న్యూఢిల్లీ : ఐరాస( ఐక్య రాజ్య సమితి ) భద్రతా మండలిలో భారత్కు ఆగస్టు నెల అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్ నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఐరాస భద్రతా మండలిలో నెలకొక దేశం అధ్యక్ష బాధ్యతల నిర్వహణ చేపడుతుంది. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు అధ్యక్ష బాధ్యతలను చేపడుతున్నాయి. 2021-22 ఏడాదికి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబర్లోనూ భారత్ మరోమారు అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.
సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద కట్టడిపై దృష్టి సారిస్తామని భారత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. ఆయా అంశాలపై ఈ నెలలోనే సంతకాల సేకరణ చేపడుతామని ప్రకటించారు. సభ్య దేశాలతో భారత్ సమన్వయంతో పని చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించారు.