శ్రీనగర్: జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది. వాహనంలో ఉన్న నలుగురు కార్మికులు మృత్యువాతపడగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఘటనలో వాహనంలో ఉన్న మరికొందరు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన కార్మికులను జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్లేందుకు ఓ వాహనంలో ఎక్కించారు.
ఉదయం 6 గంటల సమయంలో వాహనం రాంబన్ జిల్లాలోని ఖూని నాలా ప్రాంతంలో జాతీయ 44వ నెంబర్ రహదారిపై ఉన్న లోతైన లోయలో పడిపోయింది. అయితే, ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన కార్మికుల కోసం గాలిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.