బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ సదర్ నగరంలోని సోమవారం మార్కెట్లో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. మార్కెట్లో బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగకు పెద్ద ఎత్తున జనం మార్కెట్లకు రాగా.. అదును చూసి ఉగ్రవాదులు బాంబు పేల్చారు. అప్పటి వరకు కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దుకాణాలు మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎటు చూసినా రక్తపు మరకలు.. బాధితుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనలో 60 మంది వరకు గాయపడ్డారని, ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి కొన్ని దుకాణాలు కాలిబూడిదయ్యాయి. స్థానికంగా తయారు చేసిన ఐఈడీతోనే ఉగ్రవాద దాడి జరిగిందని ఇరాక్ అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాడి ఘటనపై ఇరాక్ అధ్యక్షుడు బర్హామ్ సలీమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ఇరాక్లో ఇదో విచారకరమైన రోజన్నారు. అయితే, పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.