పుల్కల్, జూన్ 14 : మరమ్మతుల పేరిట అధికారులు నీటిని దిగువకు వదలడంతో సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్ధ్యం 29.91 కాగా, ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మనదేశంపై ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందని, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ విభాగం అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో వానలు కురవకుంటే సింగూర్ ఆయకట్టు కరువు కోరల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకోక రైతులు, రైతు కూలీల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది.
సింగూర్ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పడిపోతుండడంతో రైతులు విత్తనాలు వేయాలంటేనే బిక్కుబిక్కుమంటున్నారు. పంటలు వేయాలంటే ఎప్పుడు వర్షం పడుతుందోనని ఆకాశం వైపు రైతులు ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాలు కురి సి, ఎగువ నుంచి వరద వస్తేనే సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు. సింగూర్ ప్రాజెక్టు గేట్ల దగ్గర రివిట్మెంట్ కుంగిపోయి పగుళ్లు ఏర్పడింది. దీంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పనులు కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ఈ వానకాలం ప్రాజెక్టులో 8 టీఎంసీలకు మిం చి నీళ్లను నిల్వచేసే పరిస్థితి ఉండదు. ఇదే జరిగితే ఆయకట్టు కింద క్రాప్ హాలిడే తప్పదు.

గతేడాది ఎగువ నుంచి సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ అధికారులు అనుకున్న మేర నీటిని నిల్వచేయలేకపోయారు. సింగూర్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుంటే రాబోయే రోజు ల్లో ముప్పు తప్పదని డ్యామ్సేఫ్టీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం వేగంగా స్పందించి మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేయించలేదనే విమర్శలు ఉన్నాయి.రాష్ట్ర మంత్రులు పలుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి జూన్ చివరి వరకు ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ, ఆమేరకు మరమ్మతు పనులు జరగలేదు. ఇప్పటి వరకు 20శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టు ఎడమ వైపున 20 శాతం, సుమారు 700 మీటర్ల రివిట్మెంట్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టు కట్ట తలుపుల దగ్గర 60 మీటర్లు మట్టి పనులు మాత్రమే పూర్తయ్యాయి. కుడి వైపున 70 మీటర్ల పనులు జరిగాయి. కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేయడం లేదని తెలిసింది. సుమారు 3 కిలోమీటర్ల మేర పనులు జరిగితేనే ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిని నింపగలరు.
సింగూరు ప్రాజెక్టు అంతర భాగంలో పనులు ఇలా ఉంటే, ప్రాజెక్టు ఎడుమకాలువ పనుల పరిస్థితి అలాగే ఉన్నాయి. పుల్కల్, అందోల్, చౌటకూర్ మండలాలకు 37,500 ఎకరాలకు సాగునీరు అందించే ఎడమ కాలువ సీసీ లైనింగ్ పనులు ఇంకా పూర్తికాలేదు. గంతంలో ఈ కాలువ కింది పంటలకు క్రాప్ హలిడే ప్రకటించారు.
ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సింగూరు ప్రాజెక్టు లోపలి భాగంలో మరమ్మతుల పనులు కొనసాగాలంటే ప్రాజెక్టులో నీటినిల్వ సా మర్ధ్యం 8 టీఎంసీలు మించరాదు. అంతకంటే ఎక్కువ నీళ్లు నిల్వ చేస్తే పనులు చేయ డం సాధ్యం కాదు. నీటి నిల్వపై ప్రస్తుతం కమిటీ అధికారులు మరోసారి సమావేశమై ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరదను నిల్వ చేయాలా, లేక దిగువకు వచ్చిన నీరు వచ్చినట్లే వదిలాలా అనే దానిపై సమీక్ష సమావేశం అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం బాగా తగ్గడంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీసుకెళ్లే పైపులైన్లకు నీళ్లు అందడం ఖష్టమవుతున్నది. దీంతో అధికారులు ప్రత్యేక మోటర్లను బిగించి పైప్లైన్ ద్వారా నీటిని తోడేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయని గతంలోనే ప్రత్యేకమైన మూడు పైపులైన్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా తాగు నీరు అం దించనున్నారు.
ఈ మోటర్ల ద్వారా నెలకు సుమా రు 1.2 టీఎంసీల నీరు దిగువకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కోసం అందోల్ నియోజక వర్గంతో పాటు సంగారెడ్డి, మెదక్ నియోజక వర్గాలకు కూడా ఇక్కడి నుంచే నీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రాజెక్టులోని నీళ్లు త్వరలో అయిపోయి ఎడారిలా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ప్రాజెక్టు మరమ్మతులు సకాలంలో పూర్తికాక పోవడంతో పంటలు సాగుకు నోచుకోక రైతులు నష్టపోయే అవకాశం ఉంది.
సింగూర్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి జిల్లాలో పుల్కల్, చౌటకూర్, అందోల్, సదాశివపేట మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సింగూరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా సదాశివపేట మండలంలోని 8 గ్రామాల్లో 2,500 ఎకరాలకు సాగునీరు అం దించాల్సి ఉంది. ఎడమ కాలువ ద్వారా పుల్కల్, అందోల్, చౌటకూర్ మండలాల్లో 37,500 ఎకరాలకు సాగునీరు అందించాలి.కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టు నీరు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో వానకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు బాగా కురిస్తే బోరుబావులు ఉన్న రైతులు వరి సాగుచేసే అవకాశం ఉంది.