Kasi Majili Kathalu Episode 69 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రాజహత్య చేసిన పద్మిని, గురుదత్తుడు అడవుల్లోకి పారిపోయారు. అనుకోని రీతిలో విడిపోయారు. వారి కుమారుడు వారిలాగే తివాసీలు అల్లే పని నేర్చుకుని, ఆ కళ ద్వారానే తల్లిని కలుసుకున్నాడు. ఆమె చెప్పిన రీతిగా దుర్గానగరానికి వెళ్లి, తండ్రి స్నేహితుడైన గదాధరుని సాయంతో మాతామహుడు, పితామహుణ్ని కలిశాడు. అంతలోనే అతణ్ని సైనికులు బంధించి.. ‘రత్నాంగి తెచ్చిన తగాదా’పై విచారణ కోసం సుమేధుని ముందు హాజరుపరిచారు.
“బాలుడా! నీ పేరేమిటి? తల్లిదండ్రులెవరు?” అని ప్రశ్నించాడు సుమేధుడు.
“రాజా! నా పేరు మృగదత్తుడు. నా తండ్రిపేరు గురుదత్తుడు. తల్లిపేరు పద్మిని” అని సమాధానం ఇచ్చాడు అతడు.
“ఈ తివాసీలు నువ్వు అల్లినవేనా?! నువ్వీ పనిని మీ తల్లి దగ్గర నేర్చుకున్నావా?” అడిగాడు సుమేధుడు.
“నాకు మా తల్లిదండ్రుల పేర్లు తెలుసు కానీ, వారిని ఎరుగను. నా తల్లిని ఒకమారు కలుసుకున్నాను కానీ, అప్పటికామె నా తల్లి అని తెలియదు. ఇక నా తండ్రిని ఇంతవరకూ కలుసుకోలేదు. ఈ తివాసీలు అల్లే విద్యను నేనే సొంతంగా నేర్చుకున్నాను” చెప్పాడు మృగదత్తుడు.
“నీ తల్లిని ఎక్కడ కలుసుకున్నావు?!” అని మరో ప్రశ్న వేశాడు సుమేధుడు.
“రత్నాంగి అనే వేశ్య ఇంటిలో” అని ప్రత్యుత్తరం ఇచ్చాడు మృగదత్తుడు.
“అయితే.. నీ తల్లి వేశ్యావృత్తిని చేపట్టిందా?!” పైప్రశ్న వేశాడు సుమేధుడు.
“ఛీ ఛీ! అలా కాదు రాజా! రత్నాంగి అనే వేశ్య ఇంటిలో దాసీవృత్తిలో ఉండేది. వేశ్యాసంగమం చాలా చెడ్డదని నాకు ఎన్నో నీతులు చెప్పింది. నా పుట్టుకను గురించిన రహస్యం చెప్పింది. బహుశా నన్ను రక్షించడం కోసమే ఆమె అక్కడ ఉండి ఉంటుంది. ఆ తరువాత అక్కణ్నుంచి ఎటో వెళ్లిపోయింది” అని వివరించి చెప్పాడు మృగదత్తుడు.
“సరే.. దుర్గానగరం నుంచి వేరొకడు వచ్చి, తానే మృగదత్తుడనని చెప్పుకొంటున్నాడు. రత్నాంగి నీపై దొంగతనం, కన్యాపహరణ నేరాలను మోపింది.
రేపు వారు నలుగురినీ పిలిచి, నీ ఎదుటనే విచారిస్తాను. విచారణ ముగిసి, అసలు నిజాలేమిటో తేలేవరకు నువ్వు నగరం విడిచి వెళ్లకూడదు” అని ఆజ్ఞాపించి, కొలువు చాలించాడు సుమేధుడు.
మృగదత్తుడు అక్కణ్నుంచి బయటపడి, గురుదత్తుణ్ని కలుసుకున్నాడు. జరిగిందంతా వివరించాడు.
అప్పుడు గురుదత్తుడు.. “ఈ కష్టం నుంచి బయటపడటానికి వేరొక ఉపాయం ఆలోచిద్దాం! రేపు నేను సుమేధుణ్ని వ్యక్తిగతంగా కలుసుకుంటాను” అని చెప్పాడు.
* * *
ఆ రాత్రికి అంతఃపురంలో, సుమేధునికి పాపం.. సరిగా నిద్రపట్టలేదు. తెల్లవారుతూనే ప్రశాంతత కోసం గుర్రమెక్కి కొంతదూరం పోయి రావాలని బయల్దేరాడు.
ఆ పట్టణానికి ప్రతిరోజూ చుట్టుపక్కల పల్లెల నుంచి పాలు, పెరుగు, నెయ్యి, కాయగూరలు వంటివి అమ్మకానికి వస్తుంటాయి. మోయలేని బరువు మోసుకుంటూ వచ్చిన జానపదులు.. బుట్టలు, తట్టలు ఎత్తేవారి కోసం ఎదురు చూస్తుండటం ఆ వీధులలో తరచుగా కనిపించే సుందర దృశ్యాలే.
దైవికంగా సుమేధుని దృష్టి ఆ జానపదులపై పడింది. వారి వ్యవహారశైలిని వినోదంగా గమనిస్తూ గుర్రాన్ని మెల్లగా నడిపిస్తున్నాడతను.
ఒక సేవకుడు ముందుగా వేరొక గుర్రంపై వెళ్తూ.. “తొలగండి.. తొలగండి.. రాజుగారు వస్తున్నారు” అని అందరినీ హెచ్చరిస్తున్నాడు.
పాపం ఆ జానపదులు జడిసి కొందరేమో నెత్తిమీది దుత్తలను దిగవిడుస్తున్నారు. మరికొందరు తొందరగా పక్కకు తప్పుకోబోయి జారిపడుతున్నారు. ఇంకొందరు తత్తరిల్లి వెనక్కి పరుగెడుతున్నారు.
వారి ఇక్కట్లను చూసి.. సుమేధుడు ఆ సేవకుణ్ని మందలించాడు. తన వెనుకగా రమ్మని ఆజ్ఞాపించి, ఎదురుగా వచ్చేవారికి అడ్డం కాకుండా గుర్రాన్ని నడిపించసాగాడు.
ఇంతలో ఒక గొల్లభామ ఆ మార్గంలో సుమేధునికి అభిముఖంగా నడుచుకుంటూ వస్తున్నది. నెత్తిమీద ఉన్న చల్లకుండ బరువెక్కడంతో భరించలేక.. దారిపక్కగా కొంచెం ఎత్తుగా ఉన్న తూముగోడపై చుట్టకుదురుతోపాటే దింపుకొన్నది. చెమట తుడుచుకుని, కొంత సేదదీరి.. పొద్దువంక చూసుకుని వేగిరపాటుతో మళ్లీ కుండను ఎత్తుకోబోయింది. కానీ, ఆమెకు సాధ్యం కాలేదు. ఎవరైనా సాయం చేస్తారేమోనని అటూ ఇటూ చూడసాగింది.
సుమేధుడు తన వెనుకనున్న సేవకుణ్ని పిలిచి.. “ఓరీ! ఆ గోపిక పాపం సాయం కోసం చూస్తున్నది. నువ్వు వెళ్లు” అని ఆజ్ఞాపించాడు.
“హసాదు సామీ!” అంటూ ఆమెను సమీపించాడు వాడు.
“అమ్మా! రాజుగారి సెలవైంది. కుండ ఎత్తుతాను పట్టు” అన్నాడు.
అప్పుడు ఆ ఇల్లాలు కొంచెం శంకిస్తూ.. రాజు వంక ఓరచూపులు చూసింది. ఆ వీక్షణలోని తీక్షణతకు సుమేధుడు అబ్బురపడ్డాడు.
