న్యూఢిల్లీ : రాబోయే కొద్ది రోజుల్లోనే 7.5 మిలియన్ డోసుల మోడెర్నా కొవిడ్ టీకాలు భారత్కు అందనున్నాయి. నష్ట పరిహారం మాఫీతో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ప్రభుత్వం సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని, కాంట్రాక్టుపై పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని.. ఈ ప్రస్తుతం చర్చల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందని పేర్కొన్నారు.
అయితే నష్టపరిహార నిబంధనపై ఏకాభిప్రాయం ఇంకా కుదరనందున మోడెర్నా టీకాలు దేశంలో ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ కొవాక్స్ ద్వారా భారత్కు 7.5 మిలియన్ మోతాదుల మోడెర్నా టీకాలు అందించనున్నట్లు చెప్పారు. భారత్లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి జూన్లోనే డీసీజీఐ అనుమతించింది.
ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు సిప్లా కంపెనీకి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టీకాను అత్యవసర వినియోగానికి సైతం అనుమతి ఇచ్చింది. అయితే, నష్టపరిహార నిబంధన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ.. పరిశీలన కోసం వాటిని ఇటీవలే అమెరికాకు చెందిన టీకా తయారీ సంస్థలకు పంపినట్లు సమాచారం.