తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ సర్వర్లు మంగళవారం మొరాయించాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. పరిమిత సంఖ్యలోనే దర్శన టికెట్లు అందుబాటులో ఉండడంతో హిట్లు భారీగా పెరిగాయి. ఊహించని రీతిలో కెపాసిటీకి మించి హిట్లు రావడంతో సర్వర్లు మొరాయించాయి. దీంతో కొద్ది సేపు ఆగస్టు మాసానికి సంబంధించి టికెట్ల విక్రయం నిలిచిపోయింది.
ప్రస్తుతం సర్వర్ పునరుద్ధరించగా.. టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. అయితే, 17 నుంచి 20తేదీల మధ్య టికెట్లను టీటీడీ విడుదల చేయలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ప్రవేశం ద్వారా మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిపిస్తోంది. ప్రతి రోజు నిత్యం 5వేల టికెట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లను నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తున్నారు.