ప్రతి ఒక్కరూ తమ పాపకర్మలనుండి విముక్తులై తన దివ్యసన్నిధానాన్ని చేరడానికి ప్రతి ఏడూ వచ్చే ‘తొలి ఏకాదశి’ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా శ్రీకృష్ణుడు సూచించాడు. ‘భవిష్యోత్తర’ పురాణంలో ఈ ఏకాదశి విశేషాలు ఉన్నాయి. ఆషాఢశుక్ల ఏకాదశి మహిమను, వ్రతవిధి విధానాలను తెలుపవలసిందిగా యుధిష్టిర మహారాజు శ్రీకృష్ణుడిని కోరతాడు. దేవాదిదేవుని పలుకుల ప్రకారం, “ఒకానొకసారి నారద ముని కూడా బ్రహ్మదేవునితో ‘శయని ఏకాదశి’ విశిష్టతను తెలుపమని కోరాడు. మానవాళికి సర్వ శుభాల్ని చేకూర్చే ఈ ఏకాదశి గురించి తప్పక వివరిస్తానని బ్రహ్మదేవులవారు ఇలా వివరించారు. ‘ఈ ఏకాదశినాడు ఉపవాసం ఆచరించినవారు సమస్త పాపాలనుంచి విముక్తులవడమేకాక వారి అన్ని అభీష్టాలనూ నెరవేర్చుకొన్న వారవుతారు. ఓ నారదా! ఈ ఏకాదశికి సంబంధించి శాస్ర్తాలలో తెలిపిన ఒక అద్భుతమైన చారిత్రక సంఘటననూ వివరిస్తాను.’
సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజర్షి ఒక రాజ్యాన్ని పాలించేవాడు. నిత్యం సత్యనిష్ఠతో ప్రజలందరినీ తన సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ ధర్మనిష్ఠను కలిగి వుంటాడు. దాంతో రాజ్యంలో ఎక్కడా కరువు కాటకాలు, వ్యాధులు ఉండవు. కానీ, ఒకసారి తన రాజ్యంలో జరిగిన ఓ ఘోర పాపకార్యం వల్ల మూడేండ్లపాటు తీవ్ర అనావృష్టి ఏర్పడింది. ఈ విపత్తునుండి ప్రజలను గట్టెక్కించటానికి అంగీరస ముని ఈ ‘ఏకాదశి వ్రతదీక్ష’ను సూచిస్తాడు. ఆ మేరకు, ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని రాజ్యంలోని ప్రజలంతా నిష్ఠగా ఆచరించి శ్రీహరిని ఆరాధించారు. దాంతో తిరిగి రాజ్యం తన పూర్వవైభవాన్ని సంతరించుకొంది.” ఇలా ప్రతి ఒక్కరూ తమ పాపకర్మలనుండి విముక్తులై తన దివ్యసన్నిధానాన్ని చేరడానికి ప్రతి ఏడూ వచ్చే ‘తొలి ఏకాదశి’ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా శ్రీకృష్ణుడు సూచించాడు.