Kasi Majili Kathalu Episode 78 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జాన్ని పాలించే తాళధ్వజునికి ఇరవైమంది కుమారులు. వారందరూ ఐదుగురు చొప్పున తూర్పు, ఉత్తర దిగ్విజయ యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు మూడో విడత శ్రీముఖుడు, విక్రముడు, విజయుడు, చిత్రభానుడు, నలుడు.. పశ్చిమ దిగ్విజయ యాత్రకు బయల్దేరారు. కొంకణ, టెంకణ, సౌరాష్ట్ర మొదలైన దేశాధిపతులను జయించారు. మహారాష్ట్రంలో ప్రవేశించారు.
మహారాష్ట్ర దేశాధిపతి శ్రీధరుడు. ఆయన తన కూతురైన కమలావతికి స్వయంవరం చాటించాడు. ఆ వార్త విన్న కన్యాకుబ్జ రాకుమారులు కూడా ఆ దేశ రాజధాని ఉమాపురానికి వెళ్లారు. రాజశాసనం ప్రకారం అధికారులు.. స్వయం వరానికి వచ్చిన వారందరినీ తగిన విడిదులలో ప్రవేశపెట్టారు. ప్రతివారి వంశనామాలను, బిరుదాలను జాబితా రాసుకుని వెళ్లారు.
శ్రీధరుడు పూర్వాచార పరాయణుడు. క్షత్రియ వంశమర్యాద ప్రకారం కూతురికి స్వయంవరం ప్రకటించాడు. ఎంపిక చేసిన కొన్ని రాజ్యాల వారికి ప్రత్యేకంగా లేఖలు రాసి, స్వయంవరానికి ఆహ్వానించాడు. అయితే కమలావతి సుగుణాలరాశి, అందాలభరిణ, విద్యలలో సాటిలేనిది. దాంతో ఆహ్వానాలు లేకున్నా.. కొంతమంది రాకుమారులు.. శ్రీముఖుడు మొదలైనవారిలాగా తమంతట తామే స్వయంవరానికి తరలివచ్చారు.
మహారాజు అధికారులు తీసుకొచ్చిన జాబితాలను వడబోశాడు. స్వయంవరానికి రావచ్చునంటూ ఉత్తములకు మాత్రమే ఆహ్వానాలు పంపాడు. తన స్థాయికి సరిపడని వారికి కొన్ని కానుకలిచ్చి.. విడిది నుంచే తిరిగి వెళ్లాల్సిందనీ, స్వయంవరానికి రానవసరం లేదనీ లేఖలు రాయించాడు. శ్రీముఖుడు మొదలైన కన్యాకుబ్జ రాకుమారులకు కూడా లేఖలు వెళ్లాయి.
‘రాజపుత్రులారా! మీ రాజ్యం ఏమూల ఉందో మాకు తెలియదు. అంతేకాకుండా మీకు మేము ఆహ్వాన పత్రికలు పంపలేదు. కనుక ఈ లేఖతోపాటు కానుకలను స్వీకరించి, మీ స్వస్థలాలకు తిరిగి వెళ్లవచ్చు. ఇలా రాసినందుకు మాపై కోపగించవద్దు’.. అని ఉందా లేఖలలో.
లేఖలను చదువుకున్న శ్రీముఖునికి, అతని సోదరులకు విపరీతమైన కోపం కలిగింది.
“లోకంలో రాజులందరూ తమ కూతుళ్లకు స్వయంవరాలు ఇలాగే జరిపిస్తున్నారా?! వచ్చినవారిని సభకు ఆహ్వానించాలి. వధువుకు నచ్చకపోతే తిరస్కరించాలి. అంతేకానీ, ముందుగానే సభకు రాకూడదని నిషేధాజ్ఞలు పంపడం సమంజసమేనా?! తమ్ముళ్లూ! దీనికి మనం ప్రతీకారం చేయాల్సిందే!” అన్నాడు శ్రీముఖుడు.
అందరూ ‘సై అంటే సై’ అన్నారు.
