న్యూయార్క్: చరిత్రలో తొలిసారి నలుగురు సాధారణ పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతున్న స్పేస్ఫ్లైట్లో సీట్లన్నీ నిండిపోయాయి. స్పేస్ఎక్స్ లాంచ్ చేయబోతున్న ఈ స్పేస్ఫ్లైట్లో వెళ్లబోయే మరో ఇద్దరు ప్రయాణికులను మంగళవారం పరిచయం చేశారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమింగ్లో స్పేస్ఎక్స్ హ్యూమన్ స్పేస్ఫ్లైట్ చీఫ్ బెంజీ రీడ్ ఈ ఇద్దరినీ పరిచయం చేశారు. ఓ చారిటీ కోసం ఈ స్పేస్ఫ్లైట్ మిషన్ను చేపట్టిన బిలియనీర్, ఇ-కామర్స్ సంస్థ షిఫ్ట్4 సీఈవో జేర్డ్ ఐజాక్మ్యాన్ కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ స్పేస్ఫ్లైట్లో తనతోపాటు మరో ముగ్గురిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు స్పేస్ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్కు ఐజాక్మ్యాన్ భారీ మొత్తం చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఈ ఏడాది సెప్టెంబర్ 15 తర్వాత నింగిలోకి దూసుకెళ్లనుంది. నింగిలోకి వెళ్లి, మళ్లీ భూమికి తిరిగి వచ్చే ఈ మిషన్కు మొత్తం 3 నుంచి 4 రోజుల పట్టనుంది. ఈ మిషన్కు ఇన్స్పిరేషన్4 అనే పేరు పెట్టారు. సెయింట్ జూడ్స్ చిల్డ్రన్ రీసెర్చ్ హాస్పిటల్ గురించి అవగాహన కల్పించి, దానికి నిధులు సమకూర్చే ఉద్దేశంతో ఐజాక్మ్యాన్ ఈ మిషన్ చేపట్టారు. ఆయన వ్యక్తిగతంగా దీనికి 10 కోట్ల డాలర్లు ఇచ్చారు.
ఈ మిషన్ కమాండర్గా ఉన్న ఐజాక్మ్యాన్.. ఈ ఆసుపత్రికే చెందిన ఫిజిషియన్ హేలీ ఆర్సెనీక్స్ను తన తొలి ప్రయాణికురాలిగా ఎంచుకున్నారు. ఇక మంగళవారం ప్రకటించిన వాళ్లలో ఏరోస్పేస్ ఉద్యోగి క్రిస్ సెంబ్రోస్కీ ఒకరు కాగా, మరొకరు జియోసైన్స్ ప్రొఫెసర్ సియాన్ ప్రోక్టర్. ఐజాక్మ్యాన్తో కలిపి మొత్తం నలుగురు స్పేస్ఎక్స్కు చెందిన స్పేస్ఫ్లైట్లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి..