Kasi Majili Kathalu Episode 71 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జాన్ని తాళధ్వజుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయన ఇద్దరు కుమారులూ.. విజయయాత్రకు వెళ్తూ, రుషి వేషంలో ఉన్న మోసగాడి చేతిలో చిక్కుతారు. రాకుమారుల్లో పెద్దవాడైన వీరవర్మ.. పాతాళబిలంలోకి జారిపోయాడు. అతలలోకపు రాజకుమారి పద్మసేన అతణ్ని ప్రేమించి రక్షించింది. ఇంతలో ఆ బిలంలోకి రెండోవాడైన సుధన్వుడు కూడా జారిపడ్డాడు.
“వీడింకా బతికే ఉన్నాడు దేవీ!” అని సమాధానమిచ్చాడు కుంభాసురుడు.
“సరే అయితే! వీణ్ని చంపబోకు. మొన్నటి మానవుణ్ని చేతులారా పోగొట్టావు కదా! నీవల్ల నరాంతకుల వారింటిలో సీమంతం వేడుక పదిరోజులు వాయిదా పడింది. వీణ్ని నేను తీసుకుపోయి, అప్పగించి వస్తాను” అన్నది లంబోదరి.
శిలాయంత్రం ద్వారా ఇసుక పరుపుమీద పడ్డ సుధన్వుణ్ని భుజంమీద వేసుకుని పోయింది. నరాంతకుని ఇంటికి వెళ్లి, వాణ్నే పిలిచి అప్పగించింది.
“ఇదిగో వీడు బతికే ఉన్నాడు. ఈ పదిరోజులూ స్వల్పంగా ఆహారమిచ్చి కాపాడుకోండి. సీమంతోత్సవం నాడు చంపి, మంచి నూనెపోసి వండుకోండి. రుచిగా ఉంటుంది. దీనికోసం విశ్వప్రయత్నం అయింది. రాజుగారికి తెలియనీయకండి” అని చెప్పి వెళ్లిపోయింది.
నరాంతకుడు సుధన్వుణ్ని భద్రంగా పెరటిలోకి తీసుకుపోయి.. బోనులాంటి ఇంటిలో ఉంచాడు. ఆహారం పంపాడు. ఆ రాక్షసతిండి తినడం కష్టమైనా, ఆకలి వల్ల ఆ పూటకు తినక తప్పలేదు సుధన్వునికి.
కొండమీద వింతలు చూడటానికి పోయిన తన అన్న వీరవర్మ ఎంతకూ రాకపోవడంతో.. ముని ప్రేరణతో గుహలో ప్రవేశించాడు సుధన్వుడు. అతనిలాగే సుమారు పక్షం రోజులపాటు భూగర్భంలోకి జారిజారి.. ఈ అతల లోకంలోకి ప్రవేశించాడు. ఆ బందీఖానలో తదుపరి కర్తవ్యం ఏమిటో తెలియక చింతించ సాగాడు.
ఒకరోజు గడిచింది. అతనికి నిత్యం ఆహారం ఇవ్వడానికి నరాంతకుడు తన మేనకోడలైన రత్నావతిని నియమించాడు. పద్మసేనలాగే ఆమె తల్లి కూడా అప్సర జాతికి చెందినది. అతల లోకపు రాక్షసరాజు వజ్రకంఠుడు స్వర్గలోకం మీద దండెత్తినప్పుడు, అతనితోపాటుగా నరాంతకుని బావమరిది కూడా.. ఒక అప్సర కాంతను వెంట తెచ్చుకున్నాడు. అలా అప్సర స్త్రీలకు పుట్టినందు వల్ల పద్మసేనకు, రత్నావతికి సాధుహృదయం ఆనవాయితీగా వచ్చింది.
ఆమె రెండోనాడు ఆహారం తీసుకువెళ్లింది. సుధన్వుడి ఆకారం చూసి మోహపరవశ అయింది.
‘అయ్యో! ఈ దివ్యమంగళ విగ్రహుడికి ఇంక వారం దినాలలో మరణం రాసిపెట్టి ఉంది కదా! ఇతణ్ని చంపకుండా నాకిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తాను కదా! ఆ దీర్ఘజిహ్వుడి కొడుకు హ్రస్వపాదునికి నన్నిస్తారట. వాడి ముఖం చూస్తేనే డోకు వస్తుంది. అటువంటి వాడితో నేనెలా కాపురం చేయగలను?! ఈ పురుషుడికి నాకు తోచిన సాయం చేసి ఎలాగైనా రక్షిస్తాను’ అని మనసులో తలపోసింది. తాను తెచ్చిన ఆహారాన్ని సుధన్వుని ముందు పెట్టి, దూరంగా నిలబడింది.
అతను ఆహారం తీసుకోకుండా.. “కల్యాణీ! ఇదే దేశం?! నువ్వెవరివి? నీ ముఖం చూస్తుంటే కరుణ రసం ఉట్టిపడుతున్నది. నన్ను మీరెందుకిలా బందీగా ఉంచి పోషిస్తున్నారు?! అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను?” అని ప్రశ్నించాడు.
“ఆర్యా! ఈ దేశం పేరు తెలియకుండానే ఇక్కడికి వచ్చారా? నన్ను ఏదో విధంగా పలకరించాలనే నెపంతోనే మీరిలా మాట్లాడుతున్నారు కాబోలు” అన్నది రత్నావతి.. అతణ్ని క్రీగంట చూస్తూ.
“కల్యాణీ! నేను చెప్పేదాంట్లో ఆవగింజంత అబద్ధం లేదు. నేను కన్యాకుబ్జాన్ని ఏలే తాళధ్వజుని రెండో కుమారుణ్ని. మా అన్నతో కలిసి దిగ్విజయ యాత్రకు వెళ్లాను. అనేకమంది రాజులను జయించి తిరిగి వస్తూ, చిత్రకూటం వద్ద ఒక మహర్షి ప్రేరణతో మా అన్నగారు ఒక కొండ ఎక్కి ఎటో తప్పిపోయారు. ఆయన్ను వెతుక్కుంటూ నేను కూడా ఆ కొండ ఎక్కి, ఒక గోతిలో పడిపోయాను. కొంతసేపటికి స్మృతి తప్పింది. మెలకువ వచ్చి చూసేసరికి ఇక్కడున్నాను” అని తన వివరమంతా చెప్పాడు సుధన్వుడు.
“ఓహో మీరు రాజకుమారులా! భూలోకవాసులా!! గొప్ప ఆపదలోనే చిక్కుకున్నారు. ఇది అతల లోకం. దీనిని వజ్రకంఠుడనే రాక్షసుడు పాలిస్తున్నాడు. ఇక్కడున్న వారందరూ దయ, సత్యం, శౌచం లేని రాక్షసులు. మీరు ఈలోకానికి రాగానే చంపి ఉండాల్సింది. కానీ, మా మేనమామ నరాంతకుల వారి భార్యకు కొద్దిరోజులలో సీమంతం జరగనుంది. ఆనాటికి తాజా మాంసం కోసమే మిమ్మల్నింకా ప్రాణాలతో ఉంచారు” అని తమ రహస్యాలన్నిటినీ వెల్లడించింది రత్నావతి.
ఆమె మాటలు విని మౌనంగా ఉండిపోయాడు సుధన్వుడు. అతని కన్నుల్లో నీటి జాడలు కనిపిస్తున్నాయి.
“ఆర్యా.. నేను అబలను కదా! మీ కష్టం చూస్తుంటే నా గుండె పగిలిపోతున్నది. ఏం చేయగలను?! కానివ్వండి. ఇంకా పది రోజుల వ్యవధి ఉంది కదా! ఈలోపుగా నాకేదైనా ఉపాయం తట్టకపోదు. చేతనైనంతలో మీకు సాయం చేస్తాను” అన్నది రత్నావతి ఆహారపు పళ్లేన్ని అతనికి దగ్గరగా జరిపి. ఆమె సంతోషం కోసమే ఆనాడతను తిండి తిన్నాడు.
“రేపు మళ్లీ వస్తాను” అని చెప్పి వెళ్లిపోయిందామె.
మరునాడు యథా సమయానికే వచ్చింది. “పురుషరత్నమా! మీకు దేవనాగరి లిపి తెలుసునా?” అని ప్రశ్నించింది వస్తూనే.
“చక్కగా వచ్చును. ఎందుకలా అడిగావు?”.
“మరేమీ లేదు. మావాళ్లు స్వర్గంమీద దండెత్తినప్పుడు ఒక గ్రంథాన్ని ఎత్తుకొచ్చారు. మావాళ్లెవరికీ దేవనాగరి తెలియకపోవడం వల్ల దానిని చదవలేకపోయారు. రేపు మీకు ఏదోవిధంగా ఆ గ్రంథాన్ని తెచ్చి ఇస్తాను. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో చూద్దురుగాని” అని చెప్పి, భోజనం పెట్టి వెళ్లిపోయింది.
మరునాడు ఆ గ్రంథంతో వచ్చింది. సుధన్వుడు ఆతృతతో అందుకున్నాడు. ‘చతుర్దశ భువన సంగ్రహము’ అని గ్రంథం పేరు చదివాడు. కొంత ధైర్యం వచ్చింది. గబగబా పుటలు తిప్పి.. ‘అతలాది పాతాళలోక సిద్ధులు’ అనే అధ్యాయాన్ని కొంతసేపు చదివాడు. గ్రంథాన్ని మూసి పట్టుకుని, ఆనందం నిండిన కళ్లతో.. “రత్నావతీ! నువ్వు చేసిన ఉపకారానికి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చలేను. నీ దయవల్ల ఈ పుస్తకంలో మంచి సిద్ధిప్రక్రియ దొరికింది” అని చెప్పాడు.
“మనోహరా! మీకు బతుకుతెరువు కనిపిస్తే తొలిగా సంతోషించే దానను నేనే. ఏదీ ఆ విధానం ఏమిటో నాకు కూడా కొంచెం తెలియజేయండి” అని అడిగింది రత్నావతి.
అప్పుడు సుధన్వుడు ఆ అధ్యాయంలోని విశేషాలు ఇలా తెలియచేశాడు.
“ఇది అతలలోకం. సప్తపాతాళ లోకాలలో మొదటిది. ఒకప్పుడు ఈ లోకంలో మయుని కుమారుడు బలుడు అనేవాడు కొంతకాలం నివసించాడు. అతను తొంబై ఆరు మాయలను ఎరిగిన ప్రజ్ఞావంతుడు. ఒకనాడు అతను ఆవలించగా పుంశ్చలులు, స్త్వ్రరిణులు, కామినులు అనే మూడువిధాలైన స్త్రీలు జన్మించారు. వాళ్లు త్రికూట పర్వతం మధ్యనున్న మహాబిలంలో నివాసం ఏర్పరుచుకున్నారు. హాటక రససిద్ధిని పొందినవారికి వారు వశ్యులవుతారు. తమ సల్లాపాలతో రంజింప చేస్తారు. తమను కూడినవారికి పదివేల ఏనుగుల బలాన్నిస్తారు. ఇందులో రాసిన రససిద్ధి ప్రక్రియ నిజమైతే.. నేను బలవంతుడనై ఈ రాజ్యాన్ని గెలుచుకోగలను. తలుపులు తెరిచి, నన్నీ ఇల్లు దాటించు. నీకు పుణ్యం ఉంటుంది” అన్నాడు.
రత్నావతి మౌనంగా తలదించుకుని ఉండిపోయింది.
అప్పుడు సుధన్వుడే తిరిగి.. “రమణీ! దగ్గరికి రా! నీ అభిప్రాయం తెలిసింది. ఇదిగో నా కుడికాలితో నీ ఎడమ పాదాన్ని తొక్కుతున్నాను. ఈ రాజ్యం పొందిన తరువాత నిన్ను పట్టమహిషిగా చేసుకుంటాను. రససిద్ధి కోసం జరిపే ప్రయత్నంలో ఎవరితో అనుబంధం ఏర్పడినా, నిన్ను మాత్రం మరిచిపోను. నువ్వే నా ప్రాణేశ్వరివి” అని ఆమె చేయి పట్టుకుని, ముద్దు పెట్టుకున్నాడు.
రత్నావతి తన భాగ్యానికి పొంగిపోయింది. సమయం కనిపెట్టి, ఆనాడే అతణ్ని ఇల్లు దాటించింది.
సుధన్వుడు ఆ గ్రంథంలో ఉన్న ప్రకారం ఉత్తరదిక్కుకు వెళ్లాడు. ఆ లోకంలో పగలు రాత్రి భేదం పెద్దగా తెలియడం లేదు. సూర్యుడు కనిపించడు. వెలుగు కొద్దిసేపే ఉంటుంది. అంతలోనే చీకటిపడి పోతుంది. సుధన్వుడు వడివడిగా నడుస్తూ ఒక పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అదే త్రికూట పర్వతమని నిశ్చయించుకుని, ఎక్కడం ప్రారంభించాడు. ఒక జాము గడిచేసరికి.. రాళ్లతో కప్పి ఉన్న ఒక బిలద్వారాన్ని కనిపెట్టాడు. అక్కడే ఒకరాతిపై కూర్చుని, పుస్తకంలో చెప్పిన ప్రకారం.. రాళ్ల రాపిడి చేత అగ్ని పుట్టించాడు. సమిధల చేత ఆ అగ్నిని పెంపొందించి, మంత్రపఠనం సాగించాడు. హవనం పూర్తయ్యే సరికి ఎదురుగా ఉన్న రాయిపగిలి శకలమై, గుహద్వారం తెరుచుకుంది.
లోపల ఒక అందమైన ఉద్యానం దర్శనమిచ్చింది. ఆ ఉద్యానానికి మధ్యలో రత్నాల భవంతులున్నాయి. ఆ భవంతుల నుంచి ముగ్గురు సుందరాంగులు వెలికి వచ్చి.. సుధన్వుణ్ని పూలదండలతో ముంచెత్తారు.
