ముంబై: మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్పై ప్రశ్నల వర్షం కురిపించింది బాంబే హైకోర్టు. హోంమంత్రిపై ఆరోపణలు చేశారు మరి ఎఫ్ఐఆర్ ఎక్కడ? మీకోసం చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టాలి? పోలీస్ అధికారులు, మంత్రులు, రాజకీయ నాయకులు ఏమైనా చట్టం కంటే ఎక్కువా? మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోకండి. చట్టమే మీ కంటే ఎక్కువ అని బాంబే హైకోర్టు బుధవారం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పరమ్బీర్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పరమ్బీర్పై ప్రశ్నల వర్షం కురిపించింది.
ముంబై కమిషనర్ పదవి నుంచి తప్పించి హోంగార్డ్స్ శాఖకు మార్చిన తర్వాత పరమ్బీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హోంమంత్రి వసూళ్లకు ఆదేశించినట్లు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని పరమ్బీర్ చెప్పగా.. మరి విచారణ జరపడానికి ఎఫ్ఐఆర్ ఉండాలి కదా. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? ఎఫ్ఐఆర్ లేకుండా విచారణ ఎలా జరుపుతారు అని విచారణ జరిపిన జస్టిస్ సీజే దత్తా అన్నారు. అసలు ఎఫ్ఐఆర్, విచారణ లేకుండానే దానిని సీబీఐకి అప్పగించాలని ఎలా అడుగుతారని కూడా పరమ్బీర్ను ప్రశ్నించారు.
సీఎంకు లేఖ రాస్తే చాలా?
కేవలం ఓ లేఖ కూడా పిల్ అవుతుంది కదా అని పరమ్బీర్ సింగ్ వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. మీరు ఓ పోలీస్ ఆఫీసర్. ఏదైనా నేరం జరిగిందని తెలిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీ కర్తవ్యం. మీరు ఆ పని ఎందుకు చేయలేదు? ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే మీరు విధులు నిర్వర్తించడంలో విఫలమైనట్లే. ముఖ్యమంత్రికి లేఖలు రాసినంత మాత్రాన సరిపోదు అని తీవ్రంగా స్పందించింది. ఎవరైనా అధికారులు తమకు హోంమంత్రి ఇలా ఆదేశించారని చెప్పినట్లు అఫిడవిట్ ఏమైనా ఉందా అని కూడా ప్రశ్నించింది. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఇక ఎవరి దగ్గరికి వెళ్లాలో తనకు అర్థం కాలేదని పరమ్బీర్ చెప్పారు. ఈ కేసులో కోర్టు ఇంకా తీర్పు వెల్లడించలేదు. వాదనలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..