Ponguleti : సెక్షన్ 22ఏ భూముల విషయంలో చెలరేగిన వివాదంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అధికారుల వల్లే తప్పు జరిగిందని, వారి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ వివాదానికి అధికారులే కారణమంటూ తప్పిదాన్ని వారిపై తోసే ప్రయత్నం చేశారు.
ప్రైవేటు భూముల్ని నిషేధిత సెక్షన్ 22ఏ కింద చేర్చారంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి దీనిపై 750 దరఖాస్తులు వచ్చాయన్నారు. తమ భూముల్ని అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. దీంతో ఈ అంశంపై నాలుగు జిల్లాల అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ‘‘సెక్షన్ 22ఏ భూములపై మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో చర్చలు జరిపాం. ప్రస్తుతం ఈ జాబితాలో చేర్చిన భూములు గతంలో యూఎల్సీ జాబితాలో ఉండేవి. అయితే, నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసే క్రమంలో పొరపాటు జరిగింది. ఇది అధికారుల నుంచి జరిగిన పొరపాటు. వారి తరఫున మేం క్షమాపణలు కోరుతున్నాం.
ప్రైవేటు ఆస్తుల్ని వెంటనే 22ఏ జాబితా నుంచి తొలగిస్తాం. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు 1800 5994788 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లోగా స్పందిస్తాం. ఒకవేళ ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వారికి అందజేస్తాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే.. వారికి తిరిగి రీఫండ్ చేస్తాం’’ అంటూ పొంగులేటి వివరణ ఇచ్చారు.