కరీంనగర్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి/ రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ): సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతున్నది. ఐదునెలల హస్తం పాలనలో, జీవనాధారం కరువై నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే ఆకలిచావులు ఆరంభమయ్యాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసే అద్భుత ప్రతిభ గల మన నేతన్నలపై ఆనాటి సమైక్య రాష్ట్రం ఆదరణ చూపకపోవడంతో.. సిరిసిల్ల మరణ మృదంగమైన విషయం తెలిసిందే. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నేతన్నల కష్టాలు, కన్నీళ్లను తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు మళ్లీ చీకట్లు అలుముకుంటున్నాయి. చేతినిండా పని కల్పించకపోగా, ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించక పోవడంతో బతుకులు భారంగా మారి నూలు పోగునే ఉరితాడుగా మార్చుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. రెండు రోజుల్లో ముగ్గురు కార్మికులు చనిపోవడం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
2004 నుంచి 2014 మధ్య ఆనాటి కాంగ్రెస్ పాలనలో నేతన్నల మరణాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పాలకుల నిర్లక్ష్యమే వందలాది మంది కార్మికుల ఊపిరి ఆగేందుకు కారణమైంది. చనిపోయినప్పుడు సానుభూతి చూపడం, ఎన్నికలు రాగానే వరాలు కురిపించి ఓట్లు దండుకోవడం ఆ తదుపరి మాట మరిచి పట్టించుకోకపోవడం ఆనాటి సీమాంధ్ర సర్కారు పాలకుల నైజంగా మారింది. రెండో షోలాపూర్గా ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల పరిశ్రమపై అడుగడుగునా నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా నాటి కాంగ్రెస్ పాలనలో 402 మంది నేతన్నలు బలవర్మణానికి పాల్పడ్డారు. 2007-08లో సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో వైఎస్ 2008 అక్టోబర్ 12న సిరిసిల్లలో బహిరంగ సభ పెట్టారు. సిరిసిల్లను స్పెషల్ ఎకనామిక్ జోన్గా చేస్తామని, వస్ర్తాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని, అప్పారెల్ పార్కు ఏర్పాటు చేస్తామని, తదితర హామీల వర్షం కురిపించారు. కానీ 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్ల నేతన్నల్లో కేసీఆర్ సర్కారు ఊపిరి నిలిపింది. సమైక్య రాష్ట్రంలో అలుముకున్న చీకట్లను తొలగిస్తూ.. నేతన్నలకు అండగా నిలిచింది. పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నేతన్నల వేతనాలు, కూలి రెట్టింపయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదించుకునేలా పటిష్టమైన కార్యాచరణను రూపొందించి అమలు చేశారు. అలాగే, అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిని అమలు చేయడానికి బడ్జెట్ను కేటాయించారు. ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కింద దుస్తులకు సంబంధించిన ఆర్డర్లను నేతన్నలకు ఇచ్చింది. కులవృత్తిని ప్రోత్సహిస్తూనే.. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మగ్గాల ఆధునికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్తో అనుసంధానం వంటి కార్యక్రమాలను అమలు చేసింది. వీటితో పాటు.. బతుకమ్మ చీరెల పథకాన్ని అమల్లోకి తెచ్చి వాటి ఆర్డర్లను కూడా నేతన్నలకు అందించింది. ఫలితంగా కార్మికులకు చేతి నిండా పని దొరికింది. అక్కడితో ఆగకుండా రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్ర్తాల ఆర్డర్లు కూడా వారికి అందించింది. దీంతో సాంచాల పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసింది. పవర్ లూమ్లను ఆధునికీకరించుకునేందుకు సబ్సిడీపై రుణాలు ఇచ్చి వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. వీటికితోడు నేతన్నకు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు కేసీఆర్. దీంతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నేతన్నల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పడుతున్న అవస్థలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల వంటి అంశాలను పేర్కొంటూ ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేనేత సమస్యలపై కేటీఆర్ లేఖ రాశారు. అయినా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకెళ్తున్నది.
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నేతన్నలకు రూ.3 వేల కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చి అండగా నిలిచింది. యారన్ సబ్సిడీ రూ. 32.67 కోట్లు కార్మికులకు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే నేతన్నలపై కక్ష సాధింపు మొదలైంది. ఆర్డర్లను నిలిపివేసింది. దీంతో కార్మికులు నిరసనలు చేపట్టారు. ఆ మేరకు అత్తెసరుగా రూ.50 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో ఆ ఆర్డర్ల పనులు మూడునాళ్ల ముచ్చటే అయ్యాయి. ఆ తర్వాత ఆర్డర్లు ఇవ్వకపోవడంతో సిరిసిల్లలో దాదాపు 30 వేల మరమగ్గాలు మూతపడ్డాయి. ఇందులో పనిచేసే 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇటీవల రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లలో మాట్లాడుతూ గత ప్రభుత్వానికన్నా మెరుగైన ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని, పెండింగ్ బకాయిలు కూడా దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. నేటి వరకు అందులో ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దీంతో మళ్లీ చీకటి రోజులు వచ్చాయని నేతన్నలు ఆవేదనకు లోనై, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
నా భర్త పేరు రాజు. మాకు కొడుకు, బిడ్డ ఉన్నరు. మాకు మూడు జోడీల సాంచాలుండె. అవి నడవక, పెట్టుబడి ఎల్లక అప్పుల పాలైనం. ఏడాది కింద సాంచాలు అమ్మి కట్టినం. నాభర్త రాజు ఓ సేటు దగ్గర సాంచాలు నడిపిస్తూ మమ్మల్ని సాకిండు. బిడ్డ, కొడుకును మంచిగ చదివిస్తనంటుండే. కొత్తగొచ్చిన సర్కారు ఆర్డర్లు ఇయ్యలే. పోయిన బతుకమ్మకు తయారు చేసిన చీరల పైసలు కూడా ఇయ్యలేదని సేట్లు సాంచాలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఏదైనా పని చూసుకుంటానని పదిహేను రోజుల కింద పోయిన
మనిషి శవమై వచ్చిండు. పని దొరక్క, తిండిలేక నాభర్త చనిపోయిండు.
