బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయారుచేసింది. బీజింగ్ నుంచి షాంఘైకి వేయి కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కేవలం రెండున్నర గంటల్లో చేరుకుంటుంది. విమానంలో ఈ దూరాన్ని చేరుకునేందుకు మూడు గంటల సమయం పడుతుండగా హైస్పీడ్ రైళ్లకు ఐదున్నర గంటల సమయం పడుతోంది.
ఫాస్టెస్ట్ ట్రైన్ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే 1460 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ, ముంబై మధ్య ఈ రైలు మూడు గంటల్లోపే గమ్యస్ధానాన్ని చేరుకోగలదు. సాధారణ రైళ్లు ప్రయాణించేందుకు అనువైన చక్రాలు, సంప్రదాయ ట్రాక్లకు భిన్నంగా ఈ రైళ్లు ట్రాక్కు కొద్దిగా పైఎత్తున ఎలక్ర్ట్రోమాగ్నెట్స్ ద్వారా మాగ్నెటిక్ లెవిటేషన్తో ప్రయాణిస్తాయి. అత్యంత ఖరీదైన ఈ రైళ్లను జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, దక్షిణ కొరియా, చైనా వంటి కొద్ది దేశాలే ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. చైనా రెండు దశాబ్ధాల నుంచే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నా అది పరిమిత స్ధాయిలో ఉంది. ప్రస్తుతం షాంఘై ఎయిర్పోర్ట్ నుంచి సిటీ వరకూ చిన్నపాటి మాగ్లెవ్ లైన్ ఉందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.