JD Vance : పశ్చిమాసియా (West Asia) లో శాశ్వత శాంతి స్థాపన దిశగా మరో ముందడుగు పడిందని అమెరికా ఉపాధ్యక్షుడు (USA Vice President) జేడీ వాన్స్ (JD Vance) అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకడమే లక్ష్యంగా ఆ దేశంతో జరిపిన చర్చలు తుది ఒప్పందానికి మంచి పునాది వేశాయని చెప్పారు. దీనివల్ల అమెరికా ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తమ సోయా, మొక్కజొన్న, గోధుమలను టెహ్రాన్ కొనుగోలు చేస్తే దానికి బదులుగా విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు విడిపిస్తామని పేర్కొన్నారు.
తాము చేసుకున్న ప్రాథమిక ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉందో లేదో ధ్రువీకరించడానికి ఐక్యరాజ్యసమితి అణు తనిఖీ అధికారులు ఇరాన్ను సందర్శిస్తారని వాన్స్ తెలిపారు. లెబనాన్ విషయంలో సరైన సమన్వయం ఉండేలా ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో తమ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ తెరిచే ఉందని, జలసంధి మీదుగా నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అన్నారు.
పాక్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు అవగాహన ఒప్పందంలో ముందడుగు వేశాయని ఇరాన్ (Iran) అధికారులు వెల్లడించారు. పాక్ నేతలు లేకపోతే ఒప్పందం ముందుకు సాగడం కష్టతరంగా మారేదని, మళ్లీ ఘర్షణలు తలెత్తేవని పేర్కొన్నారు. రాబోయే 60 రోజుల్లో ఒక సమగ్ర ఒప్పందానికి ఎలా చేరుకోవాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. చర్చల ద్వారానే దౌత్యపరమైన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.