న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కరోనా మరణాలపై కేంద్రం అబద్ధాలు చెప్పిందని, దీనిపై కేసు నమోదు చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు రోగులు దవాఖానల్లో, రోడ్లపై సైతం మరణించారని వార్తలు వచ్చాయని, ఇది నిజమేనా? అంటూ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మంగళవారం రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పందిస్తూ ప్రాణవాయువు కొరతతో కొవిడ్ రోగులు ఎవరూ మృతి చెందలేదని రాష్ట్రాలు పేర్కొన్నాయని సమాధానం ఇచ్చారు.
ఈ ప్రకటనపై శివసేన ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన ప్రకటన విన్న తర్వాత తనకు నోట మాటరాలేదన్నారు. ఆ నెలల్లో ఇంత ‘బీభత్సం’ జరిగినా ప్రాణవాయువు కొరతతో కొవిడ్ రోగులు మృతి చెందలేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. పెగాసస్ వివాదంపై స్పందిస్తూ దాచడానికి ఏం లేనప్పుడు, ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత గానీ, సుప్రీంకోర్టు చేతగానీ విచారణ జరిపించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.