శ్రీశైలం : త్రయోదశి తిథి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారలకు బుధవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం జ్వాలా వీరభద్రునికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. అలాగే సాయంత్రం పరోక్ష సేవగా శనగల బసవన్నకు విశేష పూజలు నిర్వహించారు. అభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపి, అర్చక పండితులు మహా సంకల్పాన్ని పఠించి.. శనగలు నైవేద్యంగా సమర్పించారు.
ఇప్పటి వరకు ఆలయంలో 12 పరోక్ష సేవలు నిర్వహిస్తున్నామని, 13వ సేవగా బసవన్న అభిషేకం నిర్వహిస్తుండగా విశేష స్పందన వస్తుందని తెలిపారు. శ్రీశైలం దేవస్థానం చేపడుతున్న పరోక్ష సేవలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు తమ గోత్రనామాలను tms.ap.gov.in లేదా www.srisailadevasthanam.orgలో నమోదు చేసుకోవాలని ఈఓ కోరారు. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ 8333901851-6 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.