“నాథా! నా పేరు పుంశ్చలి. ఇది స్త్వ్రరిణి. ఇక ఇదేమో కామిని. మేము ముగ్గురం నిన్ను వరించాం. నువ్వూ మమ్మల్ని పెళ్లాడి మాతో సుఖించు!” అన్నదొకామె.
“అందగత్తెలారా! మీరు దివ్యప్రభావ సంపన్నులు. నేను సామాన్య మానవుణ్ని. మీరు నాకు పత్నులు కావడం విపరీతం కాదా! పైగా పేర్లు చూస్తుంటేనే మీకు పెళ్లితో పనిలేదని అర్థమవుతున్నది. ఊహూ! మీతో అనుబంధం నాకు సమ్మతం కాదు” అన్నాడు సుధన్వుడు.
అందుకు పుంశ్చలి కొద్దిగా నొచ్చుకుని.. “నాథా! మా పేర్లు అలాంటివి కానీ, మా వృత్తి మాత్రం అది కాదు. మానవ సామాన్యుడివని వెనుకంజ వేయవద్దు. నీకు పదివేల ఏనుగుల బలం కలిగేలా చేస్తాం. మమ్మల్ని కలిసిన పిమ్మట.. ‘పరమేశ్వరుడైనా నా ముందు ఆగలేడు! అని నీకు ఒక విధమైన గర్వం కలుగుతుంది. ఈ ఉద్యానంలోనే నవనిధులు ఉన్నాయి. నువ్వు కుబేరునితో సమానుడివి కాగలవు. కనుక, వెరపు మాని మమ్మల్ని చేపట్టు. మన్మథ సామ్రాజ్య పట్టభద్రునివై మాతో క్రీడించు” అని ప్రోత్సహించింది.
అటుపైన సుధన్వుడు వారు తెచ్చిన పూలమాలలను వారి మెడల్లో వేశాడు. పరిజనులు కరతాళాలు మోగించారు. అలా సుధన్వుడు వారితో కాలక్షేపం చేస్తుండగా.. “చెరలో ఉన్న మానవుడు తాళాలు పగలకొట్టి పారిపోయాడు” అని నరాంతకునితో చెప్పింది రత్నావతి.
ఆమెను బాగా మందలించిన నరాంతకుడు, తిరిగి లంబోదరి వద్దకు వెళ్లాడు.
“నువ్వు తెచ్చిన మానవుడు పారిపోయాడు. మరొకడు ఎవడైనా శిలాయంత్రం మీద పడతాడేమో చూడు” అని కోరాడు.
“నరాంతకా! ఇప్పటికే నీకు రెండుసార్లు మానవులను అప్పగించాను. ఇక నా వల్ల కాదు. నేనిప్పుడే రాజుగారికి ఈ వర్తమానం తెలియచేస్తాను. నువ్వు వేరేదైనా మార్గం వెతుక్కో” అని కసిరి పంపేసింది లంబోదరి.
అప్పటికప్పుడే వజ్రకంఠుని పేర లేఖ రాసింది.
‘రాజా! వందనాలు. నిన్న ఒక మానవుడు యంత్రశిలా ఫలకంమీద జారిపడ్డాడు. కుంభుడు వాణ్ని కొట్టి చంపబోగా.. గద లాక్కుని వాడే వీణ్ని చావగొట్టాడు. కనిపించకుండా పారిపోయాడు. నాకు బుద్ధి తెలిసిన తరువాత ఇంత విచిత్రం ఎన్నడూ జరగలేదు. వాణ్ని వెతికి తెప్పించాల్సిందిగా కోరుతున్నాను’.. అని రాసి, కుంభాసురుని చేతికిచ్చి పంపింది.
వాడు కోటకు వెళ్తుండగా దారిలో రాజపుత్రిక అయిన పద్మసేన వద్ద పనిచేసే పరిచారిక ద్విజట ఎదురుపడింది.“ఓరీ! నువ్వు ఆనాడు మాకు తోటలో కనిపించినవాడివే కదా! నీకోసమే వస్తున్నాను. రాకుమారి నిన్ను రమ్మని కబురంపింది” అన్నది.
ఆ మాటలకు కుంభాసురుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
“యువరాణి వారికి నేనింకా జ్ఞాపకం ఉన్నానా!. ఎంతదృష్టం!. అమ్మా! ఈ లేఖ రాజుగారికి అందించి, నిమిషంలో వస్తాను. ఇక్కడే ఉండండి” అన్నాడు.
“ఏమిటా ఉత్తరం?” అని చొరవగా దాన్ని లాక్కుంది ద్విజట.
(వచ్చేవారం.. మరో కథతో)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు