నల్లగొండ : కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవడం.. దాదాపు 5,18,724 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు 14 క్రస్టుగేట్లు ఎత్తి దిగువకు 1,05,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి 590 అడుగుల కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. సాగర్ పూర్తిస్థాయినీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 282.1472 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 5,00,647 క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 5,17,502 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 883.40 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 206.9734 టీఎంసీలకి చేరింది. శ్రీశైలం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీరు విడుదల చేస్తున్నారు.