Bhari | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలిసారిగా తన తండ్రి నాగబాబుతో కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించారు. నాగబాబు నటుడిగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ సహా మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలతో కలిసి నటించారు. అయితే ఆశ్చర్యకరంగా తన కుమారుడు వరుణ్ తేజ్తో మాత్రం ఇప్పటివరకు పూర్తి స్థాయి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
గతంలో ‘హ్యాండ్స్ అప్’ సినిమాలో వరుణ్ తేజ్ చిన్ననాటి పాత్రలో కనిపించినప్పటికీ, తండ్రీకొడుకుల మధ్య ఒక్క కాంబినేషన్ సీన్ కూడా లేదు.ఇప్పుడు ఆ లోటును ‘బరి’ సినిమా భర్తీ చేయనుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, నాగబాబు కలిసి నటించడమే కాకుండా, ఇద్దరి మధ్య కీలకమైన కాంబినేషన్ సీన్లు కూడా ఉంటాయని వరుణ్ వెల్లడించారు. తండ్రితో కలిసి నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ‘బరి’ చిత్రాన్ని నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల కాలికి గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న వరుణ్ తేజ్, పూర్తిగా కోలుకున్న తర్వాత ‘బరి’ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. తొలిసారి రియల్ లైఫ్ తండ్రీకొడుకులు వెండితెరపై కలిసి కనిపించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్పై మెగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘కొరియన్ కనకరాజు’ తర్వాత వరుణ్ తేజ్ కెరీర్లో ‘బరి’ మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.