రాంచి : జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ విద్యార్థుల నిరసనలు ఆదివారంతో 23వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనల వ్యూహాన్ని మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సీఎం హేమంత్ సోరెన్ రాజీనామాను కోరుతామని హెచ్చరించారు. అంతే కాకుండా ఆగస్టు 20న సీఎం ఇంటికి మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో నిరసనలు మరో మలుపు తిరిగాయి. ఆగస్టు 10న నిర్వహించిన అసెంబ్లీ మార్చ్లో విద్యార్థులపై పోలీసులు వాటర్ కానన్లు, టియర్ గ్యాస్ వినియోగించడంతో పాటు లాఠీ చార్జ్ చేయడంతో అప్పటి నుంచే నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారిలో ఒకరైన పియూష్ సింగ్ మాట్లాడుతూ స్టూడెంట్లు నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్టు చెప్పారు.
జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయడం, జేపీఎస్సీ 11వ, 13వ పరీక్షలను రద్దు చేయడంతో పాటు టీడీపీఎల్ సంస్థతో సంబంధం ఉన్న అన్ని పరీక్షలను రద్దు చేసి ప్రస్తుతం జరుగుతున్న విచారణలను సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారని వెల్లడించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆగస్టు 20న అసలు సినిమా ఉంటుందన్నారు. సీఎం రాజీనామాను కోరుతామని హెచ్చరించారు. అయితే జేపీఎస్సీకి సంబంధించిన మూడు పరీక్షలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీజీఎల్ కు సంబంధించిన పరీక్షను రద్దు చేయడం కుదరదని.. అది కోర్టుల పరిధిలో ఉందని ఓ మంత్రి పేర్కొన్నారు. సీఎం ఇల్లు ముట్టడి ప్రకటన నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
అంతకు ముందు విద్యార్థులు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాహుల్ గాంధీ, సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల్లో ఒకరైన ప్రేమ్ నాయక్ ఆదివారం మాట్లాడుతూ 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నానని ఎక్కువ కాలం బతికేలా లేనని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. చివరిదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు.
పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను జార్ఖండ్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఒక ప్రభుత్వ అధికారి ధ్రువీకరించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ చర్చలుంటాయని, విద్యార్థులు తమ న్యాయ సలహాదారుతో కలిసి పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్టు అధికారి చెప్పారు.
నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్ స్పందిస్తూ.. చర్చలకు తాము సిద్ధమేనని.. కాకపోతే డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. న్యాయ సలహాదారు సమక్షంలోనే చర్చలు జరుపు తామనారు. ఇప్పటికే ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఆరుసార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. విద్యార్థులు తగ్గకపోవడంతో ప్రభుత్వం డిమాండ్లకు ఒప్పుకొం టుందా లేదా చూడాలి.