ఆగస్టు 15 నుంచి రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణమాఫీకి సబంధించిన వివరాలను ఆర్థిక శాఖ.. కేబినెట్ ముందుంచింది. తెలంగాణ పత్తికి ప్రత్యేక డిమాండ్ ఉన్న దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. భవిష్యత్తులో రాష్ట్రంలో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
ఈ నెల 2న సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాగర్ నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్పోర్టుకు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:40 నిమిషాలకు హాలియా చేరుకుంటారు. ఉ. 10:55కు స్థానికంగా ఉన్న మార్కెట్యార్డులో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:10 నిమిషాలకు ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో కేసీఆర్ లంచ్ చేస్తారు. అనంతరం 2:10 నిమిషాలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.
జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా జరిగాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.
కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్కు భారీగా ఇన్ ఫ్లో వస్తున్నది. ఇప్పటికే నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం.. దాదాపు 5,18,724 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు 14 క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు 1,05,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో గెలిచి కాంస్య పతకం గెలుచుకుంది. 2016 రియో ఒలింపిక్స్లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పివీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
పీవీ సింధుపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. సింధు దేశానికే గర్వకారణం.. అత్యద్భుతమైన ఒలింపియన్లలో ఆమె కూడా ఒకరు అని మోదీ ట్వీట్ చేశారు. నిలకడకు, అంకితభావానికి ఆమె మారుపేరుగా నిలుస్తోందని రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మణ్ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్పై విజయం సాధించింది.
ఒలింపిక్సలో 100 మీటర్ల పరుగులో ఉస్సేన్ బోల్ట్ తర్వాత కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటలీకి చెందిన లామంట్ మార్సెల్ జాకబ్స్ 9.8 సెకన్లలో రేసు పూర్తి చేసి ఒలింపిక్ చాంపియన్గా నిలిచాడు. ఇది యురోపియన్ రికార్డు కావడం విశేషం. ఇక అమెరికాకు చెందిన ఫ్రెడ్ కెర్లీ 9.84 సెకన్లతో రెండోస్థానంలో, కెనడాకు చెందిన ఆండ్రీ డి గ్రాస్ 9.89 సెకన్లలో మూడోస్థానంలో నిలిచారు.
ఐరాస( ఐక్య రాజ్య సమితి ) భద్రతా మండలిలో భారత్కు ఆగస్టు నెల అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్ నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది.