– ఐటీసీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
– కోయగూడెం ఐటీసీ గేటు వద్ద టెంటు వేసి బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 15 : ఎకరం భూమి కోసం ఓ కుటుంబం న్యాయ పోరాటం చేస్తున్న ఘటన కోయగూడెం పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. బాధితుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోయగూడెం ఐటీసీ గేటు వద్ద టెంటు వేసి ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాదావత్ నాగులుకు సారపాక గ్రామంలో సర్వే నెంబర్ 262లో 29 ఏళ్ల క్రితం ఎకరం అసైన్డ్ భూమి ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమి ఐటీసీ పీఎస్పీడీ పరిశ్రమ స్థాపన కోసం కేటాయించిన భూముల్లో కలిసిపోయింది. అప్పటి నుండి నాగులు ఉద్యోగం, తగిన పరిహారం కోసం యాజమాన్యం, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. హైకోర్టు, జిల్లా యంత్రాగం, తాసీల్దార్ ఇచ్చిన విచారణ నివేదికల్లో సర్వే నంబర్ 262లో ఎకరం భూమికి చట్టబద్ధమైన హక్కుదారు బాదావత్ నాగులు అని తేలినా ఐటీసీ నుండి 29 ఏళ్లుగా ఐటీసీ యాజమాన్యం నుండి మౌఖిక హామీలు తప్ప ఎలాంటి లిఖిత పూర్వక న్యాయం జరగలేదు.
విసిగివేసారిన బాధితుడు నాగులు గత జూలై 15న కలెక్టర్కు నాకు న్యాయం జరగడం లేదు.. అందుకే నా సొంత ఎకరం భూమిలో నేను శాంతియుతంగా వెళ్లి కూర్చుంటాను.. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్య కాదు.. నా చట్టబద్ధమైన హక్కు కోసమే అని ముందస్తు సమాచారంతో వినతిపత్రం ఇచ్చాడు. 21న పిటిషనర్ ఇచ్చిన సమాచారం పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ ఐటీసీ జనరల్ మేనేజర్ తో పాటు భద్రాచలం సబ్ కలెక్టర్, బూర్గంపహాడ్ తాసీల్దార్, ఎస్ఐ, కోల్కతాలోని ఐటీసీ ఎండీలకు లేఖలు పంపి ప్రదేశాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలు పరిరక్షించి తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే తాజాగా నాగులు కుటుంబ సభ్యులు కోయగూడెం ఐటీసీ గేటు వద్ద టెంటు వేసుకుని మంగళవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని బీష్మించి కూర్చున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి ఐటీసీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఎకరం భూమి కోసం 29 ఏళ్లుగా పోరాటం