చండీగఢ్: మొబైల్ ఫోన్ చోరీ ఆరోపణలపై గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు దళిత వ్యక్తులను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. (Men Stripped, Paraded) పంజాబ్లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝోరార్ గ్రామానికి చెందిన ఇద్దరు దళిత యువకులు వలస కూలీ నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేసినట్లు ఆ గ్రామంలోని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి వారిని లాక్కెళ్లారు. తాళ్లతో వారిని కట్టేసి కొట్టారు. అంతటితో ఆగక ఆ యువకుల దుస్తులు విప్పించి వారిని అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో గ్రామస్తుల చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు స్పందించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ కూడా దీనిపై స్పందించింది. జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరింది.