గత 17 ఏండ్లలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ‘బిల్ట్ అప్ ఏరియా’ పెరుగగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్ వంటి రాష్ర్టాల్లో స్థిరంగా నిర్మాణాలు పెరిగినట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
India | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ‘భూమి కరుగుతున్నది.. ఊరు పెరుగుతున్నది..’ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఇదే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు పెరగడం, మౌలిక వసతుల కల్పన, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ.. ఇలా కారణం ఏదయినా గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా ‘బిల్ట్ అప్ ఏరియా’ (నిర్మాణాలు) భారీగా పెరిగింది. 2005-06 నుంచి 2022-23 వరకు జరిగిన నిర్మాణాలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), ఇస్రో సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి తాజాగా ఓ నివేదికను విడుదల చేశాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన తదితర చర్యల ఫలితంగా గత 17 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 2.5 మిలియన్ హెక్టార్లకుపైగా (61.77 లక్షల ఎకరాల) విస్తీర్ణంలో నిర్మాణాలు జరిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది. భవనాలు (రూఫ్డ్ స్ట్రక్చర్లు), రోడ్లు, పార్కింగ్ (పేవ్డ్ సర్ఫేసెస్), కమర్షియల్, ఇండస్ట్రియల్ సైట్లు (పోర్టులు, ల్యాండ్ ఫిల్స్, క్వారీలు, రన్వేలు) లాంటి వాటిని బిల్ట్ అప్ ఏరియాగా.. పార్కులు, గార్డెన్లను అర్బన్ గ్రీన్ పార్కులుగా పేర్కొన్నది. బహుళ అంతస్థుల భవనాల రూపంలో తక్కువ స్థలంలోనే అధిక ‘బిల్ట్ అప్ ఏరియా’ అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది.
బహుళ అంతస్థుల భవనాల్లో నిలువుగా అందుబాటులోకి వచ్చిన విస్తీర్ణాన్ని మినహాయిస్తే గత 17 సంవత్సరాల్లో నిర్మాణాల కోసం మొత్తం 21 లక్షల ఎకరాలకుపైగా భూమి వినియోగం జరిగినట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే రోజుకు సుమారు 350 ఎకరాల భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇందులో 35 శాతం (7.5 లక్షల ఎకరాలు) వ్యవసాయానికి పనికిరాని భూములు, మిగతా 65 శాతం (14 లక్షల ఎకరాలు) పంట భూములు ఉన్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే.. 14 లక్షల ఎకరాల పొలాలు కాంక్రీట్ జంగల్గా మారిపోయాయన్న మాట.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటికేడు మూలధన వ్యయాన్ని (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) పెంచడం వల్ల ‘బిల్ట్ అప్ ఏరియా’ పెరిగినట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2005-06లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూలధన వ్యయం కింద రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేయగా.. 2022-23 నాటికి ఈ వ్యయం ఏకంగా రూ.11.92 లక్షల కోట్లకు పెరిగింది. ముఖ్యంగా 2019-23 మధ్య కాలంలో మూలధన వ్యయం భారీగా పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిధులతో రోడ్లు, రైలు మార్గాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రధానంగా జాతీయ రహదారులు నిర్మించినట్టు నివేదికలు చెప్తున్నాయి.
దేశంలో నిర్మాణాలు శరవేగంగా పెరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక శాతం నిర్మాణాలు క్రమపద్ధతిలో కాకుండా విచ్చలవిడిగా జరుగుతుండటంతో సమతుల్యత దెబ్బతింటున్నదని, దీని వల్ల గత 17 ఏండ్లలో సుమారు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కోల్పోయామని అంటున్నారు. మరోవైపు దాదాపు 14 లక్షల ఎకరాల పంట భూముల్లో నిర్మాణాలు జరగడంతో లక్షల మంది రైతులు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని చెప్తున్నారు. ఇది పంట దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నదని, ఫలితంగా ఆహార ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తక్కువ స్థలంలో ఎక్కువ ‘బిల్ట్ అప్ ఏరియా’ను అందుబాటులోకి తేవాలని, నిర్మాణాలు క్రమపద్ధతిలో జరిగేలా చూడాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.