– ఆత్మహత్య చేసుకున్న ఈగ రాజు భార్య రేఖ
నాకు భార్య నిర్మల, ఇద్దరు కొడుకులు. దిలీప్(22), ఆదిత్య. నేను సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. పెద్ద కొడుకు దిలీప్ మరమగ్గాల భీములు నింపే వార్పర్గా పనిచేస్తూ కుటుంబ పోషణలో నాకు ఆసరయ్యేటోడు. చిన్నోడు ఆదిత్య ఇంటర్ చదువుతున్నడు. గతేడాది ఆగస్టు నెలలో అనారోగ్యం బారిన పడిండు. దవాఖానలో చేర్పించినం. చికిత్స పొందుతూ నాలుగు రోజులకు చనిపోయిండు. చికిత్సకు రూ.2.50 లక్షల దాకా ఖర్చయ్యింది. అయినా బతుకలేదు. కేసీఆర్ కల్పించిన నేతన్న బీమా కింద రూ.5 లక్షలు వచ్చినయ్. ఆడబ్బులే మమ్మల్ని ఆదుకున్నయ్. నేను ఏండ్ల సంది సాంచాలు నడుపుతున్న. ఒకప్పుడు పన్నెండు సాంచాలు నడిపించినా నెలకు రూ.10 వేలు కూడా రాలేదు. బతుకమ్మ చీరెలు నడిపితే నెలకు రూ.15 నుంచి రూ.20 వేలు వచ్చినయ్. యారన్ సబ్సిడీ, త్రిప్టు పథకాలు మాకు అండగా నిలిచినయ్. ఆ పథకాలను అలాగే కొనసాగించాలి.
– దూడం లక్ష్మణ్, నేత కార్మికుడు, ఇందిరానగర్, సిరిసిల్ల
కేసీఆర్ ఉన్నప్పుడు నా కొడుకు సాయి బతుకమ్మ చీరెల బీములు నింపిండు. పదేండ్లు చేతినిండా పని ఉండి, తగ్గట్టు కూలి వచ్చింది. పక్షవాతం వచ్చి మంచాన పడ్డ నా భర్త కైలాసంను, నన్ను పోషించిండు. గిప్పుడు కాంగ్రెస్ సర్కారోళ్లు ఆర్డర్లు ఇత్తలేరని సేట్లు సాంచాలు బంద్ పెట్టిండ్రు. నాలుగు నెలల నుంచి పనిలేక ఇంట్లనే ఉంటుండు. పరిస్థితి సూసి సాయి ఏమనుకున్నడో ఏమో. కూలిపోయిన ఇంటోకి పోయి ఉరేసుకున్నడు. చెట్టంత కొడుకు మాకు దూరమైతడని అనుకోలే.
– అడిశర్ల పద్మ (చనిపోయిన సాయి తల్లి)
పదేండ్ల కేసీఆర్ పాలనలో కార్మికులకు చేతినిండా పని దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్రమాలు జరిగాయంటూ వస్త్ర తయారీ ఆర్డర్లు నిలిపివేసింది. పెండింగ్ బకాయిలు రూ.300 కోట్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు యథాతథంగా కొనసాగించాలని, ఆర్డర్లు ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించాం. నాలుగు నెలలుగా పరిశ్రమ బంద్ ఉన్నందున కార్మికులు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకుంటున్నరు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.50కోట్లు యజమానుల ఖాతాలో వేయకుండా ఆసాములకు ఇచ్చి ఇరువురి మధ్య చిచ్చు పెట్టిండ్రు. పరిశ్రమను మూసివేసేందుకు కుట్ర పన్నుతున్నరు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.
– మూషం రమేశ్, పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
1.తడుక శ్రీనివాస్ (మరమగ్గాల కార్మికుడు)
చనిపోయిన తేదీ : 11-3-2024, బీవైనగర్, సిరిసిల్ల
2.సిరిపురం లక్ష్మీనారాయణ (62) (మరమగ్గాల కార్మికుడు)
మరణం: 6-4-2024, రాజీవ్నగర్, సిరిసిల్ల
3.ఈగ రాజు (45)(మరమగ్గాల కార్మికుడు)
మరణం: 22-4-2024, నెహ్రూనగర్, సిరిసిల్ల
4.అంకారపు మల్లేశం (60) (మరమగ్గాల కార్మికుడు)
మరణం: 25-04-2024
ఇందిరానగర్, తంగళ్లపల్లి మండలం
5.అడిశర్ల సాయి (26) (వార్పిన్ కార్మికుడు)
మరణం: 25-4-2024