న్యూఢిల్లీ, జూలై 29: ప్రశ్న పత్రాల లీకేజ్ని అరికట్టే చట్టంలో సమూల మార్పులు చేస్తూ నేరస్తులకు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా వంటి కఠినమైన శిక్షలను నిర్దేశించే ప్రభుత్వ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026ను లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. గత వారం విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వాగ్వాదం జరిగిన అనంతరం విపక్ష పార్టీల నినాదాల నడుమ ఈ బిల్లు ఆమోదం పొందింది. సీజేపీ నేతృత్వంలో జరిగిన విద్యార్థి నిరసనల కారణంగా విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయల్సి వచ్చిన కొద్ది రోజులకే మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. అంతకుముందు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. నిరసనల సందర్భంగా విద్యార్థులపై బలప్రయోగం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారని రాహుల్ ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ఈ ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
అమిత్ షాను తొలగించండి
విద్యార్థి నిరసనకారులపై అమిత్ షా బలప్రయోగానికి ఆదేశించారని ఆరోపిస్తూ తాను లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ బుధవారం నిరాకరించారు. అంతేగాక అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు.