Kasi Majili Kathalu Episode 49 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : భార్య ప్రవర్తన వల్ల దేవశర్మ మనసు చెదిరి ‘అంతా విచిత్రమే’ అని గొణుక్కుంటూ.. ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అతనికి ‘అంతా దైవాధీనం’ అనే వాడొకడు, ‘ఎవరికెవరూ లేరు’ అనే మరొకడూ పరిచయం అయ్యారు. గుర్తు తెలియని వాళ్లు దైవాధీనానికి పెళ్లి చేసి, పెళ్లికూతురితోపాటు మాయమయ్యారు. ఆ తరువాత ముగ్గురూ ఊరుదాటి.. ప్రయాణం సాగించారు.
అది చీమలు దూరని చిట్టడవి. కాకులు దూరని కారడవి. ఆ అడవిలో నడవాలంటే పట్టపగలైనా భయం వేస్తుంది. కానీ, వాళ్లు ముగ్గురూ భయమనేదే ఎరుగని పిచ్చివాళ్లు కనుక, చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకుండా ముందడుగు వేస్తున్నారు. చీకటి పడేవేళకు వాళ్లకో మర్రిచెట్టు కనిపించింది.
సూర్యకిరణాల తాకిడికి భయపడి పరుగెత్తుకొచ్చిన చీకట్లకు.. అభయమిచ్చి రక్షిస్తున్నట్లుగా ఉందా చెట్టు. దానికింద మొదలు కన్నా లావైన ఊడలు వందలకొద్దీ నేలకు దిగాయి. ఆ చెట్టుకింద లక్షలమంది అయినా హాయిగా కాలక్షేపం చేయవచ్చు. ఆ కొమ్మల మీద వేలాదిమంది గూళ్లతో పనిలేకుండా జీవించవచ్చు. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉండే దొంగలకు తాము దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి, పంచుకోవడానికి అనుకూలమైన చోటది.అటువంటి చెట్టుకిందికి ఆ ముగ్గురూ చేరుకున్నారు. చీకటి పడుతున్నది కనుక తలో కొమ్మపైకి చేరుకుని, నిద్రకు ఉపక్రమించారు. కొంతసేపటికి ఎవరో ఇద్దరు దొంగలు ఆ చెట్టుకిందికి ఒక గంపతో వచ్చారు. గంపలో పదహారేళ్ల ఒక పెళ్లికూతురుంది.
గంప కిందపెట్టిన తరువాత..
“ఒరేయ్! ఇంతసేపైనా దీనికి తెలివి రాలేదేమిట్రా?! కొంపదీసి చచ్చిందంటావా?” అన్నాడొకడు.
“పాడుకూతలు కూయబోకు. అసలే పెళ్లికానివాణ్ని. ఈ బంగారపు బొమ్మను పెళ్లి చేసుకోవాలని ఇంత కష్టపడితే ఈన గాచి నక్కలపాలు చేస్తానా?! బహుశా ఎత్తునుంచి కింద పడింది కదా! అందువల్ల స్పృహ తప్పి ఉంటుంది. తెల్లారేదాకా ఓపిక పడితే అదే లేస్తుంది” అని చెప్పాడు రెండోవాడు.
ఇంతలో దూరంగా ఏదో కలకలం బయల్దేరింది.
“అదేమిటో చూడరా!?” అన్నాడు మొదటివాడు.
రెండోవాడు చెట్టెక్కి చూడగా.. కాగడాల వెలుగుతో ఏదో సైన్యం అటే వస్తున్నట్లు కనిపించింది. వాడు ఆదరా బాదరాగా కిందికి దిగి.. “ఒరేయ్! మన పని అయిపోయింది. ఈ పిల్లను మనం ఎత్తుకొచ్చినట్లు రాజుగారికి తెలిసిపోయినట్లుంది. సైన్యాన్ని వెంటబెట్టుకుని వస్తున్నారు” అని చెప్పాడు.
“అయితే ఈ పిల్లను చెట్టుతొర్రలో దాచిపెట్టేసి, ఇక్కడినుంచి పారిపోదాం” అన్నాడు మొదటివాడు.
ఆవిధంగానే చేసి ఇద్దరూ అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
కొద్దిసేపటికే ఆ కాగడాల వెలుగు చెట్టుకిందికి చేరింది. కానీ, అవి కాగడాలు కావు. కొరివి దయ్యాలు కవాతు చేస్తూ వస్తున్నాయి. వాటిమధ్యలో పిశాచాలు మోస్తున్న శవవాహనంపైన ఎక్కి, భూతరాజు.. తన మంత్రి అయిన భైరవునితో కబుర్లు చెబుతూ అక్కడికి వచ్చాడు. అప్పటికే పరిచారికలు ఎముకలతో పేర్చిన సింహాసనాన్ని సిద్ధం చేశారు. ఠీవిగా సింహాసనంపై కూర్చున్న తరువాత.. “భైరవా! మనం దేశాటనం చేయడం మొదలుపెట్టి సంవత్సరమైంది. ఇప్పటికే ఎన్నో శ్మశానాలు చుట్టివచ్చాం. ఎన్నో గుహలలో తిరిగాం. అడవులను పరామర్శించాం. కానీ, ఇంత మనోహరమైన ప్రదేశాన్ని మాత్రం ఇంతకుముందు చూడలేదు సుమా!” అన్నాడు భూతరాజు.
ఆ మాటలకు నిజమేనన్నట్లు తల ఊపాడు భైరవుడు.
“ఇంతకీ బేతాళుడెక్కడ.. కనబడడేం?!” అని అడిగాడు భూతరాజు.
“మనం వస్తున్నట్లు కాశీనుంచే లేఖ రాశాను ప్రభూ! తిరుగు ఉత్తరం కూడా రాసి పంపాడు. మరెందుకు రాలేదో తెలియడం లేదు” అని సమాధానం ఇచ్చాడు భైరవుడు.
“అవునా? ఏం రాశాడో చదువు” అని ఆజ్ఞాపించాడు భూతరాజు.
భైరవుడు చదవసాగాడు..
‘శ్రీభూతరాజుగారి పాదపద్మాలకు నమస్కరించి.. బేతాళుడు రాసుకునే విన్నపాలు. అమాత్య భైరవుల చేత తాము రాయించి పంపిన లేఖ అందినది. తమరు మా నివా
సానికి రావడం ఆనందకరం. మీరు ఆజ్ఞాపించినట్లే.. కాళీమాతను అర్చించడం కోసం.. వయసులో ఉన్న క్షత్రియ కన్య గొంతు నులిమిన పచ్చి నెత్తురు సిద్ధంగా ఉంచుతాను.
– ఇట్లు తమ పాదసేవకుడు బేతాళుడు’.
ఆ ఉత్తరం విని భూతరాజు సంతోషించాడు.
“దీనివల్ల అతడి భక్తివిశ్వాసాలు తెలుస్తున్నాయి. కానీ, మాకు స్వాగతమివ్వడానికి ఎందుకు రాలేదో?” అన్నాడు.
అప్పుడు భైరవుడు..
“పలలప్రియా!” అని పిలిచాడు.
పలలప్రియుడు ఆయుధాన్ని ధరించి, రౌద్రాకారంతో హుంకారం చేస్తూ నాలుగు దిక్కులా తిరుగుతూ..
“ఏమిరా ఈ బేతాళుని గర్వము?! ఏడాదికి ఒక్కసారి వచ్చే ప్రభువులవారిని గౌరవించడం ఎలాగో తెలియనివాడా?! రాజు మంచితనం చూపిస్తే సేవకులందరూ నిద్రపోతూ ఉద్యోగాలు చేస్తారనే సామెతను నిజం చేశాడు. ఇంతకూ ఆ బేతాళుని దూతలెక్కడ?!” అని అరిచాడు.
అప్పటివరకు బిక్కుబిక్కుమంటూ ఊడలచాటున దాక్కుని ఉన్న తామ్రకేశుడు, తుందిలోదరుడు అనే బేతాళుని దూతలిద్దరూ.. అతని ముందుకు వచ్చి నిలబడ్డారు. వాళ్ల మెడల మీద చేయివేసి గెంటుకుంటూ భూతరాజు కాళ్లపై పడేశాడు పలలప్రియుడు.
“ఏమిరా! మీ ప్రభువెక్కడ?”.. అని హుంకరించాడు భూతరాజు.
“దేవా! మా బేతాళుల వారిని ఇటీవల విక్రమార్క మహారాజుగారు వశం చేసుకున్న సంగతి మీరు వినే ఉంటారు”.. అన్నారు వాళ్లిద్దరూ గజగజ వణికిపోతూ..
“అయితే?!”.
“విక్రమార్కులవారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా ప్రభువుల వారు వెళ్లి తీరాలి. ఇప్పుడు ఉజ్జయినిలో ఏవో పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటికి దేశదేశాల చక్రవర్తులు, సామంతులు వస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి నిర్వహించమని విక్రమార్కులవారు ఆజ్ఞాపించారు. అందువల్ల మా బేతాళుల వారు అక్కడికి వెళ్లక తప్పలేదు” అని చెప్పాడు తుందిలోదరుడు.
“నిజమే.. పరాధీనుడు యజమాని ఆజ్ఞలు పాటించక తప్పదు! అతని తప్పేమీ లేదు” అన్నాడు భూతరాజు.
“అంతమాత్రం చేత మీరు చెప్పిన పనిని విడిచిపెట్టలేదు ప్రభూ! అందుకు తగిన ఏర్పాట్లు చేశారు” అన్నాడు తామ్రకేశుడు.
“అయితే ఏదిరా రాచకన్య?!” అడిగాడు భూతరాజు మరోసారి హుంకరిస్తూ.
తామ్రకేశునికి పాపం ఇంకా వణుకు తగ్గలేదు. అంతలో తుందిలోదరుడు కల్పించుకుని..
“అదే విచిత్రం ప్రభూ! తమరు ఆలకిస్తామంటే వివరంగా చెప్పగలను” అని విన్నపం చేసుకున్నాడు.
“చెప్పి తగలడు” అన్నాడు భూతరాజు విసుగ్గా.
తుందిలోదరుడు చెప్పడం మొదలుపెట్టాడు.
“ఇక్కడికి దగ్గరలో సానుమంతమని ఒక పట్టణం ఉంది ప్రభూ! ఆ పట్టణాన్ని మందపాలుడనే రాజు పాలిస్తున్నాడు. అతనికి మాలతి అని బంగారుబొమ్మలాంటి కూతురుంది. ఆమెను ఇంద్రదత్తుడు అనే వాడికి ఇచ్చి పెళ్లిచేయాలని మందపాలుడు అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఆ పెళ్లి జరిగేలోగానే ఆమెను ఎత్తుకొచ్చి తమకు సమర్పించాలని బేతాళుల వారు మాకు ఆజ్ఞాపించారు. మేం వెళ్లేసరికి ఆమెచేత గౌరీపూజ చేయించడానికి గంపలో కూర్చోబెట్టారు. ఇంకా పూజ మొదలుకాలేదు. నేను ఆమెపై మత్తుమందు జల్లి.. గంపతోపాటే కోటమాటున ఒకచోట దాచిపెట్టాను. ఈ తామ్రకేశుడు నేను చెప్పినట్లు చేస్తున్నాడో లేదో అని మళ్లీ లోపలికెళ్లి చూడబోయాను. వీడు తన పని చక్కగానే చేస్తున్నాడు. ‘సరే’ అనుకుని మళ్లీ వెనక్కు వచ్చి చూసేసరికి గంపలేదు. పెళ్లికూతురు కూడా లేదు. ఆమెకోసం కోటంతా వెతికి వెతికి వేసారిపోయాను. ఎక్కడా ఆమె జాడలేదు” అని ఆగాడు తుందిలోదరుడు.