వేరొక మార్గం లేకపోవడం వల్ల పరపురుషుని సాయం తీసుకోవడానికి ఆమె సిద్ధపడింది. కట్టు వస్ర్తాలను సవరించుకుంటూ.. రెండు చేతులతో కుండ నెత్తిన పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో
కడవ ఒరిగి సగం మజ్జిగ నేలపాలైంది.
సుమేధుడు అందుకు పరితపిస్తూ ఆమె దగ్గరికి వచ్చి.. “సాధ్వీ! వీడు తిన్నగా ఎత్తకపోవడం వల్ల నీ చల్ల నేలపాలైంది. బాధపడకు! పాపం.. ఎంతో దూరం నుంచి తెచ్చినట్లున్నావు. దీని వెల ఎంతో చెప్పు” అని పలికాడు.
ఆ చివరి మాటలు పలుకుతుండగా వారి చూపులు కలుసుకున్నాయి. ఒకరినొకరు గుర్తుపట్టారు.
“హా! పద్మినీ” అంటూ సుమేధుడు గుర్రంమీదనుంచి దిగి.. నాలుగడుగులు ముందుకు వేయబోయి మూర్ఛవచ్చి, నేలకు ఒరిగిపోయాడు.
అతడి వెంటనున్న సేవకుడు తత్తరపడ్డాడు.
పద్మిని తన కుండలోని మజ్జిగనే సుమేధుని ముఖంపై చల్లి, మూర్ఛ తేర్చింది.
“పద్మినీ! దైవమహిమ వర్ణనాతీతం. కాకపోతే రోజూ ఈ దారినే వెళ్లేవాణ్ని. కానీ, ఎన్నడూ ఎవరినీ పరీక్షగా చూడనే లేదు. ఈరోజు నాకిలాంటి బుద్ధి పుట్టడం బొత్తిగా దైవ నిర్ణయమే!” అన్నాడు సుమేధుడు.
పద్మిని అతని పాదాలకు నమస్కరించింది.
“స్వామీ! మీరే వేరొక పేరుతో ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారని నేను కలలోనైనా తెలుసుకోగలనా?! మీకు దూరమై ఎన్నో కష్టాల పాలయ్యాను. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని.. ఇక్కడికి దగ్గరలోని అడవిలో ప్రవేశించాను. చితి పేర్చుకుని, అందులో దూకబోతే.. వర్షం వచ్చి మంటలు చల్లారిపోయాయి. దాంతో చేసేదిలేక.. ఒక యాదవుని ఇంటిలో దాసీ పనికి కుదురుకున్నాను. దైవం ఈనాడు మనల్నిలా కలపడం కోసమే.. ఆనాడు నా ఆత్మహత్యా ప్రయత్నాన్ని భగ్నం చేసి ఉంటాడు” అన్నది కన్నీరు తుడుచుకుంటూ.
గురుదత్తుడు ముందుగా కోటకు చేరుకున్నాడు. ఆ తరువాత పద్మినిని ప్రచ్ఛన్నంగా రప్పించుకున్నాడు.
* * *
ఆ తరువాత కొద్దిసేపటికే గదాధరుడు కోటకు వెళ్లాడు. తనను పరిచయం చేసుకుంటూ కొన్ని.. సుమేధుని పొగుడుతూ మరికొన్ని పద్యాలు రాసి, ద్వారపాలకుల చేత పంపించాడు.
సుమేధుడు ఆ పద్యాలను చదువుకుని, గదాధరుణ్ని లోపలికి ఆహ్వానించాడు. ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయిన తరువాత కానీ, తన ఎదుట ఉన్న సుమేధుడే గురుదత్తుడని గుర్తించలేకపోయాడు గదాధరుడు.
ఆనందం పట్టలేక అతణ్ని కౌగిలించుకుని.. “మిత్రమా! ఇంతకాలం నుంచి ఇక్కడే ఉన్నావా?! ఇంత అధికారంలో ఉండికూడా మమ్మల్ని చూడకుండా ఎందుకు ఉపేక్షించావు? నీ భార్య పద్మిని దేశాలపై తిరుగుతున్నది. నేను నీ కుమారుణ్ని కలుసుకున్నాను.
