న్యూఢిల్లీ : బర్డ్ఫ్లూ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాల్సిన అవసరం ఉందని, నమూనాలు సైతం తీసుకోవాలన్నారు. వైరస్తో బాలుడు మృతి చెందిన ప్రాంతంలో ఫౌల్ట్రీల్లో మరణాలపై ఆరా తీయాలన్నారు. మంగళవారం దేశంలో తొలి బర్డ్ఫ్లూ మరణం నమోదైంది. హర్యానాకు చెందిన 11 సంవత్సరాలు బాలుడు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా బారినపడి ఢిల్లీ ఏయిమ్స్లో మృతి చెందాడు.
ఈ సందర్భంగా ఢిల్లీ ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ హెచ్5ఎన్1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదేనని, వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకడం గుర్తించలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఫౌల్ట్రీల్లో పని చేసే వారంతా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. వేవియన్స్లోని మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ మాట్లాడుతూ ఇన్ఫ్లూయెంజా జూనోసిస్ అని, ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు ఆధారాలు లేవన్నారు.
సరిగ్గా వండిన ఫౌల్ట్రీ ఉత్పత్తులను తింటుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారం వండినప్పుడు వైరస్ నాశనమవుతుందన్నారు. గతంలో ఫౌల్ట్రీల్లో బర్డ్ఫ్లూ కేసులు నమోదైన సమయంలో ప్రారంభంలోనే వ్యాప్తిని నివారించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. హెచ్5ఎన్1 వైరస్ సాధారణంగా వలస పక్షుల ద్వారా ఫౌల్ట్రీకి వ్యాపిస్తుందని, అందులో సన్నిహితంగా పని చేసే వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.