యాదాద్రి భువనగిరి, జూలై 10 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు క్యామ మల్లేశ్, చింతల వెంకటేశ్వర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, తుంగ బాలుతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి పాట పాడారు.
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు : గొంగిడి
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని, కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు కాళేశ్వరం ఉన్నదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఎంత చెప్పినా ఈ విషయం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తలకెక్కడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ను బదనాం చేయడం సరికాదని అన్నారు. కన్నెపల్లి పంప్హౌస్ వద్ద 93.3 స్కేల్ లెవల్ ఉన్నప్పటికీ నీటిని తోడుకోవచ్చని, కానీ అక్కడ 98.5 లెవల్ ఉన్నట్టు తెలిపారు. రోజుకు టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్రెడ్డి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బస్వాపూర్ రిజర్వాయర్లోకి కాళేశ్వరం నీటిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు కూడా సాగునీటి తీవ్రం కానున్నదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు క్యామ మల్లేశ్, చింతల వెంకటేశ్వర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.