మృగదత్తుడు నీ కుమారుడే!” అని చెప్పాడు.
అందుకు సుమేధుడు.. “నేను ముందే అతణ్ని గుర్తుపట్టాను. ఈ అభియోగంలో ఇన్ని మెలికలు రావడానికి కారణం నీ బుద్ధిబలమే కారణమని గుర్తించాను. కానీ, మంచికాలం కోసం ఎదురు చూస్తున్నాను. ఈవేళ పొద్దున్నే పద్మినిని కలుసుకున్నాను” అని చెప్పాడు.
ఇంతలో సముచితమైన అలంకారాలతో పద్మిని వచ్చి గదాధరునికి నమస్కరించి, దూరంగా ఆసీనురాలైంది.
“మిత్రమా! నువ్వు సుమేధుడనే మారుపేరును ఎందుకు పెట్టుకున్నావు?! ఇంతకాలమూ మమ్మల్ని కలుసుకోవాలని ఏ ప్రయత్నమూ ఎందుకు చేయలేదు” అని ప్రశ్నించాడు గదాధరుడు.
అప్పుడు గురుదత్తుడు ఇలా సమాధానం ఇచ్చాడు.
“ఒకానొక ప్రమాదంలో నేను పూర్వస్మృతిని పోగొట్టుకున్నాను. అదెలా జరిగిందో చెబుతాను విను. పద్మిని గర్భిణిగా ఉండగా ఒకనాడు కోయలతో కలిసి.. ఒక విచిత్ర తివాసీని అల్లడానికి, పిట్ట ఈకలకోసం అడవికి పోయాను. అక్కడ నన్నో పాము కరవడంతో స్పృహ కోల్పోయాను. ఆ సమయంలో ఒక అడవి ఏనుగు అక్కడికి వచ్చింది. అది తన తొండంలోని నీటితో నన్ను నిలువెల్లా తడిపింది. దాంతో నాలో పాము విషం దిగిపోయి, తెలివి వచ్చింది. కానీ, వెంటనే కదలలేక పోయాను. ఇంతలో ఆ ఏనుగు తన తొండం చేత నన్ను తడిమి తడిమి చుట్టివేసి తన వెనక్కి విసిరింది. ఆ విసురుకు నేను దాని వీపుమీద పడ్డాను.
రెండుకాళ్లూ బిగబట్టి మెల్లిగా కుంభస్థలం పట్టుకున్నాను.
అటుపైన ఆ మతంగం అడవిలో దారుణ విహారం చేయసాగింది. పర్వత శిఖరాలను ఎక్కుతూ, పల్లాలకు దిగుతూ.. కొమ్మలను విరిచేస్తూ కొండలోయల్లోకి పోయింది. ఏం జరిగినా నేను మాత్రం దాని కంఠం విడిచిపెట్టకుండా ఒంటిప్రాణంతో ఉన్నాను.
గజేంద్రవాహన చక్రవర్తికి ఏనుగుల వేటంటే మక్కువ ఎక్కువ. ఆయన ఆ సమయంలోనే ఆ అడవికి వచ్చి, వేటకోసం గోతులు తవ్వి ఉంచాడు. ఒక చెట్టుమీద ఏనుగుల రాకకోసం ఎదురు చూస్తున్నాడు.
నన్ను వీపున మోస్తున్న ఏనుగు ఎలాగో అతణ్ని చూసింది. కోపావేశంతో అతనెక్కి కూర్చున్న చెట్లకొమ్మలను విరిచి మోడు చేసింది. అప్పుడు గజేంద్రవాహనుడు తన చేతిలోని కఠారిని దాని తొండంపై విసిరాడు. అదికాస్తా గురి తప్పి దాని దంతానికి పక్కగా గుచ్చుకుంది.
నేను ఆ కత్తిని లాగి చేతిలో పట్టుకున్నాను. అంతలో మళ్లీ రెచ్చిపోయిన ఏనుగు.. గజేంద్రవాహనుణ్ని తొండంతో పైకెత్తి విసిరేయబోయింది. అప్పుడు నేను నా చేతిలో ఉన్న కత్తితో దాని తొండాన్ని నరికేశాను. నేనలా చేయకపోతే ఆ రాజు పిండిపిండి అయిపోయేవాడు. నేను వేసిన కత్తిదెబ్బతో తొండంతోపాటు రాజు కూడా నేలమీద పడి వివశుడయ్యాడు. అంతలో రాజభటులు వచ్చి ఈటెలతో పొడిచి, ఆ ఏనుగును చంపేశారు.
రాజును సేదదీర్చారు. అతను లేవగానే నన్ను చూసి.. “నువ్వెవరు? నా ప్రాణాలు కాపాడటానికి వచ్చిన భగవంతునివా?!” అని ప్రశ్నించాడు.
విచిత్రం ఏమిటో కానీ.. ఆ పాముకాటు తర్వాత, నా పేరు కూడా నాకు గుర్తులేదు. నా గత జీవితం అంతా కలలాగా అనిపించసాగింది. గజేంద్రవాహనుడు నన్ను ప్రాణమిత్రునిగా ఎంచి, నన్ను కాపాడసాగాడు. అతనే నాకు సుమేధుడనే పేరు పెట్టాడు. నాకు పూర్వస్మృతి లేకపోయినా.. మేధలో పదును తగ్గలేదు. కొన్ని అభియోగాలలో చక్రవర్తికి సందిగ్ధంగా ఉన్న విషయాల్లో నిజనిర్ధారణ చేసి, తీర్పులు రాశాను.
అందుకతడు మెచ్చుకుని, నన్ను నూరు గ్రామాలకు రాజును చేశాడు. రత్నాంగి అనే భోగకాంత తెచ్చిన తివాసీని చూడగానే నాకు పూర్వస్మృతి కలిగింది!”.. అక్కడివరకు తన కథను చెప్పి, భార్య వైపు చూస్తూ..
“పాపం! పద్మిని పడ్డ కష్టాలతో పోల్చుకుంటే నేను పడ్డ కష్టాలు చాలా చిన్నవి” అన్నాడు.
అది విన్న పద్మిని తన పయ్యెద చెంగుతో కన్నీరు తుడుచుకుంటూ.. “ప్రాణేశ్వరా! అది కాలమహిమ కాక మరొకటి కాదు. దమయంతి, సీత, చంద్రమతి వంటివారి కంటే నేను అధికురాలను కాను. ఎన్ని కష్టాలకు గురిచేసినా.. చివరికి మనకు మేలే చేసిన భగవంతునిపై మనం కృతజ్ఞులమై ఉండాలి. గతచరిత్ర స్మరించకూడదు” అని గదాధరుని వైపు తిరిగి, “అన్నయ్యా! నా కుమారుణ్ని చూడాలని ఉంది. వెంటనే రప్పించండి” అని కోరింది.
తల్లిదండ్రులను కలుసుకున్న మృగదత్తుని ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అతణ్ని తిరిగి పొందిన తల్లిదండ్రుల హృదయం ఎంతగా ఉప్పొంగిందో చెప్పలేం.
సుమేధుడు ఆ మరునాడే చక్రవర్తిని కలుసుకుని, తన గత చరిత్ర చెప్పి.. అతణ్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చక్రవర్తి ఆ రోజే నిండు పేరోలగంలో.. పద్మినిని, గురుదత్తుణ్ని నిరపరాధులుగా ప్రకటించాడు. మృగదత్తుణ్ని దుర్గానగరానికి అధిపతిని చేశాడు. గురుదత్తుడు తల్లిదండ్రులను పిలిపించుకుని, విద్యానగరంలో చాలాకాలం రాజ్యం చేశాడు.
(వచ్చేవారం.. పాతాళ గుహ)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం