హైదరాబాద్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో పాటు వాటి పేరెంట్ కంపెనీ మెటా సంస్థపై హైదరాబాద్లో కేసు నమోదు అయ్యింది. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేసిన సమయంలో ప్రధాని మోదీ(PM Modi)ని టార్గెట్ చేస్తూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మార్ఫింగ్ వీడియోలను పోస్టు చేశారు. అయితే ఆ ఎఫ్బీ, ఇన్స్టా అకౌంట్లపై సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 29వ తేదీన టీ సాయికిరణ్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా సీసీ సభ్యుడిగా ఉన్నాడతను. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ ఎస్పీ ముఖర్జీ భవన్లో అతను నివాసితుడు.
సోషల్ మీడియాను సర్ఫింగ్ చేస్తున్న సమయంలో.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రీల్స్, పోస్టులు సోషల్ మీడియాలో కనిపించాయని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే రీతిలో ఆ వీడియోలను ప్రజెంట్ చేశారని అతను ఆరోపించారు. ఎఫ్బీ, ఇన్స్టా రీల్స్, పోస్టులకు చెందిన సుమారు 20 యూఆర్ఎల్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కాంటెంట్ విద్వేషాన్ని రెచ్చగొడుతుందని, తప్పుడు సమచారాన్ని వ్యాప్తి చేస్తోందని, శత్రుత్వాన్ని పెంచుతోందన్నారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లను భద్రపరుచాలని పోలీసుల్ని అతను కోరాడు.
ఆ అకౌంట్స్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తులను గుర్తించాలని, ఆ కేసును దర్యాప్తు చేపట్టాలని, అకౌంట్ డిటేల్స్ కోసం మెటా ఫ్లాట్ఫామ్తో సహకరించాలన్నారు. మార్పింగ్ చేసిన రీల్స్ను ప్రోత్సహించిన మెటా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఏఎస్ఐ హరి రామ్ కిరణ్ కేసును రిజిస్ట్ చేశారు. 66(C), 67 ఐటీచట్టం, బీఎన్ఎస్లోని 353(2), 336(4) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఇన్స్పెక్టర్ పీ జయశంకర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.