Piyush Goyal : సుదీర్ఘకాలంగా చర్చల దశలో ఉన్న భారత్-అమెరికా (India-US) ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుంది. వచ్చే జూలైలో ఈ ఒప్పందానికి సంబంధించిన మొదటి విడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి (Union Minister) పీయూష్ గోయల్ (Piyush Goel) ప్రకటించారు. ఇటీవలి కాలంలో పన్నుల విషయంలో ఇరుదేశాల మధ్య స్వల్ప వివాదం తలెత్తినప్పటికీ చర్చలు మాత్రం వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుంటూ.. పరస్పర మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే ఈ ద్వైపాక్షిక ఒప్పందం ముఖ్య ఉద్దేశమని గోయల్ అభిప్రాయపడ్డారు.
దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరనుంది. గత కొన్ని వారాలుగా ఇరుదేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు ఊపందుకున్నాయని, అందరూ ఊహించిన దానికంటే ముందే ఒక మంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ధీమా వ్యక్తంచేశారు. అంతకుముందు జూన్ 5న ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన పూర్తిస్థాయి బృందం పాల్గొందని గోయల్ గుర్తుచేశారు. ఆ భేటీలోనే ఒప్పందానికి అడ్డంకిగా ఉన్న చాలా అంశాలపై ఒక స్పష్టత వచ్చిందన్నారు. జూలై మధ్య నాటికి ఇరుదేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా మొదటి విడత ఒప్పందాన్ని అమలుచేసే స్థితికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల మధ్య ఒక ప్రాథమిక అవగాహన కుదిరింది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన కొన్ని పన్నుల నిర్ణయాలపై చట్టపరమైన సవాళ్లు ఎదురుకావడంతో చర్చలు కాస్త నెమ్మదించాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన అధికారుల భేటీ తర్వాతే మళ్లీ ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రస్తుతం చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 12.5 శాతం పన్ను విధించాలని అమెరికా గత వారమే ఓ ప్రతిపాదన తెచ్చింది. నిర్బంధ శ్రమ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో భారత్ తగిన చర్యలు తీసుకోలేదనే నెపంతో ఈ ప్రతిపాదన చేశారు.
అయినప్పటికీ వాణిజ్య బంధాన్ని దెబ్బతీసుకోవద్దనే ఉద్దేశంతో ఇరుదేశాలు చర్చలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. అమెరికా ప్రస్తుతం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలను సురక్షితం చేసుకోవడానికి దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం భారత్కు ఎంతో కీలకం కానుంది. మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన టైమ్లైన్ ప్రకారం అన్నీ సజావుగా సాగితే జూలై మధ్యకల్లా ఇరుదేశాల మధ్య సరికొత్త ఆర్థిక అధ్యాయం మొదలవుతుంది.