హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ వివిధ పద్దుల కింద భారీగా నిధులు విడుదలచేసింది. సోమవారం ఒక్కరోజే రూ.606 కోట్ల 40 లక్షల 61 వేలను విడుదలచేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. వీటిలో అత్యధికంగా కల్యాణలక్ష్మి పథకానికి రూ.462.50 కోట్లు ఉండటం విశేషం. మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో నిర్వహించే గురుకుల పాఠశాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు రూ.140.99 కోట్లను మంజూరుచేశారు. కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్కు రూ.92, 61,000, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం శాయంపేట పరిధిలో నిర్మించే మచ్చదేవ కల్చరల్ కాంప్లెక్స్కు రూ.1.99 కోట్లను విడుదలచేశారు.