పనాజీ : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన గోవాలోని జువారీనగర్లోని అమన్కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. ముగ్గురు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారని పేర్కొన్నారు. మృతులను ఉల్గప్ప (30), గంగప్ప (25), ఉల్గప్ప భార్య దేవమ్మ (23)గా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. అయితే, ఉరి వేసుకోవడంతోనే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యుడు ధ్రువీకరించారు.
సెక్షన్ 174 సీఆర్పీసీ కింద అసహజ మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పంకజ్ సింగ్ తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, దొంగతనం కేసులో పోలీసుల వేధింపులతోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు ఆరోపించారు. అయితే, పోలీసులు వారిని ఎప్పుడూ అదుపులోకి తీసుకోలేదని ఖండించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళపై గత వారం కిందట వెర్నా పోలీస్స్టేషన్లో ఆభరణాల దొంగతనం కింద కేసు నమోదైంది. ఓ ఇంట్లో పని చేస్తుండగా.. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.