“అయితే నువ్వు వెళ్లకముందే ఎవరో దొంగలామెను ఎత్తుకుపోయి ఉండాలి. ఇంతకూ నువ్వు వాడికి ఏమని చెప్పావు?! వాడేం చేశాడు?!” అడిగాడు భూతరాజు.
“ఏముంది.. మాలతిలా వేషం వేసుకుని, ఇంద్రదత్తుణ్ని పెళ్లి చేసుకోమని చెప్పాను. వాడు అదే పనిచేశాడు. పెళ్లయిన వెంటనే వీణ్ని, ఇంద్రదత్తుణ్ని కలిపి కార్యం గదిలోకి తోశారు. వాడేమో తన పెళ్లామే అనుకుని, వీడితో సరసానికి దిగాడు. వీడు కూడా మర్యాదకోసం వాడికి.. కాసిన్ని నఖక్షతాలను, దంతక్షతాలను ప్రసాదించాడట. ఆ దెబ్బకు ఇంద్రదత్తుడు గగ్గోలు పెడుతూ ‘దయ్యం దయ్యం’ అని గోలపెట్టాడట. దాంతో ఆ ఇంద్రదత్తుణ్ని తన మాయాబలం చేత ఈ అడవికి తీసుకొచ్చి పీకనొక్కి చంపేశాడట. స్వామీ! మీ ఆనతి పాటించ లేకపోయినందుకు మమ్మల్ని మన్నించండి” అని జరిగిందంతా వివరంగా చెప్పి, వేడుకున్నాడు తుందిలోదరుడు.
“మంచి పనిచేశారు. తెల్లవారిపోతున్నది. కాళీపూజ గురించి రేపు చూసుకుందాం” అని భూతరాజు ఆ పూటకు సమావేశం ముగించాడు.
* * *
ఆకాశంలో సూర్యుడు రాగానే భూతప్రేత పిశాచాలన్నీ ఉన్నట్లుండి మాయమై పోయాయి. జరుగుతున్నదంతా చెట్టుకొమ్మల మీదనుంచి వాళ్లు ముగ్గురూ చూస్తూనే ఉన్నారు. చెట్టుదిగి, తొర్రలో ఉన్న అమ్మాయిని కిందికి దింపారు. అప్పటికే ఆమెకు మెలకువ వచ్చింది.
“ఎవరు మీరు?! నేనిక్కడికి ఎలా వచ్చాను?! రాత్రి నన్ను మావాళ్లు గంపలో కూర్చోబెట్టిన తరువాత ఏం జరిగిందో.. నాకు తెలియడం లేదు” అన్నదామె విచారంగా.
ఆమె మాటలకు వాళ్లు ముగ్గురూ ఏమీ సమాధానం చెప్పలేదు. తమ ఊతపదాలైన ‘అంతా విచిత్రమే’, ‘అంతా దైవాధీనం’, ‘ఎవరికెవరూ లేరు’ అనే మాటలనే మళ్లీమళ్లీ చెప్పసాగారు. వాళ్లమాటలకు అర్థమేమిటో తెలియక ఆమె తికమక పడింది. ఇంతలో అక్కడికి మందపాలుని సైన్యం బిలబిలమంటూ వచ్చింది.
“రాకుమారీ! ఇంద్రదత్తుల వారు ఎక్కడ?” అని ప్రశ్నించారు.
వాళ్ల మాటలకు ఆశ్చర్యపోతూ.. “ఏమో నాకేం తెలుసు?” అన్నది మాలతి.
“వీళ్లెవరు?” అని అడిగారు ఆ ముగ్గురినీ చూపించి.
“నన్ను రక్షించిన వాళ్లు” అని సమాధానం ఇచ్చింది మాలతి.
రాకుమారితోపాటు వాళ్లు ముగ్గురిని కూడా తమవెంట తీసుకుపోయారు భటులు. కూతురు దొరికిందన్న ఆనందంతో తల్లి వచ్చి కౌగిలించుకుంది.
“అమ్మాయీ! అల్లుడేడీ?” ప్రశ్నించాడు తండ్రి.
ఆ ప్రశ్నతో మరోసారి ఆశ్చర్యపోయింది మాలతి.
“నాకేం తెలుసు?” అని చెప్పింది మాలతి.
“అదేమిటమ్మా! నిన్న రాత్రి నిన్ను, అల్లుణ్ని కార్యం గదిలోకి పంపించాం. తెల్లవారిన తరువాత మీరిద్దరూ కనిపించక పోయేసరికి, ఎవరో దొంగలు ఎత్తుకెళ్లి ఉండొచ్చని నాలుగు దిక్కులకూ సైన్యాన్ని పంపారు మీ నాన్నగారు. మా అదృష్టం కొద్దీ మళ్లీ దొరికావు” అన్నది తల్లి.
“నిన్న నాకు పెళ్లయిందా?! ఏమో నాకు తెలియదు. నన్ను గంపలో కూర్చోబెట్టిన తరువాత ఏం జరిగిందో గుర్తులేదు. తెల్లవారి చూసేసరికి, బుట్టతోపాటే మర్రిచెట్టు తొర్రలో ఉన్నాను. మీరు నాకు పెళ్లి జరిపిస్తే, నేను కార్యంగదిలో నుంచి మాయమై ఉంటే.. ఆ బుట్ట ఎక్కడినుంచి వస్తుంది?!” అని ప్రశ్నించింది మాలతి.
ఈసారి ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతైంది. ఇంతలో ఒక సైన్యాధిపతి ముందుకు వచ్చి.. “అమ్మాయిగారితో పాటు వీళ్లు ముగ్గురు కూడా దొరికారు మహాప్రభూ!” అన్నాడు.
“ఎవరు మీరు? మా అల్లుణ్ని ఏం చేశారు?” అని ప్రశ్నించాడు మందపాలుడు.
వాళ్లు సమాధానం ఏమీ చెప్పలేదు. ఎప్పటిలాగే.. ‘అంతా విచిత్రం, అంతా దైవాధీనం, ఎవరికెవరూ లేరు’ అనే మాటలనే మళ్లీమళ్లీ చెప్పసాగారు. ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా ప్రశ్నించినా వాళ్లనుంచి మరో మాట రాలేదు.
విసిగిపోయిన మందపాలుడు భటులను ఉద్దేశించి..
“వీళ్లను బంధించండి. సరైన సమాధానం చెప్పేవరకు చిత్రహింస చేయండి. సమాధానం రాబట్టకపోతే మీకు మరణశిక్ష విధిస్తాను” అన్నాడు రౌద్రంగా.
“వద్దు నాన్నగారూ! వీళ్లు దుర్మార్గులు కాదు. నిజానికి వీళ్లే నన్ను రక్షించారు. నేరస్థులైతే మీరు వచ్చేలోగా నాకు ఏదో ఒక హాని తలపెట్టేవారు కదా!” అని బతిమాలింది మాలతి.
తన మనసులో మెదులుతున్న అనుమానాన్ని అప్పుడు బయటపెట్టాడు మందపాలుడు.
“నీకు తెలియదు తల్లీ! మొన్నరాత్రి ఈ ముగ్గురిలో ఒకరికిచ్చి నీ పెళ్లి చేశాను. నీ మీద ఆశతో వీళ్లే నిన్ను ఎత్తుకుపోయి ఉండొచ్చు” అన్నాడు.
ఆ మాటతో మాలతి హతాశురాలైపోయింది.
(వచ్చేవారం.. ఉత్తమ ఇల్లాలు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు
Kasi Majili Kathalu | ఎగిరే జింక-2
Kasi Majili Kathalu | ఎగిరే జింక
Kasi Majili Kathalu | జయభద్రుని తెలివి
Kasi Majili Kathalu | నీతిమంతురాలు