స్వయంవరం రోజు రానేవచ్చింది. ఐదుగురూ అశ్వాలను అధిరోహించి సభాభవనానికి వెళ్లారు. కరవాలాలు చేతబూని గుర్రాలపై నుంచి ఒక్కమారే కిందికి ఉరికారు.
నలుగురు తమ్ముళ్లూ నాలుగువైపులా కాపు కాస్తుండగా శ్రీముఖుడు ముందుకు నడిచాడు. అడ్డువచ్చిన వారిని నిర్జించి, సభామంటపంలోకి దూసుకువెళ్లాడు. వరమాల చేతపట్టుకుని, ఆహూతులైన రాకుమారుల చరిత్రలను వింటున్న కమలావతి నడుము చుట్టూ చేతులు వేసి, భుజాలమీదికి ఎత్తుకున్నాడు. సభలోని వారంతా హాహాకారాలు పెడుతుండగా బయటికి నడవసాగాడు.
కొందరు ఆయుధాలు ధరించి ఎదుర్కొన్నారు. చూస్తుండగానే వారంతా ఆ అన్నదమ్ముల చేతిలో ఓడిపోయి పారిపోయారు. చివరికి శ్రీధర మహారాజు స్వయంగా ఆయుధం పట్టాడు. అతణ్ని కూడా ఆ అన్నదమ్ములు చిత్తుగా ఓడించి, బందీగా పట్టుకున్నారు.
“రాజా! నీలో పస ఇంతమాత్రమేనా? ఈమాత్రం దానికే మావంటి వారిని నిషేధించి, అపకీర్తి మూటకట్టుకున్నావు కదా!” అని ఎద్దేవా చేశారు.
అందుకు శ్రీధరుడు.. “రాజపుత్రులారా! నాకిప్పుడు విచారం లేదు. నా కుమార్తెకు సర్వసమర్థుడైన వరుణ్నే ఎంపిక చేయాలన్న నా అభీష్టం నెరవేరింది. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు చేపట్టినట్లుగా.. రాక్షసపద్ధతిలో నువ్వు నా కుమార్తెను చేపట్టావు. నేను సంతోషంగానే ఉన్నాను” అని పలికాడు.
దాంతో అతని కట్లు విప్పివేశారు. శ్రీధరుడు తన అల్లుణ్ని, అతని తమ్ముళ్లను భద్రగజాలపై కూర్చోబెట్టి విడిదికి తీసుకువెళ్లాడు. నాలుగురోజుల వ్యవధిలో శ్రీముఖునికి, కమలావతికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకలో తన అల్లుళ్ల వీరత్వాన్ని గురించి శ్రీధరుడు నలుగురికీ గొప్పగా చెప్పుకోసాగాడు.
ఆ స్తుతివచనాలను విన్నవారిలో కొందరు.. “మీ అల్లుళ్లు పాండవుల్లా లోకైకవీరులని ఒప్పుకోవచ్చు. కానీ, వీరికి వరుణ ద్వీపాధిపతి అయిన క్రోధనునితో కనుక పోరు సంభవిస్తే ఎవరు గెలుస్తారో అని సందేహంగా ఉంది” అని పలికారు.
వారి వ్యాఖ్యానాలను విన్న శ్రీముఖుడు..“మామగారూ! ఆ క్రోధనుడెవరు? వాడి రాజ్యం ఎక్కుడుంది?” అని ఉత్సాహంగా అడిగాడు.
“వత్సా! ఇక్కడికి నూరు ఆమడల దూరంలో.. పశ్చిమ సముద్రమధ్యలో వరుణద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని పాలించే క్రోధనుడు గొప్ప యంత్రబలం కలవాడు. తన ద్వీపానికి చుట్టూ సముద్రమధ్యలో యంత్రపు గనులు అమర్చాడు. ఎవరైనా తెలియకుండా ఓడలపై వెళుతూ ఆ గనులను గుద్దుకుంటే మునిగిపోయేలా ఏర్పాట్లు ఉంటాయి. సముద్రంలో క్రోధనుడు ఏర్పాటుచేసిన యంత్రాలు ఎక్కడెక్కడున్నాయో ఎవరూ కనిపెట్టలేరు. ఇంతెందుకు.. వాడి అనుమతి లేకుండా ఫాలాక్షుడు కూడా ఈ సముద్రాన్ని దాటి ఆ నగరంలో అడుగుపెట్టలేడు” అని చెప్పాడు శ్రీధరుడు.
ఆ మాటలు వింటూనే శ్రీముఖునిలో సమరోత్సాహం పెరిగింది.
“తమ్ములారా! పిరికిపందలైన వారిని ఎందరిని పడగొట్టినా ఏమున్నది గర్వకారణం?! నిర్వక్ర పరాక్రముడైన క్రోధనుడి వంటివాణ్ని నెగ్గినప్పుడు కదా మన పేర్లు లోకానికి తెలిసేది. పదండి.. దండయాత్రకు!” అన్నాడు కరవాలంపై చేయివేసి.
“అన్నా! కొత్త పెళ్లికొడుకువి నువ్వెందుకు? మంగళతోరణాలు వాడకముందే యుద్ధానికి ఉరకడం మంచిది కాదు. ఈ మాత్రం దానికి మేం నలుగురం చాలమా?! మమ్మల్ని పంపు చాలు” అని అతణ్ని నిలువరించారు నలుగురు తమ్ముళ్లూ.
శ్రీముఖుడు అన్యమనస్కంగానే అందుకు ఒప్పుకొన్నాడు. అతని తరువాతివారిలో పెద్దవాడైన విక్రముడితో సహా నలుగురు అన్నదమ్ములూ మంచిముహూర్తంలో సముద్ర ప్రయాణం ప్రారంభించారు. వరుణావతీ నగరానికి పది యోజనాల దూరంగా దక్షిణతీరాన ఓడలు చేరాలని శ్రీధరుడు నిర్దేశించాడు.
నావికులు నేర్పుగా గాలిని అనుసరించి, ఓడలను సముచిత వేగంతో నడిపిస్తున్నారు. అన్నదమ్ములు నలుగురూ నాలుగు ఓడలపై కూర్చున్నారు. విక్రముడు ముందుగా నడిచే ఓడలో కూర్చున్నాడు. నావికులకు అధిపతి అయిన సమయవేది అనేవాడితో మాట్లాడుతూ.. వరుణావతీ నగరాన్ని గురించి విశేషాలు తెలుసుకోసాగాడు.
“బాబూ! నేను చిన్ననాటినుంచి ఈ ఓడమీద తిరుగుతున్నాను. అనేక ద్వీపాలకు పోయాను కానీ, ఎన్నడూ వరుణావతీ నగరానికి పోలేదు. ఆ రాజు రావణాసురుడి లాంటివాడని అందరూ చెప్పుకొంటారు. వరుణద్వీపం నూరు ఆమడల వైశాల్యం కలదట. అతను సముద్రం చుట్టూ యంత్రపు గనులు వేశాడు. ఆ యంత్రాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఓడలను నడిపిస్తే.. అవి తగిలి ఓడలు పగిలిపోతాయి. క్రోధనుడు ఎప్పటికప్పుడు తన యంత్రవ్యూహాన్ని మార్చివేస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు ఈ దారిలో ప్రయాణించాను. ఈసారి కూడా దేవుడి దయవల్ల క్షేమంగా చేరుకోగలమని భావిస్తాను” అని చెప్పాడు సమయవేది.
విక్రముడు కూర్చున్న ఆ ఓడను అనుసరించే మిగిలిన ఓడలన్నీ నడుస్తున్నాయి. చాలాదూరం దక్షిణంగా పోయిన తరువాత ఓడలు పడమర దిశకు మళ్లాయి. అక్కడ క్రోధనుడు వేయించిన కొత్త గనులను సమయవేది దురదృష్టవశాత్తూ కనిపెట్టలేకపోయాడు.
