Kathalu | పరకాయ ప్రవేశం