Bhadrachalam | భద్రాచలం, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Warning) జారీ చేశారు.
విదర్భ, ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహితలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇంద్రావతి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాల్చింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మేడిగడ్డ, భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 12 నుంచి 17 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని వరద ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. SRSP, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

Bhadrachalam3
వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ‘గోదావరి ఫ్లడ్ మాన్యువల్’ ప్రకారం వరద నివారణ విధులు నిర్వర్తించే అధికారులందరూ తక్షణమే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లు, సబ్ కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Bhadrachalam1
ఒకవైపు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది, మరోవైపు స్నాన ఘట్టాల వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు నది నీటిమట్టం ఏకంగా 14 అడుగుల పెరిగింది. పవిత్ర స్నానాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రమాదాన్ని గ్రహించకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో దిగుతున్నారు. అయితే, ఘాట్ వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఎక్కడా కనిపించకపోవడం, భక్తులను హెచ్చరించాల్సిన గ్రామపంచాయతీ, రెవెన్యూ లేదా పోలీస్ సిబ్బంది ఆచూకీ లేకపోవడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతున్న వేళ, ఘాట్ల వద్ద తక్షణమే మైకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, భద్రతా సిబ్బందిని కాపలా ఉంచాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులను అమర్చాలని ప్రజలు కోరుతున్నారు..