చూస్తుండగానే ఓడలు ఫెటఫెటార్భటులతో విడిపోయి, సముద్రంలో కొట్టుకుపోయాయి. వాటిలో ఉన్నవారంతా హాహాకారాలు చేయసాగారు. సముద్రంలో ఓడలు మునిగిపోయినప్పుడు ప్రయాణికుల రక్షణ కోసం చిన్నదోనెలు ఉంచుతుంటారు. దైవికంగా విక్రముని చేతికి అటువంటి దోనె ఒకటి దొరికింది. తెప్పకంటే పెద్దదైన ఆ దోనెలోకి నీరెక్కినా మునిగిపోదు. అతికష్టంమీద అటువంటి దోనెపైకి చేరుకున్న విక్రముడు.. ‘ఆహా! కాలం ఎంతలో తారుమారైంది?! జాముకిందట ఓడమీద కూర్చుని, క్రోధనుణ్ని గెలిచే ఉపాయాలు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ దోనెపైకి ఏజలచరమో చేరితే నన్ను నేనే రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను. ఇక దేవుణ్ని ధ్యానించడం తప్ప చేయగలిగింది లేదు’ అనుకుంటూ ఈశ్వర ధ్యానానికి సంకల్పించాడు.
అలా ఈశ్వర ధ్యానంలో ఉండగా.. అతని మనసులో జగన్మాత రూపం కదలాడింది. ఇది కూడా శుభసూచకమే కాబోలు అనుకుంటూ దోనెను విడిచిపెట్టకుండా కూర్చున్నాడు. రెండుదినాలపాటు అతను అలా సముద్రంపైనే తేలియాడాడు. క్రమంగా అతనికి స్మృతి తప్పింది. మూడోనాటి ఉదయానికి దోనె ఒక తీరానికి కొట్టుకుపోయింది. విక్రమునికి మెల్లిగా తెలివి వచ్చింది. ఓపిక తెచ్చుకుని ఒడ్డుకు చేరుకుని, ఇసుకలో చిన్న చెలమ తవ్వాడు. దానిలో మంచినీరు ఊరింది.
ఆ నీటిని కడుపునిండా తాగి, సత్తువ తెచ్చుకున్నాడు. అక్కడ జనసంచారం ఏమీ లేదు.
‘దేవుని దయవల్ల నా సోదరులు కూడా ఏదో ఒక ఒడ్డుకు చేరుకుంటే బాగుండును కదా!’ అనుకుంటూ తీరంవెంట కొంతదూరం నడుచుకుంటూ పోయాడు. జాము పొద్దెక్కేసరికి అడుగులు తడబడసాగాయి. దొరికిన చెట్లపళ్లను తిని, ఆకలి తీర్చుకున్నాడు. కనుచూపుమేరలో గ్రామాలేవీ కనిపించలేదు.
చుట్టూ పరికించి చూడగా.. పడమరగా కొంతదూరంలో నల్లమబ్బుల చాటునుంచి మెరుపుతీగ కనిపించినట్లుగా ఆకుపచ్చని చెట్ల మధ్యలో తళుక్కుమంటూ ఒక బంగారువన్నె కాంతి తోచింది. ఆ కాంతినే ఆధారం చేసుకుని, ముందుకు అడుగువేశాడు. చాలాదూరం నడవగా అతనికి డొంకల మధ్యలో ఒక ఆలయం దర్శనమిచ్చింది. ఆ ఆలయం ఎత్తయిన ప్రహరీతోనూ, శక్తి విగ్రహాలతో కూడిన పెద్దగోపురాలతోనూ ఉన్నది. మూసి ఉన్న తలుపులు లోపల గడియ పెట్టకపోవడం వల్ల కొద్దిగా తోయగానే తటాలున తెరుచుకున్నాయి.
తన అదృష్టం ఫలించినదని మురిసిపోతూ.. విక్రముడు విశాలమైన లోపలి ఆవరణలో అడుగుపెట్టాడు. ఆలయానికి బంగారు రేకులపై నగిషీపని చేసినందువల్ల దూరంనుంచే కళ్లకు మిరుమిట్లు గొలుపుతున్నది.
అప్పటికి సూర్యాస్తమయం అవుతున్నది. ఆగ్నేయ భాగంలో ఉన్న తటాకంలో స్నానం చేసి, కడుపునిండా ఆ నీటిని తాగాడు. ఆ నీటి మహత్యం ఏమిటో కానీ, పంచభక్ష్య పరమాన్నాలు భుజించినంత తృప్తి, బలం వెంటనే కలిగాయి.
‘ఇదేదో దేవభూమిలా ఉంది. మనుషుల సంచారం లేకపోయినా ఇక్కడికి ఎవరో తరచుగా వచ్చి.. ఆ పుష్పలతలకు నీరు పోస్తున్నట్లు, వేదికలు అలికి ముగ్గులు పెడుతున్నట్లు, మంటపాలు తుడుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ చవిచూసిన పూలవాసన జన్మలో ఎరుగను. ఈ నీరు తాగడంతోనే అంతులేని బలం కలిగింది. ఇది మానససరోవరం కాదు కదా!’ అనుకుంటూ ఆలయంవైపు నడిచాడు.
ముఖమంటపం స్ఫటిక శిలామయంగా ఉంది.
స్ఫటికంలోనే మలిచిన ద్వారపాలికా విగ్రహాల చేతులలో తళతళలాడే ఇనుప కత్తులున్నాయి. అప్పటికే బయట చీకటి పడింది. ఆలయం మాత్రం శిల్పాల చేతిలోని మణుల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది.
క్రమంగా అన్ని మంటపాలనూ దాటుకుని, గర్భాలయ ద్వారాన్ని తెరిచాడు విక్రముడు. దివ్యతేజస్సుతో ప్రకాశించే జగన్మాత విగ్రహం దర్శనమిచ్చింది. దేవతా స్వరూపాన్ని చక్కగా పరిశీలించి, ఆమె గాయత్రీదేవి అని నిర్ధారించుకున్నాడు. సముద్రంలో మునిగిపోయే ముందు పరమేశ్వరుణ్ని ధ్యానించగా.. తన మనసులో నిలిచిన దేవత ఈమే అనిపించింది. అనేక స్తోత్రాలతో దేవిని కీర్తించాడు. తాను తెచ్చిన పూలతో అర్చించాడు. కొద్దిసేపటికి తృప్తి చెంది, ముఖమంటపంలోకి వచ్చి కూర్చున్నాడు. సముద్రంలో మునిగిపోయింది మొదలు.. అక్కడికి చేరినంతవరకు జరిగిన గాథ అంతా ఒక కలలా తోచింది అతనికి. మరికొంతసేపటికి..
‘ఇదంతా కల కాదు. నేను దోనెపై కూర్చుని ఉండగానే చనిపోయాను. చనిపోయేముందు నా మనసు జగన్మాతపై లగ్నం కావడం వల్ల నాకు సాలోక్యముక్తి కలిగింది. ఇక దేవి సన్నిధిలోనే నిశ్చింతగా గడిపేస్తాను..’ అనుకోసాగాడు.
అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో దూరంగా ఏవో మాటలు వినిపించాయి. అదిరిపడి లేచి చూశాడు విక్రముడు. పరిశీలించి చూడగా ఆ ధ్వని ఆకాశం నుంచి వస్తున్నట్లు తోచింది. ఏవో కొన్ని నక్షత్రపుంజాల వలె వెలుగుతున్న ఆకారాలు కళ్లకు మిరుమిట్లు గొలిపాయి. సంస్కృతభాషలో సంభాషించుకుంటూ ఆలయంలోకే వస్తున్న ఆ వెలుగులు.. క్రమంగా దగ్గరయ్యే కొద్దీ వారు మొత్తం నలుగురు దేవకన్యలని విక్రముడు గుర్తించగలిగాడు. వారికంట పడకుండా చటుక్కున ఒక స్తంభం చాటుకు వెళ్లి దాక్కున్నాడు.
(వచ్చేవారం.. కాబోయే వరుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట